Teacher transfers: ఉపాధ్యాయులకూ.. స్థానచలనం
ABN, Publish Date - May 17 , 2025 | 12:31 AM
Teacher Staff adjustment ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. దీనిపై విధివిధానాలను విద్యాశాఖ ఖరారు చేసింది. టీచర్లకు ఎన్టైటిల్మెంట్ పాయింట్ల కేటాయింపుపై కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కచ్చితంగా బదిలీ కావాల్సిన హెచ్ఎంలు, టీచర్ల కటాఫ్ తేదీలను కూడా నిర్ధేశించింది. ఒకే పాఠశాలలో 2020 ఆగస్టు 31 నుంచి పనిచేస్తున్న హెచ్ఎంలు, 2017 ఆగస్టు 31 ముందు నుంచి పనిచేస్తున్న ఇతర టీచర్లు తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే.
నేడో, రేపో షెడ్యూల్ విడుదల
జిల్లాలో 3వేల మంది బదిలీ అయ్యే అవకాశం
మోడల్ ప్రైమరీ పాఠశాలలకు హెచ్ఎంలుగా ఎస్ఏలు
తొలిసారిగా నెగిటివ్ పాయింట్లు
నరసన్నపేట, మే 16(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. దీనిపై విధివిధానాలను విద్యాశాఖ ఖరారు చేసింది. టీచర్లకు ఎన్టైటిల్మెంట్ పాయింట్ల కేటాయింపుపై కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కచ్చితంగా బదిలీ కావాల్సిన హెచ్ఎంలు, టీచర్ల కటాఫ్ తేదీలను కూడా నిర్ధేశించింది. ఒకే పాఠశాలలో 2020 ఆగస్టు 31 నుంచి పనిచేస్తున్న హెచ్ఎంలు, 2017 ఆగస్టు 31 ముందు నుంచి పనిచేస్తున్న ఇతర టీచర్లు తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే. ఉమ్మడి జిల్లాలో సుమారు 10,850 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తి చేసినవారు సుమారు 1200మంది ఉన్నారు. సరిపడా విద్యార్థులు లేక రేషన్లైజేషన్ (హేతుబద్ధీకరణ) కు గురైనవారు మరో 1800 వరకు ఉన్నారు. మొత్తంగా 3వేల మంది వరకు ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే. ఈ ఏడాది రెండేళ్లు సర్వీసు చేసిన వారికి బదిలీకి అవకాశం ఇచ్చారు. ఉపాఽధ్యాయులకు ప్రాధాన్యత, బదిలీలలో మార్గదర్శకాలను జారీ చేశారు. పాఠశాలలు పునర్వివస్థీకరణ నేపథ్యంలో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలకు జిల్లాలో 249 మంది ఎస్ఏలను హెచ్ఎంలుగా కన్వర్షన్ చేశారు. ప్రాథమిక పాఠశాలలు, ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు, 1-10 తరగతి ఉన్న ఉన్నత పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయగా, ఇంకా 14 మంది ఎస్జీటీలు సర్ప్లస్గా ఉన్నారు. ముందుగా హెచ్ఎంలను బదిలీ చేస్తారు. తర్వాత అర్హులైన ఎస్ఏలకు హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించి వారికి స్థానాలను కేటాయిస్తారు. అనంతరం ఏస్ఏలు, ఎస్జీటీల బదిలీలు చేపడతారు. వెబ్లో దరఖాస్తు కూడా ముందుగా హెచ్ఎంలకు, తర్వాత స్థానాల్లో ఎస్ఏలు, ఎస్జీటీలకు అవకాశం ఇవ్వనున్నారు. దరఖాస్తుల పరిశీలనకు జిల్లాకేంద్రంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయ బదిలీలపై సంఘాలు కొన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అనంతరం మార్పులు, చేర్పులతో బదిలీలపై షెడ్యూల్ను శనివారం లేదంటే సోమవారం విడుదల చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే జిల్లాలో బదిలీల పక్రియ చేపడతామని డీఈవో తిరుమల చైతన్య తెలిపారు. ప్రత్యేక కౌంటర్లును ఏర్పాటు చేసి బదిలీల దరఖాస్తులను పరిశీలించేందుకు సిబ్బందిని నియమించామన్నారు.
పాయింట్ల కేటాయింపు ఇలా ...
కేటగిరీ-1 పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న టీచర్లకు సంవత్సరానికి ఒక పాయింట్, కేటగిరీ-2 మునిసిపల్ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ఏడాదికి రెండు పాయింట్లు, కేటగిరీ-3 గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ఏడాదికి మూడు పాయింట్లు, కేటగిరీ-4 మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ఏడాదికి ఐదు పాయింట్లు కేటాయిస్తారు.
ఉపాధ్యాయులు పనిచేసిన మొత్తం కాలానికి సంవత్సరానికి 0.5 పాయింట్లు
భార్యభర్తలు ప్రభుత్వ ఉద్యోగులు / ఉపాధ్యాయులు అయితే వారికి ఐదు పాయింట్లు కేటాయిస్తారు. భార్యాభర్తల్లో ఒకరికి మాత్రమే ఇవి వర్తిస్తాయి. అయితే భార్య లేదా భర్త దగ్గరకు బదిలీ కోరుకోవాల్సి ఉంటుంది. భార్య లేదా భర్త ఇద్దరూ తప్పనిసరిగా బదిలీ కావాల్సి వస్తే ఒకరికి మాత్రమే ఈ పాయింట్లు వర్తిస్తాయి.
అవివాహిత మహిళా టీచర్లకు ఐదు పాయింట్లు
40 నుంచి 55 శాతం వరకు శారీరక వైకల్యం ఉన్నవారికి, 60శాతం నుంచి 70శాతం వినికిడి లోపం ఉన్న వారికి ఐదు పాయింట్లు
40 శాతం దృష్టిలోపం ఉన్నవారికి, 56నుంచి 59 శాతం శారీరక వైకల్యం గల వారికి ఏడు పాయింట్లు
ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు ఐదు పాయింట్లు
విడాకులు తీసుకున్న మహిళలు(మళ్లీ పెళ్లి చేసుకోనివారు) ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీపీఎస్ఎఫ్లో పనిచేసి ప్రస్తుతం టీచర్లుగా పనిచేస్తున్న వారికి ఐదు పాయింట్లు
రెండేళ్లుగా పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ నిర్వహిస్తున్న వారికి ఐదు పాయింట్లు
పునర్విభజనలో తప్పనిసరిగా బదిలీ అయ్యేవారికి ఐదు పాయింట్లు కేటాయిస్తారు.
ప్రాధాన్య కేటగిరీ వీరికే ...
వంద శాతం దృష్టి లోపం గల వారికి ప్రాధాన్యమిస్తారు.
75శాతం దృష్టి లోపం, 70శాతం నుంచి 79 వరకు శారీరక వైకల్యం గల వారికి, 70శాతం పైగా వినికిడి లోపం ఉన్న వారికి రెండో ప్రాధాన్యత
పునర్వివాహం చేసుకోని వితంతువు
క్యాన్సర్, ఓపెన్హార్ట్ సర్జరీ, బోనోటీసీ, కిడ్నీ మార్పిడి, డయాలసిస్, స్పైనల్ సర్జరీ చేయించుకున్న వారికి
స్పౌజ్ లేదా పిల్లలు మానసిక రుగ్మతతో జుననైల్ డయాలసిస్, తలసేమియా, హీమోఫిలియా, కండరాల క్షీణితకు వైద్య చికిత్స పొందుతున్న వారికి అవకాశం ఇస్తారు.
నెగిటివ్ పాయింట్లు
టీచర్ల బదిలీల్లో మొదటిసారిగా నెగిటివ్ పాయింట్లు ప్రవేశపెట్టారు. అఽధికారుల అనుమతి లేకుండా అనధికారకంగా విధులకు గైర్హాజరైన టీచర్లకు నెలకు ఒక పాయింట్ చొప్పున గరిష్టంగా 10 నెగిటివ్ పాయింట్లు తీసివేస్తారు. వీరిపై క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయి.
బదిలీల్లో ఇద్దరు ముగ్గురు టీచర్లకు ఒకే ఎన్టైటిల్మెంట్ పాయింట్లు వస్తే సర్వీసులో సీనియార్టీకి మొదటి ప్రాధాన్యత, ఒకే సర్వీసు ఉంటే పుట్టిన తేదీని బట్టి మహిళా టీచర్లకు ఆ తర్వాత ప్రాధాన్యత లభిస్తుంది.
Updated Date - May 17 , 2025 | 12:31 AM