farmer services: ‘రైతు సేవ’లకు దూరం!
ABN, Publish Date - Aug 04 , 2025 | 12:20 AM
In complete rythu seva kendram రైతులకు ప్రభుత్వ సేవలు మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంతో రైతుభరోసా(ప్రస్తుతం రైతుసేవా) కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు గత వైసీపీ ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు చేసింది. విత్తనాలు, ఎరువుల పంపిణీతోపాటు పంట నమోదు, కొనుగోలు ప్రక్రియలన్నీ వీటి ద్వారా నిర్వహించాలని భావించింది. కానీ జిల్లాలో చాలాచోట్ల భవనాలు పూర్తిచేయలేదు.
జిల్లాలో చాలాచోట్ల పూర్తికాని కేంద్రాలు
బిల్లులు చెల్లించని వైసీపీ ప్రభుత్వం
ఇరుకు గదుల్లో నిర్వహణతో ఇబ్బందులు
ఆందోళనలో రైతులు
టెక్కలి రూరల్, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి):
టెక్కలి మండలం అక్కవరంలో 615 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి విడుదలైన ఉపాధిహామీ నిధులతో రైతుభరోసా కేంద్రాన్ని నిర్మించారు. కానీ, కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో భవనాన్ని అప్పగించలేదు. ప్రారంభానికి నోచుకోక.. పిచ్చిమొక్కల మధ్య రైతుభరోసా కేంద్రం దర్శనమిస్తోంది. గత్యంతరం లేక గ్రామానికి చెందిన సామాజిక భవనంలోనే రైతుసేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అందులోనే ఎరువులు నిల్వ ఉంచడం, విధులు నిర్వహించడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
టెక్కలి మండలం కె.కొత్తూరు సచివాలయం పరిధిలో 610 ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తున్నారు. ఇక్కడ కూడా రైతుభరోసా కేంద్రం నిర్మించినా.. బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో పాత పంచాయతీ కార్యాలయంలోని ఇరుకు భవనంలోనే విధులు నిర్వహిస్తున్నారు.
రైతులకు ప్రభుత్వ సేవలు మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంతో రైతుభరోసా(ప్రస్తుతం రైతుసేవా) కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు గత వైసీపీ ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు చేసింది. విత్తనాలు, ఎరువుల పంపిణీతోపాటు పంట నమోదు, కొనుగోలు ప్రక్రియలన్నీ వీటి ద్వారా నిర్వహించాలని భావించింది. కానీ జిల్లాలో చాలాచోట్ల భవనాలు పూర్తిచేయలేదు. కొన్నిచోట్ల భవనాలు పూర్తయినా.. బిల్లులు చెల్లించకపోవడంతో ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఫలితంగా రైతులకు సేవలు దూరమై.. మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో 656 రైతుభరోసా కేంద్రాలు ఉండగా.. 289 భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. 162 కేంద్రాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి నిర్మాణానికి గత ప్రభుత్వం సుమారు రూ.91.30 కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపించింది. కానీ, బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణాలు సక్రమంగా సాగలేదు. కూటమి ప్రభుత్వంపై ఈ భారం పడనుంది.
పరికరాలు వృథా
రైతుసేవా కేంద్రాల్లో కియోస్క్ యంత్రానికి రూ.80వేలు, రైతులకు అవగాహన కల్పించేందుకు టీవీ కోసం రూ.లక్ష చొప్పున ఇలా తదితర పరికరాల కోసం డబ్బులు వెచ్చించారు. కానీ బ్యాటరీలు పనిచేయకపోవడం, విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం తదితర సమస్యలతో పరికరాలు నిరుపయోగంగా మారాయి. కొన్ని భవనాల్లో ఇరుకు గదులు కారణంగా కంప్యూటర్ ఉంచడానికి సైతం స్థలం లేని పరిస్థితి కనిపిస్తోంది. కొన్నిచోట్ల టీవీలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి. వినియోగంలోకి తీసుకురావాల్సిన ఏజెన్సీ కనిపించడం లేదు. ప్రస్తుతం వీఏఏలు సెల్ఫోన్ ద్వారా పనులు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో టీవీలు, కియోస్క్ యంత్రాల కంపెనీలకు లబ్ధి చేకూరింది తప్ప.. తమకు ప్రయోజనం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి భవనాల నిర్మాణాలు పూర్తిచేయాలని, సేవలు సక్రమంగా అందజేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం
రైతుసేవా కేంద్రం లేక ఇబ్బందులు పడుతున్నాం. ఇరుకు గదిలోనే ఎరువులు పంపిణీ చేస్తున్నారు. పశువులకు సంబందించిన మందులతోపాటు అధికారులు అక్కడే విధులు నిర్వహించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఎరువుల పంపిణీ వల్ల గది లోపలికి వెళ్లలేని పరిస్థితి.
- కె.తవిటయ్య, అక్కవరం, రైతు,
..................
భవనం నిర్మించి వదిలేశారు
రైతుసేవా కేంద్రం నిర్మించినా.. భవనం ప్రారంభం కాలేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. కొత్త భవనానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణానికి మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల నిధులు విడుదలు చేశారు. ఇంకా పనులు ప్రారంభం కాలేదు.
- బి.నరసయ్య, అక్కవరం, రైతు
..................
బిల్లులు చెల్లించకే
గతంలో రైతుభరోసా కేంద్రాలు నిర్మాణం పూర్తయినా.. బిల్లులు ఇవ్వకపోవటంతో సంబంధిత కాంట్రాక్టర్లు భవనాలు ఇవ్వడం లేదు. దీంతో కొంత ఇబ్బంది ఉంది. కానీ ప్రభుత్వ భవనాల్లో అధికంగా విధులు నిర్వహిస్తున్నాం.
- కె.జగన్మోహన్రావు, ఏడీ, వ్యవసాయశాఖ టెక్కలి
Updated Date - Aug 04 , 2025 | 12:20 AM