Jee results: ‘జేఈఈ’లో సిక్కోలు సత్తా
ABN, Publish Date - Jun 03 , 2025 | 12:18 AM
JEE Results in toppers జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. నరసన్నపేట మండలం మారుమూల గ్రామమైన దేవాదికి చెందిన ధర్మాన జ్ఞాన రుత్విక్సాయి ప్రతిభ చూపారు. 360 మార్కులకుగాను 310 మార్కులు సాధించి జాతీయస్థాయిలో ఓపెన్ కేటగిరి విభాగంలో 18వ ర్యాంకు.. ఓబీసీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచారు.
రుత్విక్సాయికి 18వ ర్యాంకు
ఓబీసీ విభాగంలో ఒకటో స్థానం
నరనసన్నపేట, జూన్ 2(ఆంధ్రజ్యోతి): జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. నరసన్నపేట మండలం మారుమూల గ్రామమైన దేవాదికి చెందిన ధర్మాన జ్ఞాన రుత్విక్సాయి ప్రతిభ చూపారు. 360 మార్కులకుగాను 310 మార్కులు సాధించి జాతీయస్థాయిలో ఓపెన్ కేటగిరి విభాగంలో 18వ ర్యాంకు.. ఓబీసీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచారు. జ్ఞాన రుత్విక్సాయి తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. తండ్రి ధర్మాన శంకరనారాయణ నరసన్నపేట మండలం చెన్నాపురం పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి కొండల లత నరసన్నపేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఫిజిక్స్ అసిస్టెంట్. జ్ఞానరుత్విక్ సాయి.. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవారు. శ్రీకాకుళం మునసబుపేట గాయిత్రీ పాఠశాలలో ఎల్కేజీ నుంచి ఆరోతరగతి వరకు చదివారు. ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు విజయవాడలోని శ్రీచైతన్య విద్యాసంస్థల్లో చదివారు. పదోతరగతిలో 600 మార్కులకుగాను 587 మార్కులు, ఇంటర్లో 988 మార్కులు సాధించారు. ఇంటర్ చదువుతున్న సమయంలో ఫిజిక్స్ ఒలింపియాడ్ పోటీల్లో ప్రతిభ చూపి మే 4 నుంచి 12 వరకు సౌదీఅరిబియాలో జరిగిన ఏసియాన్ దేశాల పోటీలకు ఎంపికయ్యారు. మెయిన్స్లో 99.985 పర్సంటైల్ పొంది జాతీయస్థాయిలో 294వ ర్యాంకు సాధించారు. రుత్విక్ ప్రతిభపై తల్లిదండ్రులతోపాటు అమ్మమ్మ లక్ష్మీబాయ్, మేనమేమ కొండల లక్ష్మణబాబు, పెద్దమ్మ లీల, పిన్ని జ్యోతి, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
చిన్ననాటి కల నేరవేరింది
ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ చదవాలని చిన్నప్పటీ నుంచి నా తల్లిదండ్రులు తరచూ చెబుతుండేవారు. ఆ కల నేడు నేరవేరిందని ధర్మాన జ్ఞాన రుత్విక్సాయి అలియాస్ సంతోష్ తెలిపారు. ‘తల్లిదండ్రుల మార్గదర్శకాల ప్రకారం ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాను. ఐఐటీ అడ్వాన్స్డ్ పేపర్లు కఠినంగా ఇచ్చినా.. ప్రశ్నలు సుధీర్ఘంగా ఉండడం వల్ల వాటిని అర్థం చేసుకోవడానికి ఉత్తరాది కన్నా దక్షిణాది విద్యార్థులకు కొంచెం సమయం పడుతుంది. ఐఐటీకి సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఆంగ్ల భాషపై పట్టు అవసరం. ముఖ్యంగా ప్రశ్నలు చదివి అర్థం చేసుకునేలా ప్రాక్టీసు చేయాలి. ఏడాది ముందు నుంచే ప్రాక్టీసు చేశాను. అందుకు తగిన ఫలితంగా మంచి ర్యాంకు రావడం ఆనందంగా ఉంద’ని రుత్విక్ తెలిపారు. దేశంలో అత్యున్నతమైన ముంబై ఐఐటీలో సీఎస్ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఇండియన్ సివిల్ సర్వీసుకు ప్రిపరేషన్ ప్రారంభించి.. ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమన్నారు. ఇటీవల జిల్లాకు చెందిన బాన్న వెంకటేష్, గోపాలకృష్ణ , శిబిచక్రవర్తి ఐఏఎస్గా ఎంపికయ్యారు. వారిని ఆదర్శంగా తీసుకోని సివిల్స్పై దృష్టి సారించనున్నట్లు జ్ఞాన రుత్విక్ తెలిపారు.
వ్రికమ రాజా.. 216వ ర్యాంకు
ఎచ్చెర్ల, జూన్ 2(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో నివాసం ఉంటున్న బుడుమూరు విక్రమరాజా జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో 360 మార్కులకు గాను 275 మార్కులు సాధించారు. ఓపెన్ కేటగిరీలో 216వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 30వ ర్యాంకు పొందారు. విక్రమరాజా స్వస్థలం పొందూరు మండలం పిల్లలవలస. ఈ విద్యార్థి తండ్రి సోమరాజు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు కాగా, తల్లి కళ్యాణి ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నారు. విక్రమరాజా ఇంటర్మీడియట్ సీబీఎస్సీ సిలబస్లో 95 శాతం మార్కులు, పదో తరగతిలో 591 మార్కులు సాధించారు. చెన్నై ఐఐటీలో ఈసీఈ బ్రాంచ్లో ఇంజనీరింగ్ పూర్తిచేసి, సివిల్స్ సాధించాలన్నదే తన ఆశయమని విక్రమరాజా తెలిపారు.
వెంకట శ్రీవినయ్.. 334వ ర్యాంకు
పొందూరు, జూన్ 2(ఆంధ్రజ్యోతి): పొందూరు మండలం అచ్చిపోలవలస పంచాయతీ సింగూరు గ్రామానికి చెందిన పైడి వెంకట శ్రీవినయ్.. జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 334వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 50వ ర్యాంకు సాఽధించారు. విద్యార్ధి తండ్రి పైడి శ్రీహరి విశాఖపట్నంలోని సెంట్రల్జైల్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. తల్లి కౌసల్య గృహిణి. శ్రీవినయ్ విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తిచేశారు. తల్లిదండ్రులతోపాటు తాతపైడి వెంకటనర్సయ్య ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకును సాధించానని శ్రీ వినయ్ తెలిపారు. ఐఐటీ ముంబైలో కంప్యూటర్సైన్స్ చదవాలన్నదే తన ఆశయమని, ఐఏఎస్ చదివి దేశానికి సేవ చేయాలన్నదే తన లక్ష్యమన్నారు.
రోనిత్రాం నాయుడు.. 1,692వ ర్యాంకు
రణస్థలం, జూన్ 2(ఆంధ్రజ్యోతి): రణస్థలం మండలం గొర్లెపేటకు చెందిన ముల్లు రోనిత్రాంనాయుడు జేఈఈ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ విభాగంలో 1,692 ర్యాంకు, ఓబీసీలో 293 ర్యాంకు సాధించారు. రోనిత్రాంనాయుడు విశాఖపట్నంలోని నారాయణ కళాశాలలో చదువుతున్నారు. తండ్రి ముల్లు శ్రీనివాసరావు జి.సిగడాం ఎంఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి మజ్జి మోహిని టెక్కలి మండలం చాకిపల్లి జడ్పీ హైస్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.
రమణ.. 1,791వ ర్యాంకు
రణస్థలం మండలం లెంకపేట గ్రామానికి చెందిన పిషిని రమణ ఆలిండియా ఓపెన్ విభాగంలో 1,791 ర్యాంకు, ఓబీసీలో 313 ర్యాంకు సాధించారు. రమణ కూడా విశాఖపట్నంలోని నారాయణ కళాశాలలో చదువుతున్నారు. తల్లిదండ్రులు రామకృష్ణ, ఆదిలక్ష్మీ.. రణస్థలంలోని పండ్ల వ్యాపారం చేస్తున్నారు.
నిర్మిత్.. 487వ ర్యాంకు
పాతపట్నం, జూన్ 2(ఆంధ్రజ్యోతి): పాతపట్నంలోని రత్నాలపేట వీధికి చెందిన శాసనపురి నిర్మిత్ ఓపెన్ కేటగిరిలో 487వ ర్యాంక్, ఈబీసీలో 29వ ర్యాంక్ సాధించారు. నిర్మిత్ తండ్రి గోపీకృష్ణ వ్యాపారి కాగా తల్లి విజయ గృహిణి.
ప్రశాంత కార్తీక్.. 807వ ర్యాంకు
పాతపట్నం మండలం సరాలి గ్రామానికి చెందిన పప్పు ప్రశాంతకార్తీక్ ఓపెన్ కేటగిరిలో 807వ ర్యాంక్, ఓబీసీలో 124వ ర్యాంకు సాధించారు. ప్రశాంతకార్తీక్ తండ్రి ఈశ్వరరావు, తల్లి లత ప్రభుత్వ ఉపాధ్యాయులే.
Updated Date - Jun 03 , 2025 | 12:18 AM