Karif sagu: సన్నాలు వద్దు.. ముదుగులే ముద్దు
ABN, Publish Date - Jun 17 , 2025 | 11:28 PM
Farmer interest Sustainable agriculture ఖరీఫ్లో వరిసాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే కొన్ని చోట్ల విత్తనాలు వేస్తున్నారు. ఈసారి సన్నాలు కన్నా.. ముదుగు వరి విత్తనాలు సాగుకే అధికశాతం రైతులు ఆసక్తి చూపుతున్నారు.
ఖరీఫ్లో సాగుకు రైతుల సన్నద్ధం
20 కేజీల విత్తనాలు రూ.1800
దోచుకుంటున్న వ్యాపారులు
నరసన్నపేట, జూన్ 17(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్లో వరిసాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే కొన్ని చోట్ల విత్తనాలు వేస్తున్నారు. ఈసారి సన్నాలు కన్నా.. ముదుగు వరి విత్తనాలు సాగుకే అధికశాతం రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ఈఏడాది సుమారు 5లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. గతేడాది సాంబమసూరి, 1204 తదితర సన్నాలు సాగు చేశారు. ముదుకు రకాలు కన్నా సన్నరకాలు దిగుబడి తక్కువగా వస్తాయి. కానీ బయట మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. 80కేజీల ధాన్యం బస్తా రూ.2,200 వరకు మిల్లర్లు కొనుగోలు చేస్తారు. గతేడాది సుమారు 1.12 లక్షల ఎకరాల్లో సన్నరకాలు సాగు చేశారు. పంట చేతికి వచ్చిన తర్వాత బహిరంగ మార్కెట్లో వ్యాపారులు వీటిని కొనుగోలు చేయలేదు. ఖరీఫ్లో సాగుచేసిన సన్నరకం ధాన్యం.. ఆడించిన తర్వాత చాలా శాతం ముక్కగా మారిపోవడంతో వీటి కొనుగోలుకు ఆసక్తిచూపలేదు. దీంతో గత్యంతరం లేక 80కేజీల బస్తాను రూ.1,600కు రైతులు విక్రయించారు. ఈ పరిణామం దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది రైతులు ముదుకు రకాలైన అమూల్య, 333, సంధ్య, సంపద స్వర్ణ వంటి రకాలను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయశాఖ కిలోకు రూ.10 సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేస్తున్నా.. చాలామంది రైతులు ముదుగురకాలైన వరి విత్తనాల కోసం ప్రైవేటు డీలర్లనే ఆశ్రయిస్తున్నారు. తెగుళ్లు ఆశించినా, అఽధిక దిగుబడి ఇచ్చే రకాలు అంటూ వ్యాపారులు ఈ విత్తనాలను విక్రయిస్తున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే విత్తనాలపై రైతులు మొగ్గు చూపకపోవడంతో ప్రైవేటు సీడ్స్కు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు అధిక ధరకు విక్రయిస్తున్నారు. తెలంగాణ, నూజివీడు తదితర ప్రాంతాల నుంచి తెప్పించిన రీచెర్స్ వెరైటీలు 333, అమూల్య, సంపద స్వర్ణ తదితర విత్తనాలు 20 కేజీల బస్తా గతేడాది రూ.వెయ్యి నుంచి రూ.1,200లోపు ఉండేది. ఈ ఏడాది అదేబస్తాను రూ.1400 నుంచి రూ.1800 వరకు విక్రయిస్తున్నారు. అమూల్య రకం విత్తనాలను కృత్రిమ కొరత సృష్టించి కొందరు డీలర్లు దోచుకుంటున్నారు.
నకిలీ విత్తనాలతో నష్టం
విత్తనాల ధరలు పెరిగి పోవడంతో నకిలీ విత్తనాల వ్యాపారులు రైతులను నిలువుదోపిడీ చేయడానికి సిద్ధమవుతున్నారు. బ్రాండెడ్ ఖాళీ సంచులను సంపాదించి వాటిలో నాసిరకం ధాన్యాన్ని నింపి.. మార్కెట్లో విక్రయిస్తున్నారు. రెండేళ్ల కిందట ఇదే మాదిరి నరసన్నపేటలో నకిలీ విత్తనాలు జోరుగా అమ్మకాలు సాగాయి. అప్పట్లో దీనివల్ల బాగా నష్టపోయిన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మంచి విత్తనాలను అందుబాటు ధరకే అందించాలని రైతులు కోరుతున్నారు.
Updated Date - Jun 17 , 2025 | 11:28 PM