Highway robbery: రాత్రివేళల్లో.. హైవేపై దోపిడీ
ABN, Publish Date - Jun 07 , 2025 | 12:29 AM
Nighttime crime జిల్లాలో జాతీయ రహదారిపై రాత్రివేళల్లో ఆగి ఉన్న వాహనదారులను బెదిరించి.. వారి నుంచి నగదు, ఫోన్లు, బైక్లు దోచుకుంటున్న ముఠా సభ్యులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈమేరకు శుక్రవారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి వివరాలు వెల్లడించారు.
బెదిరించి బైక్లు, డబ్బు, ఫోన్లు లాక్కెళ్తున్న వైనం
ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన ముఠా సభ్యులు
నిందితులందరూ రాజస్థానీయులే
శ్రీకాకుళం, జూన్ 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జాతీయ రహదారిపై రాత్రివేళల్లో ఆగి ఉన్న వాహనదారులను బెదిరించి.. వారి నుంచి నగదు, ఫోన్లు, బైక్లు దోచుకుంటున్న ముఠా సభ్యులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈమేరకు శుక్రవారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి వివరాలు వెల్లడించారు. ‘రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ముఠా సభ్యులు.. జిల్లాలో రణస్థలం మండలం కోష్ట వద్ద టెంట్లు వేసుకుని తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రాత్రివేళల్లో హైవేపై నేరాలకు పాల్పడేవారు. బయట పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను కూడా ఎత్తుకుపోయేవారు. ఇటీవల ఆమదాలవలస నుంచి బొడ్డేపల్లి సతీష్కుమార్.. తన స్నేహితుడితో కలిసి నందిగాం మండలం కనితూరులో వివాహ వేడుకకు వెళ్లారు. రాత్రి తిరిగి వస్తుండగా వర్షం కురుస్తుండటంతో హైవేపై విక్రంపురం బస్షెల్టర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని నిలిపి కాసేపు ఉన్నారు. రాజస్థాన్కు చెందిన ముఠా సభ్యులు.. వారిద్దరిపై దాడిచేశారు. కత్తులతో బెదిరించి వారి నుంచి రూ.6వేల నగదు, రెండు ఫోన్లు తీసుకుపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టారు. కోష్టలో నివాసముంటున్న రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కు చెందిన ముఠా ఆదిత్య పవార్(22), బంగారం పవార్(21), సుధీర్ పవార్(19), శరత్ షిండే(14), సంజు షిండే ముఠాగా ఏర్పడి.. టెక్కలి, నందిగాం, నరసన్నపేట, లావేరు తదితర ప్రాంతాల్లో హైవేపై అర్థరాత్రిళ్లు దోపిడీకి పాల్పడుతున్నట్టు గుర్తించారు. గురువారం సాయంత్రం టెక్కలి మండలం శ్యామసుందరాపురం వద్ద పోలీసులు మకాం వేసి.. రాజస్థాన్ ముఠా పట్టుకున్నారు. పట్టుబడిన నిందితుల్లో పవార్ అని పేర్లుగల ముగ్గురూ సొంత అన్నదమ్ములు అని తేలింది. మరో నిందితుడు సంజు షిండే పరారీలో ఉన్నాడు. నిందితులను అరెస్ట్ చేసి.. వారి నుంచి రూ.1.12 లక్షల నగదు, రెండు బైక్లు, 8 ఫోన్లు, 6 కత్తులు స్వాధీనం చేసుకున్నామ’ని ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. కేసులో పురోగతి చూపిన ఇన్స్పెక్టర్లు విజయ్కుమార్, చంద్రమౌళి, ఎస్ఐ మధుసూదనరావు, హెచ్సీ శ్యామ్, కానిస్టేబుళ్లు లోకనాథం, సంతోష్కుమార్, ఉమామహేశ్వరరావు, ప్రసాదరావు, భాస్కరరావును ప్రత్యేకంగా అభినందించారు.
Updated Date - Jun 07 , 2025 | 12:29 AM