గిట్టుబాటు ఏదీ?
ABN, Publish Date - May 25 , 2025 | 11:30 PM
Market rates Price drop సరుగుడు, నీలగిరి ధరలు తగ్గుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరలు గిట్టుబాటు కాక దిగులు చెందుతున్నారు.
తగ్గిన సరుగుడు, నీలగిరి ధరలు
ఆందోళనలో రైతులు
ఎచ్చెర్ల, మే 25(ఆంధ్రజ్యోతి): సరుగుడు, నీలగిరి ధరలు తగ్గుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరలు గిట్టుబాటు కాక దిగులు చెందుతున్నారు. జిల్లాలో ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, పొందూరు, జి.సిగడాం, శ్రీకాకుళం రూరల్, గార తదితర మండలాల్లో మెట్ట ప్రాంతాల్లో సరుగుడు, నీలగిరి విస్తారంగా సాగుచేస్తున్నారు. ఎచ్చెర్ల మండలంలోని కేశవరావుపేట జంక్షన్కు సమీపంలో కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి నుంచే సరుగుడు, నీలగిరి ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా ప్రాంతాలకు సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎగుమతులు చాలా వరకు తగ్గాయి. గతేడాది డిసెంబరులో 18 అడుగుల సరుగుడు కర్రల టన్ను రూ.9వేలకు విక్రయించేవారు. ప్రస్తుతం మిల్లర్లు ఏడు వేలకు మించి కొనుగోలు చేయడం లేదు. సరుగుడు కర్రల టన్ను రూ.6,700, నీలగిరి కర్రలు టన్ను రూ.6,800కు కొనుగోలు చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి.. సాగు చేయగా ఒక్కసారిగా ధర తగ్గిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూలీల డబ్బులు కూడా గిట్టుబాటు కావడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులను ఆదుకోవాలని జిల్లా సరుగుడు, నీలగిరి రైతుల అసోసియేషన్ అధ్యక్షుడు బస్వా గురుమూర్తిరెడ్డి, తదితర రైతులు కోరుతున్నారు.
మూతపడుతున్న కాగితపు పరిశ్రమలు-
క్రమేణా కాగితం వినియోగం తగ్గుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కంప్యూటీకరణకు, ఆన్లైన్ సేవలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కారణంగా కాగితపు పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జైపూర్ (ఒడిశా), ఏపీ రేయాన్స్ (వరంగల్), సిర్పూర్ కాగజ్నగర్ (తెలంగాణ) పరిశ్రమలు ఇప్పటికే మూతపడ్డాయి. జేకే పేపర్మిల్లు(రాయఘడ), ఏపీ పేపర్ మిల్లు(రాజమండ్రి), ఐటీసీ పేపర్ మిల్లు(భద్రాచలం) మాత్రమే కొనుగోలు చేస్తోంది. దీని వల్ల కూడా మద్దతు ధర రైతులకు అందడం లేదని ట్రేడర్లు చెబుతున్నారు.
Updated Date - May 25 , 2025 | 11:30 PM