న్యాయం కోసం భర్త ఇంటి ముందు నిరసన
ABN, Publish Date - Jun 12 , 2025 | 12:21 AM
శ్రీకాకుళం బలగ మెట్టు వద్ద ఉన్న ఓ ఇంటి వద్ద మహిళ కుమా రుడితో తనకు న్యాయం చేయాలని నిరసనకు దిగింది.
శ్రీకాకుళం క్రైం, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం బలగ మెట్టు వద్ద ఉన్న ఓ ఇంటి వద్ద మహిళ కుమా రుడితో తనకు న్యాయం చేయాలని నిరసనకు దిగింది. కాకినాడ వాకలపుడి శ్రీనివాసనగర్కు చెందిన బాధిత మహిళ దొండపాటి మంజుశ్రీ కథనం మేరకు.. శ్రీకాకుళంలోని బలగమెట్టుకి చెందిన వ్యక్తితో 2012లో మంజుశ్రీకి వివాహం జరిగింది. కాపురం కొన్నేళ్లు సాఫీగా సాగింది. ఇంతలో అదనపు కట్నం కోసం రోజూ భర్త వేధిస్తూ మానసికంగా హింసించేవాడు. వీరికి పదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే భర్త కోర్టులో విడాకులు తీసుకోకుండా గత ఏడాది మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ విషయమై మంజుశ్రీ శ్రీకాకుళం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు బాధితురాలు బలగ మెట్టులోని భర్త ఇంటి వద్ద న్యాయం కోసం పోరాటం చేసింది. విషయం తెలుసుకుని శ్రీకాకుళం టూటౌన్ పోలీసులు ఆమెను బలవంతంగా స్టేషన్కు తరలించారు. ఆమె భర్త ఇంటి వద్దకు వెళ్లకూడదని, కోర్టులో వ్యవహారం తేల్చుకోవాలని పోలీసులు పేర్కొనడం అన్యాయమని మంజుశ్రీ ఆవేదన వ్యక్తం చేసింది.
Updated Date - Jun 12 , 2025 | 12:21 AM