కొత్త ఉపాధ్యాయులు.. వచ్చే‘సార్’!
ABN, Publish Date - Jun 16 , 2025 | 11:47 PM
Government school appointments ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగిసింది. బదిలీ అయిన ఉపాధ్యాయులు సోమవారం కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరారు.
ఎమ్మార్సీల వద్ద సందడి
పాఠశాలల్లో విధుల్లో చేరిన గురువులు
నరసన్నపేట, జూన్ 16(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగిసింది. బదిలీ అయిన ఉపాధ్యాయులు సోమవారం కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరారు. ఉమ్మడి జిల్లాలో గ్రేడ్ -2 హెచ్ఎంలు, పీఎస్హెచ్ఎంలు, పీడీలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు మొత్తం 6,392 మంది ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 4,156 మందికి బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇందులో ఎస్జీటీలు 1,962 మంది ఉన్నారు. వారంతా సోమవారం మండల రిసోర్సు భవనాల్లో ఎంఈవోలకు రిపోర్టు సమర్పించారు. అనంతరం కొత్త పాఠశాలల్లో చేరారు. ఎస్జీటీలు సుమారు 70శాతం మేరకు అదే మండలాల్లో వేరొక పాఠశాలల్లో బదిలీ కాగా, 20శాతం పక్క మండలాలకు బదిలీపై వెళ్లారు. మరో 10శాతం ఎస్జీటీలు సుదూర ప్రాంతాల మండలాలకు బదిలీ అయ్యారు. నరసన్నపేట మండలంలో 52 మంది ఉపాధ్యాయులు బదిలీ కాగా 26 మంది మండల పరిధిలోని వారే. 25 మంది ఉపాధ్యాయులు సమీప మండలాల నుంచి బదిలీపై వచ్చారు. ఎంఈవోలకు రిలీవింగ్ కాపీలు అందజేసి జాయినింగ్ ఆర్డర్లతో పాఠశాలల్లోని విధుల్లో చేరారు.
Updated Date - Jun 16 , 2025 | 11:47 PM