Widow pensions: ఆగస్టు 1 నుంచి వితంతువులకు కొత్త పింఛన్లు
ABN, Publish Date - Jul 27 , 2025 | 11:39 PM
Government welfare scheme రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వితంతువులకు ఆగస్టు 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేయనుందని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం సంతబొమ్మాళి మండలం వడ్డివాడ వద్ద గరీబులగెడ్డ కాలువ నీటిని విడుదల చేశారు.
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
సంతబొమ్మాళి, జూలై 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వితంతువులకు ఆగస్టు 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేయనుందని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం సంతబొమ్మాళి మండలం వడ్డివాడ వద్ద గరీబులగెడ్డ కాలువ నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం అర్హులైన 1.20 లక్షల మంది వితంతువుల పింఛన్లు నిలిపివేసింది. వాటిని పునరుద్ధరించాం. ఖరీప్లో సాగునీటి ఇబ్బందులు లేకుండా కాలువల మరమ్మతులు చేపట్టాం. శివారు భూములకు సకాలంలో సాగునీరు అందేలా అధికారులతో ప్రణాళికలు సిద్ధం చేశాం. ఎన్నికల హామీలన్నీ నేరవేర్చుతున్నాం. త్వరలోనే అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాలో జమవుతాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంద’ని తెలిపారు. ఇదిలా ఉండగా గరీబులగెడ్డ కాలువ గట్టును మరో 300 మీటర్లు పొడిగిస్తే.. కోటబొమ్మాళి రైల్వేస్టేషన్కు వేళ్లేందుకు 50 తీరప్రాంత గ్రామాలకు ఉపయోగంగా ఉంటుందని బోరుభద్ర గ్రామస్థులు మంత్రి అచ్చెన్న దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి అచ్చెన్న స్పందిస్తూ.. ఈ రహదారికి అంచనాలు రూపొందించాలని పీఆర్డీఈ సుధాకర్ను ఆదేశించారు. అనంతరం ‘సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా వడ్డివాడ, జొన్నలపాడు గ్రామాల్లో మంత్రి అచ్చెన్న పర్యటించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కింజరాపు హరిప్రసాద్, ఎల్ఎల్ నాయుడు, జీరు భీమారావు, అట్డాడ రాంప్రసాద్, రెడ్డి అప్పన్న, సర్పంచ్ గూట్ల మల్లేషు, ఎంపీటీసీ మెండ సాయిరాం, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 27 , 2025 | 11:39 PM