సిక్కోలు జీడికి జాతీయ గుర్తింపు
ABN, Publish Date - Jul 08 , 2025 | 12:12 AM
సిక్కోలు జీడిపప్పుకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
ఈనెల 14న ఢిల్లీలో అవార్డు ప్రదానం
ఏపీ ఉద్యాన రంగానికే మైలురాయి
తితలీ నష్టం తర్వాత పునరుజ్జీవనం
ప్రాసెసింగ్ పరిశ్రమలకు ఊపు
శ్రీకాకుళం, జూలై 7(ఆంధ్రజ్యోతి): సిక్కోలు జీడిపప్పుకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఉద్యాన రంగంలో వన్ డిస్ట్రిక్ట్ (ఓడీఓపీ) కార్యక్రమంలో భాగంగా ‘జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు (2025) దక్కింది. ఈ నెల 14న ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి అవార్డుల ప్రదానోత్సవానికి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఉద్యాన అధికారి రత్నాల వరప్రసాద్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ఘనత జిల్లాకే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఉద్యానరంగానికే ఒక మైలురాయి అని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జీడి మామిడి.. ప్రధాన జీవనాధార పంట..
జిల్లాలో జీడి పంట ప్రధాన జీవనాధారంగా ఉంది. 24,000 హెక్టార్లలో జీడిమామిడి సాగు అవుతోంది. ఇందులో 22,000 హెక్టార్లు దిగుబడినిచ్చే తోటలే. పలాస, మందస, వజ్రపుకొత్తూరు, సోంపేట వంటి ఉద్దానం మండలాల్లో జీడిమామిడి అత్యధికంగా సాగు చేస్తున్నారు. ఈ తోటల్లో సంకరజాతి రకాలైన బీపీపీ-8, బీపీపీ-6, వీ-4 వంటి అధిక దిగుబడినిచ్చే రకాలే కాకుండా వంశపారంపర్య జాతులూ ఉన్నాయి. ఈ పంట ద్వారా 1,05,000 కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగాను జీవనం దొరుకుతోంది. వీరిలో సన్నకారు రైతులు 31,000, చిన్న రైతులు 56,000, పెద్ద రైతులు 18,000 మంది ఉన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే ఈ పంట రైతులకు స్థిర ఆదాయాన్ని కలిగిస్తోంది.
తితలీ తుపాను నష్టం తర్వాత పునరుజ్జీవనం..
2018 అక్టోబరులో వచ్చిన తితలీ తుపాను వల్ల జిల్లాలోని ఉద్యాన పంటలు భారీ నష్టాన్ని చవిచూశాయి. అయితే ఈ విపత్తును అవకాశంగా మార్చుకుని ఉద్యానశాఖ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా 23వేల ఎకరాల్లో పాత తోటలను పునరుద్ధరణ చేయడం, 7,500 ఎకరాల్లో అధిక దిగుబడినిచ్చే కొత్త జీడి తోటల ఏర్పాటు, అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా మరో 7,500 ఎకరాల్లో సాగు విస్తరణ చేశారు. ఈ కార్యక్రమానికి రూ.14.60 కోట్లు ఖర్చు చేయగా.. రైతులకు సబ్సిడీ, సాంకేతిక సహాయం, శిక్షణ అందించారు.
ప్రాసెసింగ్ పరిశ్రమలకు ఊపు
ఉద్యానశాఖ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపనపైనా ప్రత్యేక దృష్టి సారించి ఎంఐడీహెచ్, ఆర్కేవీవై ద్వారా ఇప్పటివరకు 25 ప్రాసెసింగ్ యూనిట్లను ఆధునికీకరించి సబ్సిడీ మంజూరు చేసింది. ప్రస్తుతం 9 యూనిట్లకు నిధుల మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది. ఎంఎస్ఎంఈ డే, కాజూ ఎక్స్ పో (పలాస) వంటి కార్యక్రమాల ద్వారా జిల్లాలోని రైతులు, వ్యాపారులు, ప్రాసెసర్లు తమ ఉత్పత్తులను దేశవాళీ, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేసుకున్నారు. ఇది వారికి మార్కెట్ అవకాశాలు పెంచడంలో కీలకంగా నిలిచింది. అంతేకాక ఆధునిక ప్యాకింగ్, శుభ్రత ప్రమాణాలు, ఎగుమతి సౌలభ్యాలు కలిగిన ప్రాసెసింగ్ సెంటర్లు కూడా నిర్మించారు. సాధారణ జీడిపప్పుతో పాటుగా పుదీనా, చిల్లీ, పెప్పర్ వంటి సుగంధ ద్రవ్యాలు కలిపిన జీడిపప్పు, కాజు బర్ఫీ, వివిధ స్వీట్లు, చిక్కీలు, ఇతర చిరుతిళ్ల తయారీ చేస్తున్న పరిశ్రమలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ప్రాచుర్యం పొందాయి.
శ్రీవారి సేవలో పలాస జీడిపప్పు
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో పలాస జీడిపప్పు వినియోగిస్తున్నారు. ఇది జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి ఒక కారణమైంది. పలాస నుంచి ప్రతిరోజూ రోజు సుమారు 3000 కేజీల జీడిపప్పును స్వామివారి వివిధ ప్రసాదాల తయారీ కోసం పంపిస్తున్నారు.
జీడి రైతుల శ్రేయస్సు కోసం శిక్షణ..
రైతులకు ఆర్థిక సాయమే కాక సాంకేతిక శిక్షణ, ప్యాకింగ్ హౌసులు, శీతల గదుల ఏర్పాటు, ఆధునిక వ్యవసాయం, ధరల స్థిరత్వం, నష్ట నివారణ దిశగా అడుగులు వేశారు. పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన కుత్తుమ వేమన్న అనే రైతు ప్యాక్ హౌస్, కొత్త టెక్నాలజీని ఉపయోగించి తన ఆదాయాన్ని రూ.7.6 లక్షల నుంచి రూ. 11.8 లక్షలకు
పల్లెల్లో మొదలైన కృషి దేశవ్యాప్తగా గుర్తింపు: రత్నాల వరప్రసాద్, జిల్లా ఉద్యాన అధికారి
ఉద్యాన శాఖ ద్వారా ఓడీఓపీ ప్రాథమిక నివేదికను చేనేత జౌళిశాఖ సహకారంతో 2024 అక్టోబరులో సమర్పించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర అధికార బృందం పలాస ప్రాంతంలోని జీడి తోటలు, ప్రాసెసింగ్ యూనిట్లను విస్త్రృతంగా పరిశీలించింది. కలెక్టర్ ఈ నివేదిక స్థితిగతులు తెలుసుకుంటూ అధికార యంత్రాంగానికి సూచనలు ఇచ్చారు. ఈ అవార్డు ద్వారా జిల్లా పల్లెల్లో మొదలైన కృషి దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. ఇది ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
జిల్లా అధికారుల అంకితభావానికి దక్కిన గౌరవం: స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కలెక్టర్
ఓడీఓపీ ప్రాజెక్టును విజయవంతంగా నడిపించి జాతీయ స్థాయి అవార్డు పొందడంలో సఫలమైన ఉద్యాన యంత్రాంగానికి అభినందనలు. జిల్లా అధికారుల అంకితభావానికి దక్కిన గౌరవం ఇది. జిల్లాలో ఉన్న ప్రతి జీడి రైతు, జీడి ఆధారిత పరిశ్రమకు ఈ అవార్డు అంకితం. ఉద్యానశాఖ అందిస్తున్న వివిధ పథకాలు, వారి సాంకేతిక మార్గదర్శకత్వం వినియోగించుకుని రైతులు సాగు విధానాలను అభివృద్ధి చేసుకుంటూ స్థిర ఆదాయాన్ని సాధించాలి.
Updated Date - Jul 08 , 2025 | 12:12 AM