Cm tour: మత్స్యకారుల సేవలో..
ABN, Publish Date - Apr 26 , 2025 | 12:16 AM
fishermen welfare ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం జిల్లాకు రానున్నారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో పర్యటించనున్నారు. జిల్లా నుంచే ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని ప్రారంభించనున్నారు. తీరప్రాంత మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రెట్టింపు చేసి లబ్ధిదారులకు అందజేయనున్నారు.
వేట నిషేధం సమయంలో భృతి రెట్టింపు
నేడు జిల్లాకు రానున్న చంద్రబాబు నాయుడు
ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో పర్యటన
గంగపుత్రులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి
టీడీపీ కేడర్తోనూ ప్రత్యేక సమీక్ష
శ్రీకాకుళం, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం జిల్లాకు రానున్నారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో పర్యటించనున్నారు. జిల్లా నుంచే ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని ప్రారంభించనున్నారు. తీరప్రాంత మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రెట్టింపు చేసి లబ్ధిదారులకు అందజేయనున్నారు. గత ప్రభుత్వం ‘మత్స్యకార భరోసా’ పథకం కింద మూడేళ్లు రూ.పది వేలు చొప్పున ఇచ్చింది. గతేడాది మాత్రం ఎగనామం పెట్టింది. గతేడాది ఈ పథకం కింద 15,375 మందిని అర్హులను గుర్తించినా.. డబ్బులు మాత్రం అందజేయలేదు. దీంతో తీరప్రాంత మత్స్యకారులు ఏకతాటిపై నిలిచి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబునాయుడు మత్స్యకార భరోసా సాయాన్ని రెట్టింపు చేశారు. ఈ మేరకు ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద శనివారం ఒక్కో మత్స్యకారుడికి రూ.20వేలు చొప్పున అందజేయనున్నారు. మత్స్యకారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు. టీడీపీ కేడర్తోనూ ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు.
15,548 మందికి లబ్ధి
జిల్లాలో 104 తీరప్రాంత గ్రామాలు ఉన్నాయి. ఇందులో 60 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో 1600 ఇంజన్ బోట్లతోనూ... 2800 సంప్రదాయ పడవలతోనూ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి చేపల వేట సాగిస్తున్నారు. జిల్లా మత్స్యశాఖ ఈ ఏడాది మత్స్యకార భరోసా కింద 15,548 మంది మత్స్యకారులను అర్హులుగా గుర్తించింది. వీళ్లందరికీ రూ.20వేలు చొప్పున ప్రభుత్వం అందజేయనుంది. గత ప్రభుత్వం కన్నా రెట్టింపు సాయం అందజేయనుండడంతో మత్స్యకారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
పర్యటన ఇలా..
తాడేపల్లిలో శనివారం ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు బయలుదేరి.. 10.35 గంటలకు విజయవాడ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 10.40 గంటలకు విమానంలో బయలుదేరి 11.25 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్టులో దిగుతారు. 11.35 గంటలకు ప్రత్యేక హెలీకాఫ్టర్లో బయలుదేరి బుడగట్లపాలెం హెలిప్యాడ్ వద్దకు 11.55 గంటలకు చేరుకుంటారు. 11.55 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 వరకు ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారుల నుంచి స్వాగత సత్కారం అందుకుంటారు. 12.20 వరకు ప్రజాప్రతినిధులతో చర్చిస్తారు. 12.25 గంటలకు బుడగట్లపాలెం గ్రామంలోకి ప్రవేశించి అమరావతి దేవాలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం స్థాని మత్స్యకారులతో మధ్యాహ్నం 1.15 గంటల వరకు మాట్లాడతారు. 1.15 నుంచి 1.45 వరకు రిజర్వ్గా సమయాన్ని కేటాయించారు. 1.50 గంటలకు బుడగట్లపాలెంలో ప్రజావేదిక వద్దకు చేరుకుని జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలిస్తారు. 2 గంటల నుంచి 3.40 వరకు సభలో ప్రసంగిస్తారు. 3.45 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుని 5.15 వరకు టీడీపీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. 5.25 గంటలకు హెలికాఫ్టర్లో బయలుదేరి 5.50 గంటలకు విశాఖపట్నంలో నేవల్ కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 5.55 గంటలకు విశాఖపట్నంలో మహారాణిపేట వద్ద ఆంధ్రా మెడికల్ కళాశాలలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. రాత్రి 7.25 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్టులో బయలుదేరి 8.10గంటలకు విజయవాడ చేరుకుంటారు. 8.50 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో తన నివాసానికి సీఎం చేరుకుంటారు. సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు.. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా అధికారులు పలుదఫాలు బుడగట్లపాలెంలో ఏర్పాట్లను పరిశీలించారు. పర్యటనలో ఏవిధమైన అసాంఘిక శక్తులు చొరబడకుండా ‘అడ్వాన్స్ సెక్యూరిటీ లైజెన్’(ఏఎస్ఎల్) టెక్నాలజీతో భద్రతా చర్యలను ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టారు. శుక్రవారం సభా స్థలాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
హామీని నెరవేరుస్తున్నాం
మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మత్స్యకారులకు ‘భరోసా’ కింద ఇచ్చే నగదు సాయాన్ని రెట్టింపు చేశాం.
- కింజరాపు అచ్చెన్నాయుడు, మత్స్యశాఖ మంత్రి
..........................
హర్షణీయం
టీడీపీ హయాంలో మత్స్యకారులకు వేట నిషేధ భృతి అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వం కొందరికి రూ.10వేలు చొప్పున ఇచ్చి.. రాజకీయంగాను పలు లబ్ధిదారులను మార్పు చేసి వేరేవాళ్లకు అందజేసింది. ప్రస్తుతం రెట్టింపు సాయంగా ఒక్కో మత్స్యకారుడికి రూ.20వేలు చొప్పున అందజేయనుండడం హర్షణీయం. సీఎం చంద్రబాబుకు, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు కృతజ్ఞతలు.
- మైలపల్లి నర్శింగరావు, జిల్లా మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షుడు
Updated Date - Apr 26 , 2025 | 12:16 AM