Plants: మొక్కల పేరుతో.. మెక్కేశారు!
ABN, Publish Date - Apr 21 , 2025 | 12:22 AM
Plantation Scam కాశీబుగ్గ అటవీ రేంజ్ పరిధిలో మందస సెక్షన్ హొన్నాళి బీట్లో కొన్నేళ్ల కిందట సుమారు 25 ఎకరాల్లో ఔషధ మొక్కలను నాటారు. హొన్నాళి గ్రామానికి చెందిన కూలీలతో మొక్కలు నాటి సంరక్షించేందుకు రూ.లక్షల్లో ఖర్చు చేశారు. కానీ ప్రభుత్వ లక్ష్యం మాత్రం నెరవేరలేదు.
25 ఎకరాల్లో ఔషధ మొక్కలు కనుమరుగు
రూ.లక్షలు వ్యయమైనా నెరవేరని లక్ష్యం
మందస అటవీ పరిధిలో అక్రమాలపర్వం
హొన్నాళి అటవీ రేంజి పరిధిలోని ఔషధ మొక్కల నాటిన ప్రాంతం(పైచిత్రం) ఇది. గతంలో లక్షల నిధులు వెచ్చించి ముళ్లపొదలు తొలగించి శుభ్రం చేసి మొక్కలు నాటినా నేడు ఒక్క మొక్క కన్పించకపోగా.. మళ్లీ అటవీ ప్రాంతంలా దట్టమైన ముళ్లపొదలతో నిండిపోయింది.
హరిపురం, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ అటవీ రేంజ్ పరిధిలో మందస సెక్షన్ హొన్నాళి బీట్లో కొన్నేళ్ల కిందట సుమారు 25 ఎకరాల్లో ఔషధ మొక్కలను నాటారు. హొన్నాళి గ్రామానికి చెందిన కూలీలతో మొక్కలు నాటి సంరక్షించేందుకు రూ.లక్షల్లో ఖర్చు చేశారు. కానీ ప్రభుత్వ లక్ష్యం మాత్రం నెరవేరలేదు. నేడు ఒక్క మొక్క కూడా అక్కడ కన్పించని దుస్థితి నెలకొంది. మొక్కల పేరుతో నిధులు మెక్కేశారనే ఆరోపణలు ఉన్నాయి. 2015-16లో జాతీయ ఔషధ మొక్కల నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటేందుకు సిద్ధం చేశారు. దీనికిగాను ప్రత్యేక యంత్రాలతో ముళ్లపొదలు చెట్లు తొలగించి శుభ్రం చేశారు. 25 ఎకరాల బౌండరీ చుట్టూ కందకం తవ్వించారు. 11,110 ఔషధ మొక్కలు నాటారు. మొక్కకు మొక్కకు మూడు మీటర్లు చొప్పున దూరంతో ఏగిస, నేరేడు, మారేడు, ఉసిరి, వంటి నాలుగు రకాల మొక్కలు నాటారు. మొక్కలు చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. కానీ అవేవీ నేడు కనిపించడం లేదు. కంచెతోపాటు మొక్కలు సంరక్షించేందుకు సుమారు రూ.5లక్షలకు పైగా ఖర్చుయినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. కాగా క్షేత్రస్థాయిలో మాత్రం మొక్కల్లేవు. దీంతో మొక్కలేవి అని అడుగుతున్న జిల్లాస్థాయి అధికారులకు.. జంతువులు, పశువులు తినివేశాయని కొంతమంది సిబ్బంది చెబుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
నిర్లక్ష్యంతో.. కనుమరుగు..
లక్షల వ్యయం ఖర్చుతో స్థలాన్ని సిద్ధం చేసి కందకం తవ్వించి మొక్కలను సంరక్షించాల్సిన సమయంలో అధికారులు నిర్లక్ష్యంతో వదిలేశారు. దీంతో మొక్కలు ఎండకు ఎండి చనిపోయాయి. ఎక్కడో ఉన్న కొన్ని మొక్కలు సైతం జంతువులు, పశువులు గొర్రెలకు మేతగా మారి కనుమరుగయ్యాయి. రికార్డుల్లో సంరక్షణ పేరుతో నిధులు ఖర్చుయినా క్షేత్రస్థాయిలో పనులు జరగలేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారి నిధులు పక్కదారి పట్టాయి.
క్షేత్రాన్ని పరిశీలిస్తాం..
హొన్నాళి ఔషధ మొక్కల క్షేత్రాన్ని పరిశీలిస్తాం. మొక్కల పునరుద్ధరణ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి చర్యలు తీసుకుంటాం. నిధులు లేమితో గతంలో సంరక్షణ ఛర్యలు తీసుకోలేకపోయినట్లు తెలిసింది. ప్రస్తుతం దీనిపై దృష్టి సారించి మరింత సంరక్షణ చర్యలు తీసుకొని అటవీప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం.
- మురళీకృష్ణం నాయుడు, ఎఫ్ఆర్వో, కాశీబుగ్గ
Updated Date - Apr 21 , 2025 | 12:22 AM