jeedi: కుదిరిన వేతన ఒప్పందం
ABN, Publish Date - May 14 , 2025 | 12:14 AM
Wage agreement Labor union జీడి వ్యాపారులు- కార్మిక సంఘ నాయకుల మధ్య వేతన ఒప్పందం కుదిరింది. మంగళవారం మధ్యాహ్నం స్థానిక జీడిపప్పు ఉత్పత్తిదారుల సంఘం భవనం(పీసీఎంఏ)లో ఇరువర్గాల నాయకులు సమావేశమై వేతన ఒప్పందాన్ని కుదుర్చుకొని లేఖలు అందించుకున్నారు.
జీడి కార్మికులకు 10శాతం అదనంగా ఇచ్చేందుకు వ్యాపారుల అంగీకారం
పలాస, మే 13(ఆంధ్రజ్యోతి): జీడి వ్యాపారులు- కార్మిక సంఘ నాయకుల మధ్య వేతన ఒప్పందం కుదిరింది. మంగళవారం మధ్యాహ్నం స్థానిక జీడిపప్పు ఉత్పత్తిదారుల సంఘం భవనం(పీసీఎంఏ)లో ఇరువర్గాల నాయకులు సమావేశమై వేతన ఒప్పందాన్ని కుదుర్చుకొని లేఖలు అందించుకున్నారు. రెండేళ్లకోసారి జీడి కార్మికులు చర్చల ద్వారా వేతన ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. ఈ ఏడాది రెండుసార్లు సమావేశమైనా ఒప్పందం ఖరారు కాకపోవడంతో ఈ నెల 16 నుంచి సమ్మెకు దిగుతామని కార్మికసంఘ నాయకులు అధికారులకు లేఖలు అందించారు. ఈ నేపథ్యంలో వ్యాపారులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించి వేతన ఒప్పందాన్ని ఖరారు చేశారు. 2023-2025లో ఇచ్చిన వేతనం కంటే 10శాతం అదనంగా ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతోపాటు బాయిలింగ్ వేసే కార్మికులకు బస్తాకు రూ.71, కటింగ్ చేసే కార్మికులకు కిలోకు రూ.34, పీలింగ్ కార్మికులకు కిలోకు రూ.12.50, ఎండబోత చేసే కార్మికులకు రూ.43 చొప్పున ఇచ్చేందుకు ఇరువర్గాల నాయకులు అంగీకరించారు. వేతన ఒప్పందంలో సహకరించిన ఎమ్మెల్యే గౌతు శిరీషకు వారంతా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జీడి వ్యాపారసంఘ అధ్యక్షుడు మల్లా శ్రీనివాస్, కోశాధికారి మల్లా సంతోష్, కార్మికసంఘ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి సాన ఈశ్వరరావు, కోశాధికారి కోనారి రాము, వర్కింగ్ సెక్రటరీ సిందిరి సతీష్కుమార్, పట్నాన శ్రీనివాస్తో పాటు వ్యాపారులు, కార్మికసంఘ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - May 14 , 2025 | 12:14 AM