Greevens: గ్రీవెన్స్లో కలకలం
ABN, Publish Date - May 05 , 2025 | 11:30 PM
woman attempts suicide ‘పద్నాలుగేళ్లుగా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాను. ఐదేళ్లుగా సమస్య పరిష్కారానికి స్పందన(గ్రీవెన్స్) కార్యక్రమంలో కలెక్టర్ను కలిసి వినతులు అందజేస్తూనే ఉన్నాను. ప్రాణం విసిగిపోయింది. ఆశ అంతరించింది. ఇక చావే శరణ్యం’ అంటూ ఓ వృద్ధురాలు జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీకోసం’(గ్రీవెన్స్) కార్యక్రమంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం సృష్టించింది.
ఒంటిపై పెట్రోల్ పోసుకున్న వృద్ధురాలు
భూ సమస్య పరిష్కరించాలంటూ ఆవేదన
అప్రమత్తమై రక్షించిన మహిళా పోలీసు
తక్షణ చర్యలకు ఆదేశించిన కలెక్టర్
శ్రీకాకుళం కలెక్టరేట్, మే 5(ఆంధ్రజ్యోతి): ‘పద్నాలుగేళ్లుగా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాను. ఐదేళ్లుగా సమస్య పరిష్కారానికి స్పందన(గ్రీవెన్స్) కార్యక్రమంలో కలెక్టర్ను కలిసి వినతులు అందజేస్తూనే ఉన్నాను. ప్రాణం విసిగిపోయింది. ఆశ అంతరించింది. ఇక చావే శరణ్యం’ అంటూ ఓ వృద్ధురాలు జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీకోసం’(గ్రీవెన్స్) కార్యక్రమంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని బాకర్ సాహెబ్పేటకు చెందిన లొట్టి మంగమ్మ(65), ఆనందరావు దంపతులకు.. వారసత్వంగా పాత్రునివలస, బలగ రూరల్ రెవెన్యూ పరిధిలో 2011లో కోర్టు డిక్రీ ద్వారా భూమి సంక్రమించింది. కానీ వారి బంధువులు ఈరోజు వరకు ఆ భూమిని ఇవ్వలేదు. న్యాయం ప్రకారం ఆ భూమిని అందజేసి సమస్యను పరిష్కరించాలని వారు ఐదేళ్లుగా కలెక్టర్ ‘స్పందన’ కార్యక్రమంలో వినతులు సమర్పిస్తున్నారు. కానీ ఇంతవరకు న్యాయం జరగకపోవడంతో సోమవారం మంగమ్మ జడ్పీలో ‘మీకోసం’(గ్రీవెన్స్) కార్యక్రమానికి హాజరైంది. సంచిలో రూ.50 పెట్రోలు నింపిన సీసాను, ఆహారపొట్లాన్ని తీసుకువచ్చింది. తాను తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని, తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేసింది. అనంతరం అదే ప్రాంగణంలో ఒక మూలకు వెళ్లి తనతో తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని మళ్లీ కలెక్టర్ వద్దకు వెళ్లింది. ఆత్మహత్యాయత్నాన్ని గమనించిన ఓ మహిళా పోలీసు వెంటనే మంగమ్మను నిలువరించి, అఘాయిత్యానికి పాల్పడకుండా అడ్డుకుంది. అనంతరం కలెక్టర్ ఆ వృద్ధురాలిని గ్రీవెన్స్ హాలు నుంచి ప్రత్యేక గదిలోకి తీసుకువెళ్లారు. అనంతరం డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు, ఆర్డీఓ సాయి ప్రత్యూష కూడా కలెక్టర్ రూమ్లోకి వెళ్లారు. సమస్యను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ ఆస్తి విషయం తగాదా హైకోర్టులో ఉండడంతో, ముందు కోర్టులో ఇచ్చిన డిక్రీ ప్రకారం వారికి న్యాయం చేయాలని తహసీల్దార్, పోలీసులను ఆదేశించారు.
సంఘటనపై కలెక్టర్ మాట్లాడుతూ ఆస్తి తగాదా వారి కుటుంబ సభ్యుల మధ్యనే జరుగుతోంది. కింది కోర్టులో ఫిర్యాదు చేసిన మంగమ్మకు మొత్తం ఆస్తిలో 1/7వంతు భాగం వాటాగా ఇవ్వాలని కోర్టు డిక్రీ 2011లో తీర్పు వచ్చింది. దీనిపై అవతలి పార్టీ వారు హైకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం కేసు హైకోర్టులో పెండింగ్లో ఉంది. అయితే పాత డిక్రీ ప్రకారం ప్రస్తుతం శ్రీకాకుళం తహశీల్దారుకు, ఎటువంటి ఇబ్బంది కలుగకుండా పోలీసులకు సమస్య పరిష్కరించాలని ఆదేశించాం. హైకోర్టు తీర్పు వచ్చాక అందుకు అనుగుణంగా ఇప్పుడు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఇప్పటికైనా న్యాయం జరిగింది
‘2011లో కోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చినా సరే ఇప్పటికీ మా వాటా భూమిని మాకు అందజేయలేదు. దీనికోసం ఇన్నాళ్లూ పోరాడుతూనే ఉన్నాం. తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. కానీ ప్రయోజనం శూన్యం. ప్రాణం విసిగిపోయింది. అందుకే సంచిలో పెట్రోలు తీసుకుని వచ్చా. పోలీసులు సంచిని పరీక్షించి, ఏమిటి ఇది అని అడగ్గా కూల్డ్రింక్, ఆహార పొట్లాం తీసుకువచ్చానని వారితో చెప్పాను. పెట్రోలు ఒంటిపై పోసుకుని, చనిపోదామనుకున్నాను, కానీ ఆ మహిళా పోలీసు వెంటనే గమనించి, నన్ను ప్రాణాలతో రక్షించింది. కలెక్టర్ నా సమస్యను అర్థం చేసుకుని న్యాయం చేశారు. ఆనందంగా ఉంది. కలెక్టర్గారు చల్లగా ఉండాలి’ అని మంగమ్మ పేర్కొన్నారు.
Updated Date - May 05 , 2025 | 11:30 PM