raise educational: మరింత వై‘విద్య’ంగా..
ABN, Publish Date - Aug 04 , 2025 | 12:13 AM
Formation of academic committees విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాంకేతికంగా బోధన, వసతులు కల్పిస్తోంది. అయినా విద్యా ప్రమాణాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని కేంద్ర నుంచి వచ్చిన రెండు సంస్థల సర్వేల్లో స్పష్టమైంది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపునకు కృషి
పర్యవేక్షణకు ప్రత్యేక ప్రణాళికలు
జిల్లా, మండలస్థాయిలో అకడమిక్ కమిటీల ఏర్పాటు
నరసన్నపేట, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాంకేతికంగా బోధన, వసతులు కల్పిస్తోంది. అయినా విద్యా ప్రమాణాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని కేంద్ర నుంచి వచ్చిన రెండు సంస్థల సర్వేల్లో స్పష్టమైంది. 6 నుంచి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో సగం మందికి కూడికలు, తీసివేతలు కూడా రావడం లేదని, ఇంగ్లిష్ పదాలు చదవలేకపోతున్నారని నివేదికలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో మరింత వైవిద్యంగా విద్యాప్రమాణాలు మెరుగుపరిచేలా మంత్రి నారా లోకేశ్, విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, అమలు చేయనున్నారు. ఆ దిశగా అకడమిక్ కమిటీలను నియమించి, పాఠశాలలను పర్యవేక్షించాలని నిర్ణయించారు. కమిటీలను సైతం నియమించారు. కమిటీల పనితీరు, విద్యా ప్రమాణాలు పెంపునకు తీసుకుంటున్న చర్యలపై 15 రోజులకోసారి రాష్ట్రస్థాయిలో సమీక్షించనున్నారు.
జిల్లాలో 2,955 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో శాటిలైట్ పాఠశాలలు -17, ఫౌండేషన్ పాఠశాలలు -248, బేసిక్ ప్రైమరీ స్కూల్లు -1,682. మోడల్ ప్రైమరీ పాఠశాలలు -385, యూపీ పాఠశాలలు -198, ఉన్నత పాఠశాలలు -295, బేసిక్ ప్రైమరీతో కూడిన ఉన్నత పాఠశాలలు -89, మోడల్ స్కూల్తో కూడిన ఉన్నత పాఠశాలలు 41 ఉన్నాయి. వీటిలో విద్యా ప్రమాణాల పెంపు, పర్యవేక్షణకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకోసం జిల్లా, మండలస్థాయిల్లో అకడమిక్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాస్థాయిలో డీఈవో చైర్మన్గా, సమగ్రశిక్ష ఏపీసీ, ఏసీ, డీసీఈబీ కార్యదర్శి, ముగ్గురు ఎంఈవోలు సభ్యులుగా ఉంటారు. ప్రతి సబ్జెక్టుకు నలుగురు నిపుణులైన స్కూల్ అసిస్టెంట్లు చొప్పున 24 మంది టీచర్లను, ప్రాథమిక స్థాయిలో 1నుంచి 5వ తరగతి వరకు పర్యవేక్షణకు జిల్లాస్థాయి కమిటీలో నలుగురు ఎస్జీటీ కేడర్లో నిపుణులైన టీచర్లకు అవకాశం కల్పించారు. మండల స్థాయిలోనూ నిరంతరం పర్యవేక్షణకు ఎంఈవో-1, ఎంఈవో-2, కాంప్లెక్స్ హెచ్ఎం, ముగ్గురు ఎస్జీటీలకు కమిటీలో అవకాశం ఇచ్చారు. జిల్లా కమిటీ సభ్యులు బృందాలుగా పాఠశాలలను పర్యవేక్షిస్తారు. విద్యార్థుల సామర్థ్యాలు, ప్రమాణాల పెంపునకు ఎలా బోధిస్తున్నారు?. ఎన్రోల్మెంట్, విద్యార్థులు, టీచర్ల హాజరు, పాఠశాలలకు వచ్చిన నిధులు.. వాటితో ఎలాంటి వసతులు కల్పించారు? తదితర వివరాలను పరిశీలిస్తారు. తనిఖీ చేసిన పాఠశాలలోని పరిస్థితులను కమిటీ రాసుకోవాలి. 15 రోజులకోసారి అకడమిక్ కమిటీలతో రాష్ట్రస్థాయిలో మంత్రి నారా లోకేశ్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ సమీక్ష నిర్వహిస్తారు. కమిటీల పనితీరు, గుర్తించిన సమస్యలపై ఆరా తీస్తారు. ఆ దిశగా ఇప్పటికే కమిషనర్ నుంచి ఆదేశాలు రావడంతో జిల్లాలో అమలుకు అధికారులు కుస్తీ పడుతున్నారు.
Updated Date - Aug 04 , 2025 | 12:13 AM