శ్మశానాన్ని వదల్లే..
ABN, Publish Date - Jul 24 , 2025 | 12:27 AM
మండలంలోని తర్లాకోటలో శ్మశానం ఆక్రమణకు గురవుతోంది.
- తర్గాకోట రాజుల రుద్రభూమి ఆక్రమణ
- 29 సెంట్లకు తొమ్మిది సెంట్లే మిగిలిన వైనం
- అధికారులకు గ్రామస్థుల ఫిర్యాదు
పలాసరూరల్, జూలై 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని తర్లాకోటలో శ్మశానం ఆక్రమణకు గురవుతోంది. గతంలో 127/18 సర్వే నెంబరులో 29 సెంట్ల విస్తీర్ణంలో శ్మశానం ఉండగా, ఇప్పుడు ఆక్రమణలతో కేవలం 9 సెంట్లు మాత్రమే మిగిలింది. పూర్వకాలం తర్లాకోట సంస్థానాధీశులు ఈ భూమిని శ్మశానంగా వినియోగించుకునేవారు. దీన్ని స్థానికులు రాజుల శ్మశానంగా పిలుస్తుంటారు. అయితే, నాలుగేళ్ల కిందట ఈ భూమిపై ఓ బడా బాబుతో పాటు సామాన్య వ్యాపారుల కళ్లుపడ్డాయి. అప్పటి నుంచి శ్మశానం భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో గతంలో 29 సెంట్లు ఉన్న శ్మశానం ఇప్పుడు తొమ్మిది సెంట్లు మాత్రమే ఉంది. దీనిపై ఇటీవల గ్రామస్థులు డీటీకి ఫిర్యాదు చేశారు. కనీసం తర్లాకోట సంస్థానాధీశుల శ్మశానమైనా నాటి ఆనవాళ్లుగా భావించి రక్షించాలని ఆ వినతిలో పేర్కొన్నారు. ఈ విషయంపై తహసీల్దార్ ఎన్.కళ్యాణచక్రవర్తిని వివరణ కోరగా.. రాజుల శ్మశానం ఆక్రమణపై గ్రామస్థులు వినతిపత్రం అందించారని, ఆ స్థలాన్ని పరిశీలించి న్యాయం చేస్తామని తెలిపారు.
Updated Date - Jul 24 , 2025 | 12:27 AM