Granite industry: రండి.. వ్యాపారం చేసుకోండి
ABN, Publish Date - Apr 21 , 2025 | 11:49 PM
Granite industry: గత వైసీపీ ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన సూక్ష్మఖనిజ పాలసీతో గ్రానైట్ వ్యాపారులు నష్టాలు చవిచూశారు.
- గ్రానైట్ పరిశ్రమలకు ప్రయోజనం కలిగేలా ప్రభుత్వ చర్యలు
- సూక్ష్మఖనిజ పాలసీలో మార్పులు
- ఒడిశా నుంచి తిరిగి వస్తున్న వ్యాపారులు
- గత వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు
- మెళియాపుట్టి మండలం మాకానాపల్లి గ్రామ సమీపంలోని 20 హెక్టార్లను ఓ గ్రానైట్ పరిశ్రమకు 15 ఏళ్ల కిందట లీజ్కు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రానైట్ పరిశ్రమ లీజ్ను తగ్గించడంతో పాటు వేధింపులు అధికమయ్యాయి. దీంతో పరిశ్రమ మూతపడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రానైట్ వ్యాపారులకు రాయితీలతో పాటు లీజ్ కాలం పెంపు, మినరల్ పాలసీలో మార్పులు తీసుకువచ్చింది. దీంతో మళ్లీ గ్రానెట్ పరిశ్రమలను ప్రారంభించేందుకు వ్యాపారులు ఆసక్తిచూపిస్తున్నారు.
- మెళియాపుట్టి మండలం డేగలపోలూరు రెవెన్యూ గ్రూప్లో గ్రానైట్ పాలిష్ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ఓ ప్రైవేట్ కంపెనీ నాలుగేళ్ల కిందట దరఖాస్తు చేసుకుంది. దీనికి అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. దీంతో ఆ కంపెనీ ఒడిస్సా రాష్ట్రం గారబందలో పాలీష్ యూనిట్ను ఏర్పాటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రానైట్ పరిశ్రమలు, పాలీష్ యూనిట్ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నవారికి వెంటనే అనుమతులు లభిస్తున్నాయి. దీంతో వ్యాపారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
మెళియాపుట్టి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన సూక్ష్మఖనిజ పాలసీతో గ్రానైట్ వ్యాపారులు నష్టాలు చవిచూశారు. దీంతో జిల్లాలో చాలా గ్రానైట్ పరిశ్రమలు మూతపడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సూక్ష్మఖనిజ పాలసీలో మార్పులు చేసింది. ఈ మేరకు ఇటీవల జీవో నెంబర్ 57ను గనులశాఖ కార్యదర్శి ప్రవీణ్కుమార్ జారీ చేశారు. దీంతో గ్రానైట్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూసివేసిన పరిశ్రమలను తిరిగి తెరిపించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇదీ జిల్లాలో పరిస్థితి
జిల్లాలో గతంలో 150 వరకు గ్రానైట్ క్వారీలతో పాటు 180 వరకు పాలిష్ యూనిట్లు ఉండేవి. ఒక్కొక్క క్వారీలో 30 నుంచి 50 మంది వరకు కార్మికులు పనిచేసేవారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రానైట్ వ్యాపారులకు ఎటువంటి రాయితీలు లేకపోవడం, లీజు ఫీజ్ను పెంచడం, లీజు కాలాన్ని తగ్గించడం వంటి కారణాలతో 70 వరకు పరిశ్రమలు, పాలిస్ యూనిట్లు మూతపడ్డాయి. దీంతో ఇందులో పనిచేసిన కార్మికులకు ఉపాధి కరువైంది. గతంలో వైసీపీ నాయకులకు అనుకూలంగా ఉండేవారికి వేలం ద్వారా క్వారీ లీజులు మంజూరు చేసేవారు. దీనివల్ల ఆర్థికంగా బలంగా ఉండే వారికే లీజులు దక్కేవి. అదే విధంగా పెండింగ్ కొత్త దరఖాస్తులు, రెన్యువల్ దరఖాస్తులు, లీజుకు సంబంధించిన ఫీజులు కూడా అధికంగా పెంచారు. ఈ పరిస్థితిని మార్పుచేసి, వ్యాపారులను ప్రోత్సహించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2022 నాటికి పెండింగ్లో ఉన్న లీజ్ వివాదాలను పరిష్కరించేందుకు వన్టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ను తీసుకువచ్చింది. ఆనాటి దరఖాస్తుదారుల్లో ఎవరు ముందు వస్తే వారికే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. దరఖాస్తుచేసిన వారికి ఒక ఏడాది మాత్రమే ఫస్ట్కమ్.. ఫస్ట్సర్వ్ ప్రతిపాదనలు అమలు చేయనున్నారు. ఎల్వోఐ అందని వారికి అనర్హులుగా భావించనున్నారు. ఎల్వోఐ ఇచ్చే సమయంలో మూడురెట్ల వార్షిక డెడ్రెంట్ను ఏడీఓఐ క్వారీ లీజుల రూపంలో చెల్లించాలి. 10 రెట్లుగా ఉన్న డెడ్రెంట్ను ఐదు రెట్లు తగ్గించారు. ఈ డబ్బులు 2-3 ఏళ్లు పాటు వాయిదా పద్ధతిలో చెల్లించటానికి అవకాశం ఇచ్చింది. ఇది వ్యాపారులకు కలిసిరానుంది. గతంలో గ్రానైట్ లీజు కాలం 20 ఏళ్లు ఉండేది. దీన్ని 30 ఏళ్లకు పెంచింది. పట్టా, డీకేటీ, అటవీ భూముల్లో లీజు మంజూరు చేయనున్నారు. కొవిడ్ కాలంలో ఖర్చుల నిమిత్తం 2021లో విధించిన కన్నిడరేషన్ డబ్బులను పూర్తిగా రద్దుచేసింది. కొత్త పాలసీలో టన్నేజ్ ఆధారిత సీనరేజ్ ఫీజు విధానం అమలు చేయనుంది. దీంతో అధికంగా గ్రానైట్ వ్యాపారం చేసేందుకు వ్యాపారులు ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది.
డేగలపోలూరు రెవెన్యూలో పాలిష్ యూనిట్ కోసం పునాది వేసి వదిలేసిన దృశ్యం
Updated Date - Apr 21 , 2025 | 11:49 PM