అగ్నిప్రమాదాల నివారణకు బ్రీతింగ్ బాల్కనీలు
ABN, Publish Date - Jul 26 , 2025 | 11:32 PM
దేశంలోని షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లు నేడు బహుళ అంతస్థుల కాంక్రీట్ బాక్సులుగా ఉంటున్నాయి.
- షాపింగ్ మాల్స్లో ఏర్పాటు చేసుకోవాలి
- శ్రీకాకుళం నుంచే శ్రీకారం చుడుతున్నాం
- ఇది దేశవ్యాప్తంగా ప్రచారం కావాలి
- విపత్తుల, అగ్నిమాపక డీజీ మాదిరెడ్డి ప్రతాప్
శ్రీకాకుళం క్రైం/అరసవల్లి, జూలై 26(ఆంధ్రజ్యోతి): ‘దేశంలోని షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లు నేడు బహుళ అంతస్థుల కాంక్రీట్ బాక్సులుగా ఉంటున్నాయి. ఇటువంటి మాల్స్లో అగ్నిప్రమాదం సంభవిస్తే తీవ్ర ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంటుంది. దీనికి నివారణగా షాపింగ్ మాల్స్లో బ్రీతింగ్ బాల్కనీలు ఏర్పాటు చేసుకోవడం మంచిది.’ అని విపత్తుల, అగ్నిమాపక శాఖ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్(ఐపీఎస్) పేర్కొన్నారు. నగరంలోని ఓ షాపింగ్మాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘ ఈ ఏడాది జనవరి 25న శ్రీకాకుళం నగరంలోని ఓ పెద్ద షాపింగ్మాల్లో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మాల్ లోపలకు వెళ్లడానికే ఆరు గంటల సమయం పట్టింది. మంటలను అదుపు చేయడానికి మరో ఆరు గంటల సమయం పట్టింది. అదృష్టవశాత్తు మాల్ పని గంటల సమయంలో ఈ ప్రమాదం జరగకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ, ఇది అందరికీ ఒక గుణపాఠం లాంటిది. దీనికి సరైన పరిష్కారం కోసం చాలామంది నిపుణులతో మాట్లాడాం. ప్రతీ షాపింగ్మాల్లో ప్రతీ అంతస్థుకు ఒక బ్రీతింగ్ బాల్కనీ నిర్మించడం ద్వారా ప్రమాదం జరిగినా ఎటువంటి ప్రాణనష్టం జరుగకుండా నివారించవచ్చు. దీనికి శ్రీకాకుళం నగరం నుంచే శ్రీకారం చుడుతున్నాం. అగ్నిప్రమాదానికి గురైన ఈ షాపింగ్మాల్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రతీ అంతస్థుకు బ్రీతింగ్ బాల్కనీలు నిర్మించారు. చాలా సులువైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న, ఎటువంటి మెయింటెనెన్స్ అవసరం లేని ఏర్పాటు ఇది. దేశంలోని అన్ని షాపింగ్మాల్స్, మల్టీప్లెక్స్లో ఈ బ్రీతింగ్ బాల్కనీలు నిర్మించాలి. ఇటీవల ఇరాక్లోని ఓ షాపింగ్ మాల్లో అగ్నిప్రమాదం సంభవించి 82 మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో ఇటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడాల్సిన బాద్యత అందరిపైనా ఉంది. మీడియా మిత్రులు ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా సహకారం అందించాలి. కొత్తగా మాల్స్కు సంబంధించి, భవనాల అనుమతుల్లో మార్పులు చేశాం. ముందుగా స్మోక్ టెస్ట్ నిర్వహించి, ఆ తరువాతనే అనుమతులు జారీ చేస్తాం.’ అని అన్నారు. తొలుత మాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రమాదం జరిగితే ఎలా ప్రాణనష్టం జరగకుండా నివారించాలి అన్న విషయంపై షాపింగ్మాల్ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రీజినల్ అధికారి నిరంజన్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి జె.మోహనరావు, సహాయ అధికారి కె.శ్రీనుబాబు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 26 , 2025 | 11:32 PM