Victims' Families : మృతుల కుటుంబాలను ఆదుకుంటాం
ABN, Publish Date - May 17 , 2025 | 11:42 PM
Compensation Tragic incident గ్రానైట్ క్వారీ వద్ద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను ఆదుకుంటామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మెళియాపుట్టి మండలం దీనబంధుపురం సమీపంలోని వీఆర్టీ గ్రానైట్ క్వారీలో శుక్రవారం రాత్రి ఆర్ముగం, రామారావు, అప్పన అనే కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
మెళియాపుట్టి, మే 17(ఆంధ్రజ్యోతి): గ్రానైట్ క్వారీ వద్ద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను ఆదుకుంటామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మెళియాపుట్టి మండలం దీనబంధుపురం సమీపంలోని వీఆర్టీ గ్రానైట్ క్వారీలో శుక్రవారం రాత్రి ఆర్ముగం, రామారావు, అప్పన అనే కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. పిడుగుపాటుతో ఆ ముగ్గురూ మృతి చెందారని యాజమాన్యం చెబుతుండగా, క్వారీలో బాంబు పేలుళ్ల వల్లే ప్రాణాలు కోల్పోయారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై క్వారీ యాజమాన్యంతో శుక్రవారం రాత్రి వాగ్వాదానికి దిగారు. శనివారం ఉదయం కూడా మృతదేహాలతో గ్రానైట్ పరిశ్రమ వద్ద ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ గ్రానైట్ క్వారీని పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ‘శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో క్వారీలో కార్మికులు మృతి చెందిన విషయం తెలిసింది. దీనిపై వెంటనే సంఘటనా స్థలాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించాం. అటవీ, మైనింగ్, రెవెన్యూశాఖ అధికారులతోపాటు పోలీసులు, క్లూస్టీమ్తో వివరాలు సేకరిస్తున్నాం. గ్రానైట్ పేలుళ్ల సమయంలో పిడుగు పడి ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. బాధితుల పోస్టుమార్టం రిపోర్టు ఆలస్యమైతే సరైన రిపోర్టు రాదు. నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందజేస్తామ’ని హామీ ఇచ్చారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు శాంతించి.. శనివారం సాయంత్రం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
క్వారీల నిలుపుదల
జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమల్లో అన్నీ అనుమతులు చూపించే వరకూ పనులు నిలుపుదల చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. క్వారీల్లో అనుమతులు ఉంటేనే పనులకు అంగీకరిస్తామని తెలిపారు. క్వారీల్లో పేలుళ్లు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు: ఎస్పీ మహేశ్వరరెడ్డి
దీనబంధుపురం సమీపంలో గ్రానైట్ క్వారీని ఎస్పీ మహేశ్వరరెడ్డి శనివారం సాయంత్రం పరిశీలించారు. పేలుడు పదార్థాలు వినియోగించారేమోనని తనిఖీ చేశారు. ముగ్గురి మృతికి గల కారణాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని తెలిపారు. క్లూస్టీమ్తో వివరాలు సేకరించి.. ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, టెక్కలి ఆర్టీవో కృష్టమూర్తి, సీఐ రామారావు, తహసీల్దార్ పాపారావు, ఎంపీడీవో ప్రసాద్పండా పాల్గొన్నారు.
Updated Date - May 17 , 2025 | 11:42 PM