నిద్దరోతున్న నిఘా..!
ABN, Publish Date - Apr 18 , 2025 | 12:53 AM
ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఓ పక్క దళారులు.. భక్తులను నిలువు దోపిడీ చేస్తుంటే, మరోపక్క దొంగలు.. భక్తుల బంగారు ఆభరణాలు కాజేస్తున్నారు. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతున్నా అందుకు తగిన సదుపాయాలు మాత్రం ఇక్కడ కనిపించడం లేదు. తాజాగా ఘాట్రోడ్డులో ఓం మలుపునకు ముందే నిలిపిన కారులో 241 గ్రాముల బంగారం చోరీ ఘటన ఇందుకు అద్దం పడుతోంది. ఇంద్రకీలాద్రి వద్ద దిగువ నుంచి పైవరకు విజిల్స్తో మోతెక్కిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది భక్తులకు ఎలాంటి భద్రతను ఇవ్వడం లేదని తెలుస్తోంది.
- ఇంద్రకీల్రాదిపై భద్రత ప్రశ్నార్థకం
- ఘాట్రోడ్డులో బయటపడ్డ నిఘాలోపం
- సీసీ కెమెరాల ఏర్పాటు అంతంతమాత్రమే
- భక్తుల కారులో బంగారు ఆభరణాలు చోరీ
- సీసీ కెమెరాలు లేకపోవడం కారణంగానే..
- చోరీ తర్వాత అధికారుల హడావిడి
- ఆగమేఘాలపై నిఘా నేత్రాల ఏర్పాటు
ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఓ పక్క దళారులు.. భక్తులను నిలువు దోపిడీ చేస్తుంటే, మరోపక్క దొంగలు.. భక్తుల బంగారు ఆభరణాలు కాజేస్తున్నారు. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతున్నా అందుకు తగిన సదుపాయాలు మాత్రం ఇక్కడ కనిపించడం లేదు. తాజాగా ఘాట్రోడ్డులో ఓం మలుపునకు ముందే నిలిపిన కారులో 241 గ్రాముల బంగారం చోరీ ఘటన ఇందుకు అద్దం పడుతోంది. ఇంద్రకీలాద్రి వద్ద దిగువ నుంచి పైవరకు విజిల్స్తో మోతెక్కిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది భక్తులకు ఎలాంటి భద్రతను ఇవ్వడం లేదని తెలుస్తోంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : తెలుగు రాషా్ట్రల్లో ప్రసిద్ధి చెందిన కనకదుర్గమ్మ సన్నిధికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కొందరు మెట్లపూజ చేసుకుంటూ కొండ ఎక్కుతారు. మరికొందరు ఘాట్రోడ్డు మార్గంలో పైకి వెళ్తారు. ఇంకొందరు లిఫ్టు మార్గాల్లో రాజగోపురం వద్దకు చేరుకుంటారు. వీరి భద్రత కోసం కొండ మొత్తాన్ని సీసీ కెమెరాల నిఘాలో ఉంచామని అధికారులు ప్రకటిస్తున్నారు. అయితే ప్రధానమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మిగిలిన ప్రదేశాలపై పెద్దగా అధికారులు దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంద్రకీలాద్రిపై మొత్తం 214 సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిని పర్యవేక్షించడానికి మహామండపంలో ప్రత్యేకంగా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహిస్తున్నారు.
కరోనా సమయంలో వెండి సింహాలు మాయం
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చిన్న రథానికి నాలుగు వైపులా ఉండే వెండి సింహాల్లో మూడింటిని దొంగలు కాజేశారు. కరోనా సమయంలో మొత్తం లాక్డౌన్లో ఉన్నప్పుడు ఈ చోరీ జరిగింది. అప్పుడే భద్రతపై అనేక సందేహాలు వచ్చాయి. నాడు అధికారంలో ఉన్న వైసీపీ ఇంద్రకీలాద్రిని ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రతి ఏడాది దేవస్థానంపై భద్రతా ఆడిట్ జరుగుతుంది. కొద్దిరోజుల క్రితమే ఈ ఆడిట్ను నిర్వహించారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు ఈ ఆడిట్లో పాల్గొన్నాయి. దేవస్థానానికి కింద నుంచి కొండ పై వరకు భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని ఈ ఆడిట్లో స్పష్టమైంది. ఏటా జరిగే భద్రతా ఆడిట్లో పలు సూచనలు, సిఫార్సులు చేస్తున్నా అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఘాట్రోడ్డులో కారులో ఉన్న బంగారు ఆభరణాలు చోరీ జరిగిన తర్వాత ఆలయ అధికారులు అత్యంత వేగంగా స్పందించారు. ఘటన జరిగిన ప్రదేశంలో చుట్టుపక్కల మొత్తం పది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఘాట్రోడ్డు ప్రారంభంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. తర్వాత ఓం మలుపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఘాట్రోడ్డు ఎక్కిన తర్వాత మొదటి మలుపు నుంచి ఓం మలుపు చేరుకునే వరకు మధ్యలో ఎలాంటి సీసీ కెమెరాలు లేవు. సరిగ్గా ఈ ప్రాంతంలోనే చోరీ జరిగింది.
సెక్యూరిటీ గార్డులు ఉన్నా ప్రయోజనం శూన్యం
కొండకు దిగువ నుంచి పైవరకు వివిధ పాయింట్లలో సెక్యూరిటీ గార్డులు ఉంటారు. వారంతా పైకి వచ్చే వాహనాల ట్రాఫిక్ను నియంత్రించడమే చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఓం మలుపు వద్ద బారికేడ్లు అమర్చి ఉంటాయి. ఇక్కడి నుంచి ఏ కేటగిరీకి సంబంధించిన కార్లను సమాచార కేంద్రం వరకు పంపాలో తెలుసుకునే పనిలోనే సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. కారులో బంగారు ఆభరణాలు చోరీ అయిన ప్రదేశంలో సెక్యూరిటీ ఉన్నప్పటికీ తానేమి చూడలేదని పోలీసులకు చెప్పినట్టు తెలిసింది.
తాజా చోరీపై అనుమానాలు
కొండపై జరిగిన చోరీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు చెబుతున్న కథనం ప్రకారం 30 సెకన్ల వ్యవధిలో బంగారు ఆభరణాలు మాయమైనట్టు పోలీసులు భావిస్తున్నారు. కారుకు వేసిన లాక్లు వేసినట్టే ఉన్నాయి. ఎక్కడా అద్దాలు పగలుగొట్టిన దాఖలాలు లేవు. కారుకు ఎక్కడా గీతలు పడిన చాయలు లేవు. బాధితులు మాత్రం వస్తువులు ఇక్కడే కనిపించడం లేదని బలంగా చెబుతున్నారు.
Updated Date - Apr 18 , 2025 | 12:53 AM