పశ్చిమాన పసుపు సందడి
ABN, Publish Date - Jul 27 , 2025 | 02:11 AM
జిల్లాలోని పశ్చిమప్రాంతంలో శనివారం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సందడి చేశారు. కేడర్లో జోష్ నింపేలా ఏకంగా నలుగురు రాష్ట్రమంత్రులు, పలువురు జిల్లాలోని కీలక ప్రజాప్రతినిధులు పర్యటించారు. ఒకవైపు పార్టీపరమైన, మరోవైపు అధికారిక కార్యక్రమాలకు వారు హాజరయ్యారు.
పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు, ముఖ్యప్రజాప్రతినిధులు
దోర్నాలలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
భారీగా హాజరైన టీడీపీ శ్రేణులు
జగన్ వైఖరిపై నేతల ధ్వజం
మార్కాపురం జిల్లా, వెలిగొండపై భరోసా
కేకేమిట్ల మండలంలో తొలి అడుగులో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి
పీ4పై మార్కాపురంలో అధికారులతో ఆనం, స్వామి సమీక్ష
జిల్లాలోని పశ్చిమప్రాంతంలో శనివారం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సందడి చేశారు. కేడర్లో జోష్ నింపేలా ఏకంగా నలుగురు రాష్ట్రమంత్రులు, పలువురు జిల్లాలోని కీలక ప్రజాప్రతినిధులు పర్యటించారు. ఒకవైపు పార్టీపరమైన, మరోవైపు అధికారిక కార్యక్రమాలకు వారు హాజరయ్యారు. ఆ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన వెలిగొండ పూర్తి, మార్కాపురం జిల్లా ఏర్పాటుపై భరోసా ఇచ్చారు. అదేసమయంలో అధికారంలో ఉన్నప్పుడు అరాచకానికి కేరాఫ్గా నిలిచిన జగన్ ఇప్పుడు సుద్దులు చెబుతున్నాడని నిప్పులు చెరిగారు.
ఒంగోలు జూలై 26 (ఆంరఽధజ్యోతి) : ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న యర్రగొండ పాలెం నియోజకవర్గం దోర్నాలలో టీడీపీ వ్యవస్థాపకుడు, దిగవంగత ఎన్టీఆర్ విగ్రహా విష్కరణ శనివారం జరిగింది. ఆ నియోజ కవర్గ టీడీపీ ఇన్చార్జి గుడూరి ఎరిక్షన్బాబు నేతృత్వంలో స్థానిక నాయకులు కార్యక్రమాన్ని నిర్వహించగా పెద్దఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. వేలాది ప్రజల మధ్య ఎన్టీఆర్ విగ్రహావిష్కరణతోపాటు భారీ బహిరంగ సభను నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారా యణరెడ్డితోపాటు మంత్రులు డాక్టర్ స్వామి, గొట్టిపాటి రవికుమార్, వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వెలిగొండ, మార్కాపురం జిల్లా ఏర్పాటుపై ప్రజలకు భరోసా ఇచ్చేలా మాట్లాడారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, అశోక్రెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్, బీఎన్.విజయకుమార్, దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. రాష్ట్రప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతోపాటు వైసీపీ అధినేత జగన్ తీరుపై విమర్శలు గుప్పిస్తూ సభకు హాజరైన ప్రజల్లో ఉత్సాహం నింపారు.
మార్కాపురంలో సమీక్ష
దోర్నాలలో కార్యక్రమం అనంతరం మార్కాపురంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పీ4పై జిల్లాస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నేతృత్వం వహించారు. మంత్రి డాక్టర్ డీఎస్బీవీ స్వామి, ఇతర ఎమ్మెల్యేలు, కలెక్టర్ తమీమ్ అన్సారియాతోపాటు కీలక శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పీ4 లక్ష్యానికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రులు సమీక్షించారు. జిల్లాలో గుర్తించిన 74,911మంది బంగారు కుటుంబాల అభ్యున్నతి కోసం మార్గదర్శకుల ఎంపిక, ఇతర చర్యలపై కలెక్టర్ సారఽథ్యంలో అధికారులు వివరించారు.
తొలి అడుగులో మంత్రి సుభాష్
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మార్కాపురం నియోజకవర్గంలో పాల్గొన్నారు. శనివారం ఉదయం కార్గిల్ దివస్ సందర్భంగా మార్కాపురం పట్టణంలో అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్యే నారాయణరెడ్డితో కలిసి మంత్రి సుభాష్ నివాళులర్పించారు. సాయంత్రం కొనకనమిట్ల మండలంలోని పలు గ్రామాల్లో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో కలిసి పాల్గొన్నారు. అలా ఒకేరోజు పశ్చిమ ప్రాంతంలో ఏకంగా నలుగురు మంత్రులు, పలువురు జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధులు వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. దోర్నాలలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, సభకు అక్కడి ఇన్చార్జి ఎరిక్షన్బాబు నేతృత్వంలో వేలాదిగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేశారు.
Updated Date - Jul 27 , 2025 | 02:11 AM