అలా వచ్చారు.. ఇలా వెళ్లారు!
ABN, Publish Date - Jul 09 , 2025 | 10:36 PM
ప్రభుత్వ భూములను కాపాడి వాటిని రక్షించాల్సిన రెవెన్యూ అధికారులే ఆక్రమితదారులకు వత్తాసు పలుకుతున్నారు. కొంత మంది సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు భూ రికార్డులను తారుమారు చేస్తూ ఆక్రమార్కులకు సహకరిస్తున్నారు.
వైసీపీ నేతలు ఆక్రమిత భూములపై తూతూమంత్రంగా అధికారుల సర్వే
నెలలతరబడి అదే తంతు
ఇన్చార్జి కలెక్టర్ ఆదేశాలతో భూ కొలతలు చేపట్టిన డీఈఎస్
ఎర్రగొండపాలెం రూరల్, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ భూములను కాపాడి వాటిని రక్షించాల్సిన రెవెన్యూ అధికారులే ఆక్రమితదారులకు వత్తాసు పలుకుతున్నారు. కొంత మంది సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు భూ రికార్డులను తారుమారు చేస్తూ ఆక్రమార్కులకు సహకరిస్తున్నారు. ఎర్రగొండపాలెం నుంచి పుల్లలచెరువు వెళ్లే రహదారిలోని సర్వే నెంబరు 28, 28-1లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు సుమారు పది ఎకరాల వరకు ఆక్రమించుకొని భవనాలు నిర్మించడంతోపాటు కొంతభూమిలో వెంచర్లు వేశారు. దీనిపై ఈనెల 5న అంతా భూటకం...బోర్డుతో నాటకం..! అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. దీనిపై ఇన్చార్జి కలెక్టర్ గోపాలకృష్ణ స్పందించారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ ఎన్.నాగేశ్వరరావును ఆ ప్రాంతాన్ని పరిశీలించి, కొలతలు వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆ సర్వే నెంబరులోని భూములను త్రిపురాంతకం మండల సర్వేయర్లతో కొలతలు వేయించారు.
ఆక్రమణలపై నోరు మెదపని డీఈఎస్
ఇన్చార్జి కలెక్టర్ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు డీఈఎస్ నాగేశ్వరరావు కేవలం 28, 28-1సర్వే నంబర్లలో ఉన్న భూములకు మాత్రమే కొలతలు వేసి వెళ్లిపోయారు. మిగిలిన సర్వే నెంబర్లు 600, 587-2లో కబ్జాకు గురైన భూముల జోలికి వెళ్లకపోవడం గమనార్హం. సర్వే చేసిన అధికారి ఆ సర్వే నంబర్ల భూములపై నోరుమెదపకుండా వెళ్లిపోవడం గమనార్హం. అయితే డీఈఎస్ ఫిర్యాదిదారులతో మాట్లాడుతూ భూ ఆక్రమణ జరిగిన రెవెన్యూ భూముల వరకు మాత్రమే సర్వే చేసి కొలతలు వేశామని, ఆ నివేదికను ఇన్చార్జి కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. మిగిలిన భూములు ఇరిగేషన్ పరిధిలోకి వస్తాయని, ఆ భూములకు సంబంధించి ఆ శాఖ అధికారుల ఆధ్వర్యంలో గురువారం కొలతలు వేస్తామని చెప్పారు.
సర్వే రిపోర్టే ఇవ్వలేదు
ఈనెల 5న ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం నిజమేనని ఎట్టకేలకు తేలింది. కలెక్టర్కు ఈ ప్రాంతవాసులు లక్ష్మీనారాయణ, సాలమ్మ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఏప్రిల్ 9న డిప్యూటీ కలెక్టర్, ఒడా అధికారులు విచారణకు ఎర్రగొండపాలెం వచ్చారు. ఆ సమయంలో అందుకు సంబంధించి రిపొర్టు ఇవ్వాలని ఆ సర్వేయర్ను ఆదేశించినా ఇటు కార్యాలయంలోగానీ, జిల్లా అధికారులకు గాని ఇవ్వలేదని బుధవారం స్పష్టమైందని ఇటు ఫిర్యాదుదారులు అటు మండల సర్వేయర్ తెలిపారు. ఇదిలా ఉంటే సర్వే కోసం వచ్చిన డీఈఎస్ మండల సర్వేయర్లతో పాటు ఆ సచివాలయ సర్వేయర్ కూడా వచ్చారు. ఆ సర్వేయర్ ఉంటే పూర్తి స్థాయిలో రిపొర్టు రాదని కొలతల విషయంలో తారుమారు చేస్తారని వారికి విన్నవించారు. దీంతో ఆ సర్వేయేర్ను అక్కడి నుంచి పంపించారు. స్థానిక సర్వేయర్లతో కాకుండా త్రిపురాంతకం మండల సర్వేయర్లతో ఆక్రమిత భూములను కొలతలు వేయిస్తున్నట్లు ఆయన ఫిర్యాదుదారులకు వివరించారు. సర్వే రిపోర్టులు ఇవ్వని సర్వేయర్పై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్, మండల సర్వేయర్లను కోరారు. ఏదేమైనా ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించే విషయంలో స్థానిక అధికారులు ఏమేరకు చర్యలు తీసుకుంటారో అన్నది ప్రశ్నగానే మారింది.
Updated Date - Jul 09 , 2025 | 10:36 PM