భూ అక్రమాలకు పాల్పడిన ఏడుగురి అరెస్టు
ABN, Publish Date - Jul 02 , 2025 | 11:28 PM
కనిగిరిలో సుమారు రూ.10 కోట్లకు పైనే విలువ చేసే భూమికి సంబంధించి అక్రమాలకు పాల్పడిన 14 మందిపై కేసు నమోదు చేసి ఏడుగురిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు డీఎ్సపీ సాయిఈశ్వర్యశ్వంత్ తెలిపారు.
పరారీలో మరో ఏడుగురు
డీఎ్సపీ సాయిఈశ్వర్యశ్వంత్
కనిగిరి, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : కనిగిరిలో సుమారు రూ.10 కోట్లకు పైనే విలువ చేసే భూమికి సంబంధించి అక్రమాలకు పాల్పడిన 14 మందిపై కేసు నమోదు చేసి ఏడుగురిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు డీఎ్సపీ సాయిఈశ్వర్యశ్వంత్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. పట్టణ సమీపంలోని కందుకూరు రోడ్డులో 301, 302 సర్వే నెంబర్లలోని రూ. 10కోట్లకు పైగా విలువైన 95 సెంట్ల భూమిని 14 మంది కాజేసేందుకు కుట్ర పన్నారన్నారు. అందు కోసం రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారుల ధ్రువీకరణకు నకిలీ పత్రాలు సృష్టించారన్నారు. ఈ పత్రాల్లోని వారి ఇంటి పేర్లతో ఉన్న వ్యక్తులను తీసుకు వచ్చి వారసులంటూ తప్పుడు రిజిస్ర్టేషన్ చేయించారని ఆయన వెల్లడించారు. ఇందులో ప్రధానంగా వెలిగండ్ల ప్రాంతానికి చెందిన గోనా బర్నబాస్ మరో 14 మందితో ముఠాకట్టాడని, వీరంతా కలసి అక్రమంగా ఆ భూమిని అమ్మారని తెలిపారు. గతంలో ఆ భూమిని రిజిస్ర్టేషన్ చేయించుకున్న వ్యక్తులకు విషయం తెలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని డీఎస్పీ వివరించారు. ఆ ఫిర్యాదు మేరకు సంబంధిత రెవెన్యూ రికార్డులు, లింకు రిజిస్ర్టేషన్ డాక్యుమెంట్లను పరిశీలించగా తప్పుడు రిజిస్ర్టేషన్గా నిర్దారణ అయిందని ఆయన వెల్లడించారు. దీంతో ఆక్రమానికి పాల్పడినవారిపై కేసు నమోదు చేశామని, వారిలో ఏడుగురు పరారీలో ఉండగా, మరో ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఐ ఖాజావలి, ఎస్ఐ టీ శ్రీరాం, మాధవరావు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
Updated Date - Jul 02 , 2025 | 11:28 PM