కొండపి, మంగమూరు పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు
ABN, Publish Date - Jul 24 , 2025 | 01:01 AM
జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మండల కేంద్రమైన కొండపి, సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించేందుకు ఇప్పటికే ఈసీ ఆదేశాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల జాబితాలను ప్రచురించారు.
రెండు సర్పంచ్లూ ఎస్సీ మహిళకు కేటాయింపు
వార్డులకూ రిజర్వేషన్లు ప్రకటన
ఎన్నికల అధికారులను నియమించేందుకు చర్యలు
ఇప్పటికే పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల
ఒంగోలు కలెక్టరేట్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మండల కేంద్రమైన కొండపి, సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించేందుకు ఇప్పటికే ఈసీ ఆదేశాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల జాబితాలను ప్రచురించారు. వాటిపై అభ్యంతరాలను స్వీకరించి ఈనెల 17న తుది జాబితా ప్రచురించారు. మరోవైపు పార్టీల ప్రతినిధులతో సమావేశాలను నిర్వహించారు. తదనుగుణంగా ఇప్పటికే రెండు గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లను కూడా ఖరారు చేశారు. కొండపి, మంగమూరు పంచాయతీల సర్పంచ్ పదవులను ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. కొండపిలో 6,678 మంది ఓటర్లు ఉండగా 14 వార్డులుగా విభజించారు. ఒక్కో వార్డులో 477 మంది ఓటర్లు ఉన్నారు. మంగమూరు పంచాయతీలో 3,252 మంది ఓటర్లు ఉండగా 12 వార్డులుగా విభజించారు. ఆయా వార్డులకు కూడా రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం స్టేజ్-1, స్టేజ్-2 అధికారులను నియమించేందుకు జిల్లా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే నిర్వహణకు అవసరమైన కసరత్తును ప్రారంభించనున్నారు.
Updated Date - Jul 24 , 2025 | 01:01 AM