వైసీపీ సర్పంచ్ అక్రమాలపై నిరసన
ABN, Publish Date - May 08 , 2025 | 01:47 AM
బంధువులని కూడా చూడకుండా గ్రామ సర్పంచ్ తమ భూములను అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నాడు. కార్యాలయాల చుట్టూ తిరిగినా న్యాయం జరగడం లేదు. ఇక మాకు చావే శరణ్యం’ అని మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పురుగుల మందు డబ్బాలతో మండలంలోని బోడపాడు గ్రామానికి చెందిన కొందరు బుధవారం ఆందోళనకు దిగారు.
పురుగు మందు డబ్బాలతో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన
సమస్య పరిష్కరిస్తానని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో విరమణ
మార్కాపురం, మే 7 (ఆంధ్రజ్యోతి) : ‘బంధువులని కూడా చూడకుండా గ్రామ సర్పంచ్ తమ భూములను అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నాడు. కార్యాలయాల చుట్టూ తిరిగినా న్యాయం జరగడం లేదు. ఇక మాకు చావే శరణ్యం’ అని మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పురుగుల మందు డబ్బాలతో మండలంలోని బోడపాడు గ్రామానికి చెందిన కొందరు బుధవారం ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం వరకు నిరసనను కొనసాగించారు. విషయం తెలుసుకున్న టౌన్ ఎస్సై డాక్టర్ రాజమోహన్రావు అక్కడకు చేరుకొని వారితో మాట్లాడినా ససేమిరా అన్నారు. తహసీల్దార్ చిరంజీవి వెళ్లి తప్పక న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాధితుల కథనం మేరకు.. మండలంలోని పెద్దయాచవరం ఇలాకాలోని సర్వే నంబర్ 3/5లో 2.22 ఎకరాల భూమి ఉంది. అది పూర్వీకుల నుంచి ఐదుగురు అన్నదమ్ములకు చెందినది. కానీ వైసీపీ నాయకుడు, బోడపాడు గ్రామ సర్పంచ్ రమణారెడ్డి రాజకీయ అండతో అతని మామ, ఐదుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడైన పోరెడ్డి కాశిరెడ్డి పేరున పొలాన్ని ఆన్లైన్ చేయించుకున్నారు. అంతేకాక ఆ భూమిని కాశిరెడ్డి కుమార్తె, సర్పంచ్ భార్య అయిన వరలక్ష్మి పేరున రిజిస్టర్ చేయించుకున్నారని బాధితులు తెలిపారు. ఈ విషయమై తామంతా కలిసి సర్పంచ్ రమణారెడ్డిని నిలదీస్తే దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్నారన్నారు. గట్టిగా మాట్లాడిన తమపై ఇప్పటికే మూడుసార్లు దాడులు చేశాడని చెప్పారు. వారం క్రితం కూడా తమపై సర్పంచ్ రమణారెడ్డి అతని తమ్ముళ్లు, కుమారులు, బావమరుదులతో కలిసి దాడి చేశారని వారు ఆరోపించారు. రూరల్ పోలీసు స్టేషన్లో కేసు కూడా నమోదైందని తెలిపారు. ఎంత పోరాడినా తమకు న్యాయం జరగడంలేదు కాబట్టే చావే శరణ్యమని భావించి పురుగుమందుల డబ్బాలతో అధికారుల వద్దకు వచ్చామన్నారు. బాధితులు పోరెడ్డి నాగమ్మ, అల్లూరమ్మ, శివారెడ్డి, లక్ష్మి పాల్గొన్నారు.
Updated Date - May 08 , 2025 | 01:47 AM