ఘనంగా మొహర్రం
ABN, Publish Date - Jul 07 , 2025 | 11:28 PM
పదిరోజులుగా నిర్వహిస్తున్న మొహర్రం వేడుకలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా మార్కాపురంలో పట్టణంలోని పీర్లకు పెద్ద షరగత్, సహాదత్ (నీళ్లలో ముంచే కార్యక్రమం) ఘనంగా నిర్వహించారు.
మార్కాపురం వన్టౌన్, జూలై7 (ఆంధ్రజ్యోతి): పదిరోజులుగా నిర్వహిస్తున్న మొహర్రం వేడుకలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా మార్కాపురంలో పట్టణంలోని పీర్లకు పెద్ద షరగత్, సహాదత్ (నీళ్లలో ముంచే కార్యక్రమం) ఘనంగా నిర్వహించారు. గొర్లగడ్డలోని బాదుల్లా స్వామి, తూర్పువీధిలోని చిన్నబాదుల్లాస్వామి పీర్లను ప్రత్యేకంగా అలంకరించిన విద్యుత్ చాందిరిలో ఉంచి నగరోత్సవం చేశారు. పీర్లకు రంగురంగుల దట్టీలు కట్టి వెండి గొడుగులు, నాగాభరణలు, వెండి ఊయలతో అలంకరించారు. ఉదయం పెద్ద షరగత్ అనంతరం పీర్లను మకానాలలో ఉంచి రాత్రి ఊరేగింపుగా షహదత్ కార్యక్రమం నిర్వహించారు. బొరుగులు, పప్పులు, బెల్లం ఫాతేహాలుగా సమర్పించారు. వెలిగించిన పీర్ల గుండాలను మూసివేసి పీర్లతో పాటు భక్తులు కూడా గుండం చుట్టూ తిరిగారు. గుండంలోని బూడిదను వివిధ రోగాల నివారణ నిమిత్తం భద్రపరుచుకున్నారు. మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి గుండ్లకమ్మ నది వద్ద పీర్లను నీళ్లల్లో ముంచే కార్యక్రమం నిర్వహించారు. గొర్లగడ్డ, తూర్పువీధి, ఆర్టీసీ బస్టాండ్, విజయ టాకీస్, నాగులవరం రోడ్డు, రాజీవ్ కాలనీలలోని పీర్లకు వైభవంగా కార్యక్రమాలు నిర్వహించారు. రెండు రోజుల అనంతరం జియారత్ నిర్వహించి పీర్లను ఆయా మాకానాలలో భద్రపరిచారు.
Updated Date - Jul 07 , 2025 | 11:29 PM