పొగాకు సమాఖ్య పీఐసీగా జేసీ బాధ్యతలు
ABN, Publish Date - Apr 23 , 2025 | 02:09 AM
రాష్ట్ర పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య పర్సన్ ఇన్చార్జిగా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. పీఐసీగా ఆయన్ను నియమిస్తూ సహకారశాఖ కమిషనర్ ఈనెల 15న ఉత్తర్వులు ఇచ్చి న విషయం విదితమే.
శుభాకాంక్షలు చెప్పిన సిబ్బంది
ఒంగోలు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య పర్సన్ ఇన్చార్జిగా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. పీఐసీగా ఆయన్ను నియమిస్తూ సహకారశాఖ కమిషనర్ ఈనెల 15న ఉత్తర్వులు ఇచ్చి న విషయం విదితమే. మంగళవారం సమాఖ్య సిబ్బంది సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ పీఐసీ విషయంలో గతంలో పెద్ద రగడే జరిగింది. ఒంగోలు కేంద్రం గా ఉన్న సమాఖ్యకు ఒకప్పుడు రాష్ట్రంలో సహకార సంఘంలోని రైతు సంస్థలలో ప్రత్యేక గుర్తింపు ఉండేది. కాగా వైసీపీ కాలంలో క్రమంగా ఆ ప్రాభవం తగ్గిపోయింది. రెండు నెలల క్రితం పాలక మండలి పదవీ కాలం పూర్తైంది. కాగా సహకార శాఖ జిల్లా అధికారులు అసిస్టెంట్ రిజిస్ట్రార్ కేడర్లో డీసీఏవో హోదాలో పనిచేస్తున్న సూరి శ్రీనివా సరావును పీఐసీగా నియమించారు. అధికార పార్టీ కీలక నేతలతో మాట మాత్రం కూడా చెప్పకుండా నియామకం చేయడమే కాక కనీసం డివిజనల్ సహకార అధికారి, ఆపైస్థాయి వారిని నియమించాల్సిన పీఐసీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ను నియమించడంపై విమర్శలు వచ్చాయి. విషయం తన దృష్టికి రావడంతో మంత్రి స్వామి సహకార శాఖ జిల్లా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ డీసీవోగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వానికి కలెక్టర్ సరెండర్ చేయడంలో ఇది కూడా ఒక ప్రధాన అంశంగా ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. సమాఖ్య పీఐసీగా సూరి శ్రీనివాసులును నియమించిన ఉత్తర్వులను రద్దుచేసి, ఆ స్థానంలో జేసీ గోపాల కృష్ణను నియమిస్తూ కమిషనర్ వారం క్రితం ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో మంగళవారం జేసీ ఆ బాధ్యతలను స్వీకరించారు.
Updated Date - Apr 23 , 2025 | 02:09 AM