ప్రజాప్రభుత్వానికి ఆశీస్సులు అందించండి
ABN, Publish Date - Jun 28 , 2025 | 12:03 AM
రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న ప్రజాప్రభుత్వానికి ప్రజలు ఆశీస్సులు ఇవ్వాలని మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఎదురు రూ.61 లక్షలతో నిర్మిస్తున్న అన్నా క్యాంటీన్కు కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి శుక్రవారం భూమిపూజ చేశారు.
మంత్రి డాక్టర్ వీరాంజనేయస్వామి
సింగరాయకొండలో రూ.61 లక్షలతో నిర్మిస్తున్న అన్నా క్యాంటీన్కు కలెక్టర్తో కలిసి భూమిపూజ
త్వరలో ఈనాం భూముల సమస్యకు పరిష్కారం
సింగరాయకొండ, జూన్ 27 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న ప్రజాప్రభుత్వానికి ప్రజలు ఆశీస్సులు ఇవ్వాలని మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఎదురు రూ.61 లక్షలతో నిర్మిస్తున్న అన్నా క్యాంటీన్కు కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018లో కందుకూరు రోడ్డు సెంటర్లో అన్నాక్యాంటీన్ నిర్మాణాన్ని ప్రారంభించగా, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాని నిర్మాణాన్ని అర్ధంతరంగా నిలిపేసిందని తెలిపారు. ప్రస్తుతం అన్నాక్యాంటీన్ల డిజైన్ మారినందున ఆస్థలం సరిపోకపోవడంతో మార్చామన్నారు. కార్మికులు, పేదలు అధికంగా ఉండే ఇక్కడే తొలిప్రాధాన్యతగా క్యాంటీన్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. క్యాంటీన్లో రూ.5 ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడతారన్నారు. గుంతలమయంగా ఉన్న ట్రంకురోడ్డు నిర్మాణానికి మార్చి తరువాత బడ్జెట్లో నిధులు తీసుకొచ్చి పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. మండల ప్రజల ఎదుర్కొంటున్న ఈనాం భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మంత్రుల ఉపసంఘం కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. మూలగుంటపాడు భూముల రిజిస్ర్టేషన్ సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని హామీఇచ్చారు. కలెక్టర్ అన్సారియా మాట్లాడుతూ మూడు నెలలలోపు అన్నా క్యాంటీన్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. అనంతరం ఎస్సీ బాలుర వసతిగృహం ఆధునికీకరణ పనులను వారు పరిశీలించారు. అనంతరం వాడుకలో లేని ఆర్అండ్బీ గెస్ట్హౌస్ పరిశీలనకు వెళ్లగా తాళాలు వేసి ఉండటంతో వినియోగంలోకి తీసుకొచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. తదనంతరం నిర్మాణంలో ఉన్న కూరగాయల మార్కెట్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో లక్ష్మీప్రసన్న, పబ్లిక్ హెల్త్ ఈఈ శ్రీనివాస సంజయ్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ లక్ష్మానాయక్, ఎంపీడీవో జయమణి, టీడీపీ మండల అధ్యక్షుడు సింగయ్య, నేతలు చీమకుర్తి కృష్ణ, సంధానీబాషా, సన్నెబోయిన శ్రీనివాసులు, కూనపరెడ్డి సుబ్బారావు, సుదర్శి చంటి, గాలి హరిబాబు, బ్రహ్మయ్య, గిరి, గుదే వెంకటేశ్వర్లు, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jun 28 , 2025 | 12:03 AM