మాజీ సైనికుడి భూమి కబ్జా
ABN, Publish Date - Mar 11 , 2025 | 11:14 PM
మాజీ సైనికుడు భూమిని కబ్జాకు వైసీపీ నేతలు తెగబడుతున్నారు. పాలన పోయినా వాసన పోలేదన్నట్లుగా పేదల భూములపైనే కాకుండా మాజీ సైనికులు భూములను కూడా కాజేసేందుకు యత్నిస్తున్నారు. ఇందుకు మంగళవారం జరిగిన సంఘటన అద్దం పడుతుంది.
బాధితుల ఫిర్యాదు మేరకు భూమిని పరిశీలించిన తహసీల్దార్
కనిగిరి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): మాజీ సైనికుడు భూమిని కబ్జాకు వైసీపీ నేతలు తెగబడుతున్నారు. పాలన పోయినా వాసన పోలేదన్నట్లుగా పేదల భూములపైనే కాకుండా మాజీ సైనికులు భూములను కూడా కాజేసేందుకు యత్నిస్తున్నారు. ఇందుకు మంగళవారం జరిగిన సంఘటన అద్దం పడుతుంది. వివరాల్లోకి వెళితే..
1943 నుంచి 1947 వరకు జరిగిన రెండవ ప్రపంచయుద్దంలో లాన్స్ నాయక్గా విధులు నిర్వహించి యుద్ధంలో పొల్గొన్నందుకు భారత ప్రభుత్వం మాజీ సైనికుల కోటా కింద కనిగిరి గ్రామం పరిధిలోని పొదిలి రోడ్డులో 843/ఏ1 సర్వే నెంబరులో 2.5 ఎకరాల భూమిని 2001లో కోండ్రు జాన్కు మంజూరు చేసింది. అందుకు భారత ప్రభుత్వం డీ ఫారం డీకే పట్టా, రిజిస్టరుతో పాటు పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయించింది. అప్పటినుంచి ఆ భూమి వారి ఆధీనంలో ఉంది. 2005లో మాజీ సైనికుడు కొండ్రు జాన్ మరణించారు. అయితే, మాజీ సైనికుడు భూమిపై కన్నేసిన అక్రమార్కులు ఆదివారం రాత్రికి రాత్రి ఆ భూమిలో ఫెన్సింగ్ రాళ్లు తోలించి అక్రమ కట్టడాలకు పూనుకున్నారు. తప్పుడు రికార్డులు సృష్టించి ఆయా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి కట్టడాలు నిర్మిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మాజీ సైనికుని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో సంబంధిత భూమిని తహసీల్దార్ రవిశంకర్ మంగళవారం పరిశీలించారు. అక్రమంగా కట్టడాలను నిర్మిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Updated Date - Mar 11 , 2025 | 11:14 PM