ఈ-వ్యర్థాలపై సమరం
ABN, Publish Date - Apr 20 , 2025 | 12:05 AM
ఇళ్లలో ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోతున్న ఈ-వ్యర్థాలపై ప్రభుత్వం సమరం ప్రారంభించింది. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర పేరుతో ప్రతినెలా మూడో శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఈసారి ఈ-వ్యర్థాల నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు వాటిని సేకరించి రీసైక్లింగ్ చేయడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చింది.
జిల్లా అంతటా ర్యాలీలు, సభలు
పలుచోట్ల వ్యర్థాల సేకరణ
ఒంగోలులో రీసైక్లింగ్ కేంద్రం ప్రారంభం
ఉత్సాహంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు
ఒంగోలు, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ఇళ్లలో ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోతున్న ఈ-వ్యర్థాలపై ప్రభుత్వం సమరం ప్రారంభించింది. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర పేరుతో ప్రతినెలా మూడో శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఈసారి ఈ-వ్యర్థాల నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు వాటిని సేకరించి రీసైక్లింగ్ చేయడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చింది. తదనుగుణంగా శనివారం జిల్లావ్యాప్తంగా ఈ-వ్యర్థాలపై అవగాహన పేరుతో పెద్దఎత్తున ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. ఒంగోలులో రీసైక్లింగ్ సెంటర్ను కూడా ప్రారంభించారు. అలాగే పలుచోట్ల రోడ్లు, డ్రైన్ల పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులోని పీవీఆర్ హైస్కూలు నుంచి కొత్త మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ సభ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లా ప్రత్యేక అధికారి సురేష్కుమార్, కలెక్టర్ తమీమ్ అన్సారియా తదితరులు పాల్గొన్నారు. కనిగిరిలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పట్టణంలోని పలు డ్రైన్ల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనగా మార్కాపురం పట్టణంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూ రులో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి, దర్శిలో నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్యలు ఈ వ్యర్థాల అవగాహన ర్యాలీలు, సభలకు హాజరయ్యారు. అలాగే పలు ఇతర పట్టణాలు, మండల కేంద్రాల్లోనూ ఇదే తరహా కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది పరిశుభ్రత కార్యక్రమలను నిర్వహించారు.
Updated Date - Apr 20 , 2025 | 12:05 AM