దాడుల భయంతో మూత
ABN, Publish Date - Jul 22 , 2025 | 01:07 AM
మార్కాపురం డివిజన్లో విచ్చలవిడిగా సాగుతున్న నకిలీ, కాలం చెల్లిన మందుల విక్రయాలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. క్రమం తప్పకుండా ఫిర్యాదులు అందుతుండడంతో దాడులకు సిద్ధమైనట్లు సమాచారం.
తనిఖీల సమాచారంతో తెరుచుకోని మెడికల్ షాపులు
విచ్చలవిడిగా నకిలీ, కాలం చెల్లిన మందుల అమ్మకాలు
ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అధికారుల ఆరా
మార్కాపురం, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం డివిజన్లో విచ్చలవిడిగా సాగుతున్న నకిలీ, కాలం చెల్లిన మందుల విక్రయాలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. క్రమం తప్పకుండా ఫిర్యాదులు అందుతుండడంతో దాడులకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం మార్కాపురంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలావరకు మెడికల్ షాపులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మూసివేశారు. విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తారనే భయంతోనే షాపులు అనధికారికంగా బంద్ చేసినట్లు తెలిసింది.
ఇష్టారీతిన విక్రయాలు
ఒక్క మార్కాపురం పట్టణంలోనే సుమారు 150 వరకు మెడికల్ షాపులు ఉన్నాయి. వీటిలో పెద్దపాటివి 20లోపే. ప్రతి మెడికల్ షాపులో కాలం చెల్లిన మందులు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. వీటిని కొనుగోలు చేసి వాడిన వారు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నాయి. అంతేకాక పల్నాడు జిల్లాలోని ఔషధాలు మార్కాపురానికి వస్తున్నట్లు సమాచారం. వాటిని అతి తక్కువ ధరకు కొని మంచివాటితో సమానమైన ధరలను షాపు యజమానులు దండుకుంటున్నారు. ధరల విషయంలో కూడా షాపుల యజమానులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కేవలం పది మాత్రల ధర రూ.10 కూడా ఉండని జనరిక్ మందులను కూడా రూ.100కు విక్రయిస్తున్నారు. ఇక ప్రైవేటు వైద్యశాలల్లో ఉండే మెడికల్ షాపుల్లో దోపిడీకి అడ్డూఅదుపే ఉండడం లేదు. చిన్నపాటి జబ్బుచేసినా రూ.వేలల్లో మందులకే ఖర్చు చేయాల్సివస్తోంది. కొందరు ఎలాంటి సర్టిఫికెట్లు కూడా లేకుండా అనధికారికంగా షాపులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. చాలామంది ఆర్ఎంపీ, పీఎంపీలు కూడా హోల్సేల్ మెడికల్ షాపుల్లో మందులు కొని ఎలాంటి అర్హత లేకపోయినా రోగులకు వైద్యం పేరుతో అమ్మకాలు చేస్తున్నారు.
కట్టడికి చర్యలు శూన్యం
మార్కాపురంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఉంది. కానీ ఏ రోజూ ఒక్క మెడికల్ షాపుపై కూడా కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. వాస్తవానికి ప్రతి షాపునూ తప్పకుండా నిర్థిష్ట కాలవ్యవధిలో తనిఖీ చేయాల్సి ఉంది. ఆకస్మిక తనిఖీలు చేపట్టి నకిలీ, కాలం చెల్లిన మందులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. ప్రతి షాపులోనూ డి.ఫార్మసీ సర్టిఫికెట్ కల్గిన వాళ్లు మాత్రమే మందులు అమ్మేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. మార్కాపురంలో ఉన్న 150 దుకాణాల్లో దాదాపు 100కిపైగా దుకాణాల్లో సర్టిఫికెట్ ఉన్న వ్యక్తులు విక్రయాలు చేయడం లేదు. ధరల నియంత్రణపై కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తున్న దాఖలాలు ఉండడంలేదు. కేవలం ప్రతి షాపు నుంచి నెలకు ఇంతని టార్గెట్లు పెట్టి వసూళ్లు చేసుకుంటూ ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
Updated Date - Jul 22 , 2025 | 01:07 AM