మోకాళ్లపై సీహెచ్వోల నిరసన
ABN, Publish Date - May 18 , 2025 | 11:30 PM
తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఆదివారం ఒంగోలులో నిరసన ర్యాలీతోపాటు మానవహారం నిర్వహించారు.
సమస్యలను పరిష్కరించాలని చర్చి సెంటర్లో మానవహారం
ఒంగోలు కలెక్టరేట్, మే 18 (ఆంధ్రజ్యోతి) : తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఆదివారం ఒంగోలులో నిరసన ర్యాలీతోపాటు మానవహారం నిర్వహించారు. 20 రోజులుగా కలెక్టరేట్ ఎదుట దీక్షలు నిర్వహిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆదివారం నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. కలెక్టరేట్ వద్ద నుంచి భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం చర్చిసెంటర్లో మానవహారం నిర్మించారు. మోకాళ్లపై కూర్చొని తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బిర్రు సందీ్పకుమార్, రాష్ట్ర కోఆర్డినేటర్ వినోద్కుమార్లు మాట్లాడుతూ శ్రమకు తగిన వేతనం ఇవ్వడం లేదని ఆరోపించారు. రూ.40వేలు ఇస్తామని సర్క్యులర్ ఇచ్చి ప్రస్తుతం కేవలం రూ.25వేలు మాత్రమే వేతనం ఇస్తున్నారన్నారు. గ్రామీణ, కొండ ప్రాంతాల్లో పనిచేస్తుంటే ఎఫ్ఆర్ఎస్ అని చెప్పి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల వేతనాలు కట్ చేయడం దుర్మార్గంగా ఉందని చెప్పారు. ఎన్ఎంహెచ్ ఉద్యోగులందరికీ 23శాతం ఇంక్రిమెంట్తో పాటు ఏడాది నుంచి పెండింగ్లో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మంగళగిరి రాజేష్, శ్రీకాంత్, గంట ప్రసన్న, జీవన్జ్యోతి, పసుపులేటి శైలజ, దీప్తి, కామేష్, రామాంజనేయులు తదితరులు ఉన్నారు.
Updated Date - May 18 , 2025 | 11:30 PM