సెల్ఫోన్పై తలోమాట
ABN, Publish Date - Mar 19 , 2025 | 01:27 AM
పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సెల్ఫోన్ వినియోగంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు తలా ఒక మాట చెప్తున్నారు. దీంతో ఎవరి మాట విని ముందుకు వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఏమి చేయాలో పాలుపోక పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు తలలు పట్టుకుంటున్నారు.
ఎవరి మాట వినాలో తెలియని అయోమయం
తలలు పట్టుకుంటున్న పదో తరగతి పరీక్షల చీఫ్లు
ఒంగోలు విద్య, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సెల్ఫోన్ వినియోగంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు తలా ఒక మాట చెప్తున్నారు. దీంతో ఎవరి మాట విని ముందుకు వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఏమి చేయాలో పాలుపోక పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు తలలు పట్టుకుంటున్నారు. పరీక్షల నిర్వహణలో గతంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గత ఏడాది నుంచి కేంద్రాలను నో ఫోన్ జోన్లుగా ప్రకటించింది. రెండేళ్ల క్రితం వాట్సాప్ ద్వారా ప్రశ్నపత్రాలు బయటకు లీకవడంతో ముందుజాగ్రత్తగా పరీక్షా కేంద్రాల్లో సెల్ఫోన్లను నిషేధించారు. ఈ ఏడాది కూడా ముందుగానే పరీక్షా కేంద్రాలను నో ఫోన్ జోన్లుగా ప్రకటించి సెల్ఫోన్లను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లపై వెబెక్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, ఆర్జేడీలు ఇతర జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావే శంలో కూడా సెల్ఫోన్లు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. దీంతో కేంద్రాల్లోకి చీఫ్లు, డీవోలు, ఇన్విజిలేటర్లు, ఏఎన్ఎంలు, పోలీసులు ఫోన్లు తీసుకురావద్దని ఆదేశించారు. అయితే పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు నిర్వహించిన వెబెక్స్లో చీఫ్లు మాత్రమే ఆండ్రాయిడ్లు కాకుండా ఇతర మామూలు ఫోన్లను వాడవచ్చన్నారు. ఏదైనా అత్యవసరమైతే వినియోగించాలని ఆదేశించారు. పాఠశాల విద్య గుంటూరు ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి కూడా మామూలు ఫోన్ను చీఫ్లు పరీక్షా కేంద్రాలకు తేవచ్చన్నారు. అయితే డీఈవో కిరణ్కుమార్ మాత్రం ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు ఎవరు కేంద్రాలకు సెల్ఫోన్లు తీసుకురావద్దని చెబుతున్నారు. ఈనేపథ్యంలో ఎవరి ఆదేశాలు పాటించాలో అర్థం కాక చీఫ్లు తలలు పట్టుకుంటున్నారు.
సెలవు రోజుల్లో బడికి వెళ్లడంపై అసంతృప్తి
పదో తరగతి పరీక్షలు రోజు మార్చి రోజు నిర్వహిస్తున్నారు. పరీక్ష లేని రోజు చీఫ్లు, డీవోలు కూడా స్కూల్కు వెళ్లాల్సిందేనని అధికారులు ఆదేశించడంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాల్లో పరీక్ష ఉన్న రోజు మధ్యాహ్నం, సెలవు రోజు ఉదయం పూట 6 నుంచి 9 తరగతులకు విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తారు. అప్పుడు సీటింగ్ ఏర్పాట్లు, బోర్డు మీద, బల్లల మీద రాసిన హాల్టిక్కెట్ నెంబర్లు కూడా చెరిగిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సెలవు రోజు మధ్యాహ్నం చీఫ్లు, డీవోలు మళ్లీ సీటింగ్ ఏర్పాటు చేసుకొని నంబర్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే వీరు స్కూలుకు పోయి వచ్చి ఏర్పాట్లు ఎప్పుడు చేసుకోవాలని వాపోతున్నారు.
Updated Date - Mar 19 , 2025 | 01:27 AM