నీటి కుంటలతో రైతులకు మెరుగైన ఆదాయం
ABN, Publish Date - Jul 30 , 2025 | 01:33 AM
నీటి కుంటలతో రైతులు మెరుగైన ఆదాయ వనరులను సొంతం చేసుకోవచ్చని కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. మంగళవారం కందులాపురం, కంభం పంచాయతీలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సేద్యపు నీటి కుంటలను ఆమె పరిశీలించారు.
కంభం, కందులాపురంలో పరిశీలించిన కలెక్టర్
కంభం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): నీటి కుంటలతో రైతులు మెరుగైన ఆదాయ వనరులను సొంతం చేసుకోవచ్చని కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. మంగళవారం కందులాపురం, కంభం పంచాయతీలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సేద్యపు నీటి కుంటలను ఆమె పరిశీలించారు. తొలుత కలెక్టర్ కందులాపురంలో ఉపాధి హామీ పథకం కింద రైతులు మురళి, ప్రసాద్లకు చెందిన పొలాల్లో నిర్మించిన కుంటలను చూశారు. అనంతరం వారిద్దతో మాట్లాడి సాగు చేస్తున్న పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో కలిసి ఆమె మొక్కలను నాటారు. ఆ సమయంలో కలెక్టర్ను కలిసిన ఉపాధి కూలీలు తమకు 4 వారాలకు పైగా ఉపాధి డబ్బులు అందలేదని ఫిర్యాదు చేయలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ వివరణ కోరగా.. ఫీల్డ్ అసిస్టెంట్ పొంతనలేని సమాధానాలు చెబుతుండడంపై అసహనం వ్యక్తం చేశారు. మండలంలో ఎంత మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు, వారిలో ఎంత మంది ఎంత కాలం పని చేశారు, పని చేసిన కాలానికి ఎంతవరకు నగదు జమ అయింది అని కలెక్టర్ డ్వామా పీడీ జోస్ఫకుమార్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంభం పంచాయతీ పరిధిలో వెంకటేశ్వర్రెడ్డి పొలంలో చేపట్టిన రైతు వారీ నీటికుంటను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షం నీరు వృథాగా పోకుండా భూమిలోకి ఇంకేందుకు నీటి కుంటలు ఉపయోగపడతాయన్నారు. తీవ్ర వర్షాభావ ప్రాంతమైన మార్కాపురం డివిజన్లో ఇవి రైతులకు ఎంతోమేలని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 1,075 రైతు వారీ కుంటల నిర్మాణాలు పూర్తి చేశామని, మరో 800 పురోగతిలో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం సబ్కలెక్టర్ త్రివినాథ్, తహసీల్దార్ కిరణ్, ఎంపీడీవో ఖాదర్, ఏపీడీ భాస్కర్రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 30 , 2025 | 01:33 AM