టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్యచౌదరి దారుణ హత్య
ABN, Publish Date - Apr 23 , 2025 | 02:17 AM
ఒంగోలు నగరంలో దారుణం చోటుచేసుకుంది. టీడీపీ ముఖ్యనేత, ఎన్జీపాడు మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు ముప్పవరపు వీరయ్యచౌదరి హత్యకు గురయ్యారు. వంటిపై మొత్తం 38 కత్తిపోట్లు ఉండటాన్ని బట్టి చూస్తే ఆయన్ను ఎంత కర్కశంగా పొడిచారో అర్థమవుతోంది. ఈ ఘటనతో నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు.
టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్యచౌదరి దారుణ హత్య
ఒంగోలు నడిబొడ్డున ఘటన
ఉలిక్కిపడిన నగరం
కార్యాలయంలో ఉండగానే కత్తులతో గుర్తుతెలియని దుండగులు దాడి
కిరాయి హంతకుల పనిగా భావిస్తున్న పోలీసులు
మృతదేహం రిమ్స్కు తరలింపు
భారీగా తరలివచ్చిన నేతలు, పార్టీ శ్రేణులు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ దామోదర్
తక్షణమే దర్యాప్తు ప్రారంభం
గుండెపోటుకు గురైన వీరయ్య మేనమామ ఈదర
ఒంగోలు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగరంలో దారుణం చోటుచేసుకుంది. టీడీపీ ముఖ్యనేత, ఎన్జీపాడు మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు ముప్పవరపు వీరయ్యచౌదరి హత్యకు గురయ్యారు. వంటిపై మొత్తం 38 కత్తిపోట్లు ఉండటాన్ని బట్టి చూస్తే ఆయన్ను ఎంత కర్కశంగా పొడిచారో అర్థమవుతోంది. ఈ ఘటనతో నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. యావత్తు పార్టీశ్రేణుల్లో ఆందోళన నెలకొంది. నగరంలోని పాత బైపాస్ రోడ్డులోని వీరయ్య కార్యాలయంలోకి ప్రవేశించిన నలుగురు యువకులు కత్తులతో విచక్షణారహితంగా పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. రాత్రి 7.30 ప్రాంతంలో ఈ హత్య జరిగింది. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన వీరయ్య చౌదరి దాదాపు మూడు దశాబ్దాలకుపైగా ఒంగోలు నగరంతోపాటు ఉమ్మడి జిల్లాలోని రాజకీయ, వ్యాపార వర్గాల వారందరికీ సుపరిచితుడు. జడ్పీ మాజీ చైర్మన్ ఈదర హరిబాబు దగ్గర బంధువుగా తొలుత ప్రజలకు పరిచయమైన వీరయ్యచౌదరి క్రమంగా రాజకీయ వ్యాపార వర్గాల్లో ఎదుగుతూ వస్తూ ఉమ్మడి జిల్లాలో గుర్తింపు పొందిన నాయకుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఎస్ఎన్పాడు నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేతగా బాపట్ల పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. గతంలో 2014-19 మధ్య నాగులుప్పలపాడు ఎంపీపీగా పనిచేసిన వీరయ్యచౌదరి గత పదేళ్లుగా రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. స్వతహాగా మద్యం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఈ వ్యాపారంలో కొనసాగుతున్న వీరయ్యచౌదరికి ఆ వ్యాపారాలు ఇతరత్రా వర్గాల వారితో విభేదాలు కూడా ఉండే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ మద్యం వ్యాపారం చేపట్టారు. అలాగే టీడీపీలో చురుగ్గా వ్యవహరిస్తూ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో వీరయ్య హత్యకు గురికావడం ఉమ్మడి జిల్లాలోని టీడీపీ శ్రేణులను కలవరపాటుకు గురిచేయగా ఊహించని రీతిలో జరిగిన హత్యతో ఒంగోలు ప్రజానీకం ఉలిక్కిపడ్డారు.
సొంత కార్యాలయంలోనే..
స్థానిక పాత బైపాస్ రోడ్డులో చాలాకాలంగా సొంత కార్యాలయాన్ని నిర్వహిస్తున్న వీరయ్య చౌదరి పగలంతా రాజకీయ, వ్యాపార కార్యక్రమాలను చూసుకుని సాయంత్రానికి ఆ కార్యాలయానికి వచ్చి తన వ్యక్తిగత పనులు చూసుకుంటుంటారు. అలాగే మంగళవారం సాయంత్రం కూడా వీరయ్య కార్యాలయంలో తన పనులు చూసుకుంటుండగా గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు కార్యాలయంలోకి చొరబడి కత్తులతో దాడిచేశారు. అందిన సమాచారం మేరకు.. రెండు బైకులపై వచ్చిన నలుగురు వ్యక్తులు రాత్రి 7.30 ప్రాంతంలో కార్యాలయంలోకి ప్రవేశించి ప్రధాన ద్వారానికి గడియపెట్టి రూములో ఉన్న వీరయ్యపై కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచారు. గుండెలో, మెడ, గొంతు ప్రాంతంలో దాదాపు 20కిపైగా కత్తిపోట్లు ఉన్నట్లు చెప్తున్నారు. దాడిలో వీరయ్య అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోగా కొంతసేపటి తర్వాత పోలీసులకు విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగిన వీరయ్య కార్యాలయం ఎస్పీ కార్యాలయానికి సమీపంలోనే ఉండగా విషయం తెలిసిన వెంటనే ఎస్పీ ఏఆర్.దామోదర్, ఇతర పోలీసు అధికారులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం వీరయ్యచౌదరి మృతదేహాన్ని రిమ్స్కు తరలించి తక్షణమే దర్యాప్తు చేపట్టారు. ఆరుగురు సీఐలు, 10మంది ఎస్ఐలతో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఘటన జరిగిన తీరును బట్టి హత్య చేసిన వారు ప్రొఫెషనల్ హంతకులుగా పోలీసులు భావిస్తున్నారు.
ఆర్థిక లావాదేవీలేనా?
మద్యం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో వీరయ్య చురుగ్గా ఉండగా ఆ వ్యాపారాలు, అలాగే ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా? అలాంటి వివాదాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చన్న అనుమానంతో ఆ వైపు దర్యాప్తుపై దృష్టిసారించారు. అలాగే బైపాస్కు ఇరువైపులా ఉన్న సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. విషయం తెలిసి వీరయ్య కార్యాలయం దగ్గరకు పెద్దసంఖ్యలో జనం చేరగా వారందరినీ దూరంగా పంపించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తరలివచ్చిన నాయకులు
వీరయ్యచౌదరి హత్యకు గురయ్యాడన్న వార్త కొద్దిసేపటికే ఒంగోలు నగరంతోపాటు జిల్లా అంతటా వ్యాపించింది. మృతదేహాన్ని రిమ్స్కు తరలించడంతో అక్కడికి ఒంగోలుతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులు, పార్టీశ్రేణులు భారీగా తరలివచ్చారు. మంత్రి డాక్టర్ డీఎస్బీవీ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు బీఎన్ విజయ్కుమార్, దామచర్ల జనార్దన్, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ ఈదర మోహన్లతోపాటు అనేకమంది ముఖ్యనాయకులు రిమ్స్ వద్దకు తరలివచ్చారు. వీరయ్య మృతదేహానికి నివాళులర్పించటంతోపాటు హత్య ఘటనను తీవ్రంగా ఖండించారు. రాత్రి పొద్దుపోయే వరకు ఇటు రిమ్స్లోనూ, అటు ఘటన జరిగిన వీరయ్య కార్యాలయం వద్ద పెద్దసంఖ్యలో ప్రజానీకం ఉన్నారు. స్వగ్రామమైన అమ్మనబ్రోలుతోపాటు నాగులుప్పలపాడు మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారు రిమ్స్కు భారీగా తరలివచ్చారు. రాత్రి 9గంటల ప్రాంతంలో ఎస్పీ దామోదర్ రిమ్స్ వద్దకు వచ్చి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. పోలీసుల సమాచారం ప్రకారం సంఘటన జరిగిన తీరు అనంతరం దర్యాప్తుకు తీసుకుంటున్న చర్యలను వారికి వివరించినట్లు సమాచారం.
Updated Date - Apr 23 , 2025 | 07:24 AM