జోరుగా పేకాట!
ABN, Publish Date - May 31 , 2025 | 01:10 AM
పెద్దలు పేకాట ఆడితే అది కాలక్షేపం.. సామాన్యులు ఆడితే మాత్రం అది జూదం.. ఇదీ నందిగామ డివిజన్ పోలీసుల ఆలోచన. చట్టం అందరికీ సమానం అంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలు చేసే పోలీసులు ఆర్థికంగా, రాజకీయంగా పేరున్న వ్యక్తులు రిక్రియేషన్ క్లబ్లలో పేకాట ఆడినా పట్టించుకోరు. సామాన్యులెవరైన చెట్ల కింద పేకాట ఆడితే వేటాడి, వెంటాడి పట్టుకోవడంతో పాటు అవమానకరంగా వారిని రోడ్ల వెంట నడిపిస్తూ తీసుకువస్తారు. తప్పు ఎవరు చేసినా తప్పే అన్న విషయం మరుస్తున్న నందిగామ డివిజన్ పోలీసులు పెద్దల పేకాటకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
-నందిగామ, కంచికచర్ల రిక్రియేషన్ క్లబ్ల్లో నిర్వహణ
-అటువైపు కన్నెత్తి చూడని పోలీసులు
-పోలీస్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసినా మారని తీరు
-సర్వత్రా వ్యక్తమవుతున్న విమర్శలు
పెద్దలు పేకాట ఆడితే అది కాలక్షేపం.. సామాన్యులు ఆడితే మాత్రం అది జూదం.. ఇదీ నందిగామ డివిజన్ పోలీసుల ఆలోచన. చట్టం అందరికీ సమానం అంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలు చేసే పోలీసులు ఆర్థికంగా, రాజకీయంగా పేరున్న వ్యక్తులు రిక్రియేషన్ క్లబ్లలో పేకాట ఆడినా పట్టించుకోరు. సామాన్యులెవరైన చెట్ల కింద పేకాట ఆడితే వేటాడి, వెంటాడి పట్టుకోవడంతో పాటు అవమానకరంగా వారిని రోడ్ల వెంట నడిపిస్తూ తీసుకువస్తారు. తప్పు ఎవరు చేసినా తప్పే అన్న విషయం మరుస్తున్న నందిగామ డివిజన్ పోలీసులు పెద్దల పేకాటకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆంధ్రజ్యోతి-నందిగామ:
నందిగామ, కంచికచర్ల పట్టణాల్లో పలు రిక్రియేషన్ క్లబ్లు ఉన్నాయి. కంచికచర్ల క్లబ్లో జోరుగా జూదం నిర్వహిస్తుండగా, నందిగామ క్లబ్ను సిద్ధం చేసి ఉంచారు. కొద్ది కాలం క్రితం ఆయా క్లబ్ల్లో నిర్వహిస్తున్న పేకాటపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి విజయవాడ సీపీ తీవ్రంగా స్పందించారు. ఏసీపీ, సీఐలు, ఎస్ఐలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన పేకాటపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన ఒక పోలీస్ అధికారి కంచికచర్ల క్లబ్లో పెద్దలు కొందరు కాలక్షేపానికి ఆడుకుంటున్నారంటూ చెప్పుకొచ్చినట్లు తెలిసింది. దీనిపై కూడా సీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కమిషనర్ ఆదేశాల మేరకు కొద్ది రోజులు పోలీసులు హడావిడి చేశారు. కానీ పేకాట ఆపలేకపోయారు. క్లబ్ల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చామంటూ పత్రికా ప్రకటనలు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు. ఉన్నతాధికారులను ఏమార్చారు.
ఆరు టేబుళ్లు ఏర్పాటు చేసి మరీ..
కంచికచర్ల క్లబ్లో నిత్యం ఆరు టేబుళ్లు ఏర్పాటు చేసి పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం. పలు ప్రాంతాలకు చెందిన జూదరులు ఇక్కడకు చేరుకొని పేకాట ఆడుతున్నట్లు తెలిసింది. ఆటకు వచ్చే వారు క్లబ్కు దూరంగా కార్లు పార్క్ చేసి అక్కడ నుంచి క్లబ్ నిర్వాహకులు పంపిన వాహనాల్లో క్లబ్ వద్దకు చేరుకుంటున్నారు. పోలీస్ స్టేషన్కు సమీపంలోనే ఉన్న ఈ క్లబ్లో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో పోలీసులు ఉన్నారా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు పోలీసులు క్లబ్ నిర్వాహకులతో మమేకమై పని చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కమిషనర్ను సైతం ఏమారుస్తూ స్థానిక పోలీసులు క్లబ్ నిర్వాహకులకు సహకరించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
నందిగామలో ఓ భవనంలో నిర్వహణ!
మరో వైపు నందిగామ క్లబ్లో కూడా అప్పుడప్పుడూ ఒకటి, రెండు టేబుళ్లు నిర్వహిస్తున్నట్లు తెలియవచ్చింది. నందిగామ పట్టణంలోని పాతబస్టాండ్లోని లిక్కర్ షాపు వెనుక ఒక భవనంలో భారీ ఎత్తున పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం. వివిధ ప్రాంతాలకు చెందిన పెద్దపెద్ద వ్యాపారులు ఇక్కడకు చేరుకొని భారీ మొత్తంలో బెట్టింగ్లు పెడుతున్నట్లు తెలిసింది. పేకాటలో అత్యంత భయంకరమైన మూడుముక్కలాట, లోపల బయట అనే ఆటలు నిత్యం ఆ భవనంలో నిర్వహిస్తున్నట్లు సమాచారం. కోట్ల రూపాయల మేర బెట్టింగ్లు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ తతంగం మొత్తం పట్టణానికి చెందిన ఒక వ్యాపారి, కొందరు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంత పెద్దమొత్తంలో బెట్టింగ్లతో జరుగుతున్న ఈ పేకాట సమాచారం పోలీసులకు ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అడ్డుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాజంలో సమన్యాయం పాటించాల్సిన పోలీసులు పెద్దల పేకాటకు రెడ్కార్పెట్ వేస్తూ, సామాన్యులను వెంటాడి పట్టుకోవడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది. ఇప్పటి వరకూ డివిజన్లో నమోదైన పేకాట కేసుల్లో ఒక్కరైనా రాజకీయ, ఆర్థిక పలుకుబడి ఉన్న వారు లేక పోవడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా పోలీసులు చిత్తశుద్ధితో పని చేసి రిక్రియేషన్ క్లబ్లతో పాటు నందిగామ పాత బస్టాండ్లోని పేకాట శిభిరంపై ఉక్కుపాదం మోపాల్సి ఉంది.
పేకాటను ఉపేక్షించేంది లేదు : ఏసీపీ ఏబిజి తిలక్
డివిజన్లో పేకాట నిర్వహణపై ఏసీపీ ఏబిజి తిలక్ను వివరణ కోరగా, గతంలో రిక్రియేషన్ క్లబ్లలో జరిగాయని, వాటిని నిలువరించినట్లు తెలిపారు. ప్రస్తుతం క్లబ్లలో పేకాట ఆడుతున్న సమాచారం లేదన్నారు. ఇకపై క్లబ్ల వద్ద నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. నందిగామ పాత బస్టాండ్లో నిర్వహిస్తున్న శిభిరంపై కూడా ఆరా తీస్తామన్నారు. పేకాట నిర్వహణను ఉపేక్షించేది లేదన్నారు. సిబ్బంది ఎవరైనా వారికి సహకరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
Updated Date - May 31 , 2025 | 01:10 AM