Land Scam: 600 ఎకరాలు.. 400 కోట్లు
ABN, Publish Date - Mar 19 , 2025 | 04:20 AM
పీలేరు నియోజకవర్గంలో భూఆక్రమణల భాగోతం మళ్లీ తెరపైకి వచ్చింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక పీలేరు మండలంలోని పీలేరు...
పీలేరులో వైసీపీ భూఅక్రమాల చిట్టా.. సీఎంవో ఆదేశాలతో ‘ప్రత్యేక’ విచారణ
కలెక్టర్కు ప్రాథమిక నివేదిక.. నెలాఖరులో సీఎంకు పూర్తిస్థాయి రిపోర్టు!
ఆక్రమణదారులు, అధికారుల గుండెల్లో గుబులు.. 2021లోనే ఈ కబ్జాలు, దోపిడీపై విచారణ.. ఎక్కడెక్కడ జరిగాయో నాటి సబ్కలెక్టర్ నివేదిక
పట్టా, ప్రభుత్వ, చుక్కల భూముల్లో అనధికార లేఔట్లు
ప్లాట్లు వేసి అమ్మి వైసీపీ నేతల దోపిడీ.. అయినా చర్యలు అంతంత మాత్రమే
ప్రభుత్వం మారాక పెద్దఎత్తున ఫిర్యాదులు.. స్వయంగా రంగంలోకి సీఎంవో
(రాయచోటి-ఆంధ్రజ్యోతి)
పీలేరు నియోజకవర్గంలో భూఆక్రమణల భాగోతం మళ్లీ తెరపైకి వచ్చింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక పీలేరు మండలంలోని పీలేరు, దొడ్డిపల్లె, ఎర్రగుంటపల్లె, ముడుపులవేములు, గూ డరేవుపల్లె, బోడుమల్లువారిపల్లె గ్రామ పంచాయతీల్లో పెద్దఎత్తున ప్రభుత్వ, డీకే టీ భూములు ఆక్రమణకు గురయ్యాయి. రియల్టర్ల అవతారమెత్తిన అనేక మంది వైసీపీ నాయకులు సుమారు 600 ఎకరాలను ఆక్రమించి.. వాటిలో ప్లాట్లు వేసి.. అమ్ముకుని రూ.400 కోట్లు దోచుకున్నా రు. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ 2021లోనే వెలుగులోకి తెచ్చింది. అప్పట్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నల్లారి కిశోర్కుమార్రెడ్డి కూడా ఈ అక్రమాలపై పూర్తి సాంకేతిక ఆధారాలతో జిల్లా ఉన్నతాధికారులకు, హైకోర్టు, లోకాయుక్తలకు ఫిర్యా దు చేశారు. లోకాయుక్త విచారణకు ఆదేశించింది. అప్పటి ఉమ్మడి చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆదేశాల మేరకు నాటి మదనపల్లె సబ్కలెక్టర్ జాహ్నవి నేతృత్వంలో సుమారు 80 మంది అధికారులు 10 బృందాలుగా విడిపోయి దాదాపు నెల రో జులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక అందించారు.
సదరు గ్రామ పంచాయతీల పరిధిలో సుమా రు రూ.400 కోట్లు విలువజేసే 600 ఎకరాల భూమి లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు పేర్కొన్నారు. పీలేరులో 100.74 ఎకరాలు, గూడరేవుపల్లెలో 165.60, దొడ్డిపల్లెలో 203.92, బోడుమల్లువారిపల్లెలో 102.99, ఎర్రగుంటపల్లెలో 1.21, ముడుపులవేముల పంచాయతీలో 26.91 ఎకరాలు.. మొత్తం 601.37 ఎకరాల్లో అవకతవకలు జరిగినట్లు సబ్కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. వాటిలో 209.79 ఎకరాల పట్టా భూముల్లో అనధికార లేఔట్లు, 158.19 ఎకరాల చుక్కల భూముల్లో, 129.40 ఎకరాల ప్రభుత్వ భూ మిలో అనధికార లేఔట్లు వేసి అక్రమాలకు పాల్పడ్డారని.. 103.99 ఎకరాల డీకేటీ భూములు అక్రమం గా చేతులు మారాయని స్పష్టం చేశారు. 2021 నవంబరులో ఇచ్చిన ఈ నివేదికలో.. ఎకరా రూ.40 లక్షల నుంచి రూ.కోటి దాకా పలుకుతోందని, సగటున ఎకరా రూ.70 లక్షలు వేసుకున్నా అన్యాక్రాంతమైన 129.40 ఎకరాల ప్రభుత్వ భూమి విలువ రూ.90.58 కోట్లు ఉంటుందని తెలిపారు.
నామమాత్రపు చర్యలతో సరి..
సబ్కలెక్టర్ నివేదిక ఆధారంగా 2022లో రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ పీలేరు మండలంలో పనిచేసిన 12 మంది రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకున్నారు. వారందరినీ సస్పెండ్ చేయడమే కాకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. అయితే అప్పటి అధికార పార్టీ నేతల అండదండలతో వారందరినీ బదిలీలతో సరిపెట్టారు.
తాజాగా విచారణ
పీలేరు మండలంలో అక్రమాలు, ఆక్రమణలపై పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం వీటిపై విచారణ జరపాలని కలెక్టర్ శ్రీధర్ను ఆదేశించింది. దీంతో ఆయన గత నెల 13న ఆక్రమణలను స్వయంగా దగ్గరుండి కూల్చివేయించారు. ఆ సమయంలో అధికారులపై కొందరు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చారు. వీటిని స్వయంగా గమనించిన కలెక్టర్ ఆగ్రహించి గతంలో జరిగిన అక్రమాల పని పట్టాలనుకున్నారు. గత సబ్కలెక్టర్ ఇచ్చిన నివేదికను బయటకు తీశారు. 84 మంది సిబ్బందితో కూడిన ఆరు బృందాలు 10 రోజులపా టు క్షేత్రస్థాయిలో పర్యటించి అన్యాక్రాంతమైన ప్రభుత్వ, డీకేటీ భూములను పరిశీలించాయి. అక్రమాలను నిగ్గుతేల్చి కలెక్టర్కు ప్రాథమిక నివేదిక ఇచ్చాయి. ఆయన మరిన్ని వివరాలతో తుదిమెరుగులు దిద్ది ఈ నెలాఖరులో జరిగే కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పూర్తిస్థాయి నివేదిక అందజేయనున్నట్లు తెలుస్తోంది.
Updated Date - Mar 19 , 2025 | 04:21 AM