మా రూటే.. సెప‘రేటు’!
ABN, Publish Date - Jul 17 , 2025 | 01:24 AM
అందరిదీ ఒక దారి అయితే.. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ది మరో దారి అన్నట్టుగా ఉంది. అవినీతి రుచి మరిగిన కొందరు అధికారులు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అడ్డగోలుగా పోస్టింగ్లు ఇచ్చేస్తున్నారు. నగర జనాభాకు 33 మంది శానిటరీ ఇన్స్పెక్టర్ల అవసరం ఉంటే ఏకంగా 78 మంది పనిచేస్తున్నారు. తాజాగా మరింత మంది కావాలని ఫైల్ సిద్ధం చేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- కార్పొరేషన్లో శానిటేషన్ విభాగం తీరు ఇది
- ఇప్పటికే పరిమితికి మించి శానిటరీ ఇన్స్పెక్టర్ల నియామకం
- మరికొంతమంది అవసరమని ఫైల్ సిద్ధం చేస్తున్న అధికారులు
- జీఓ 218కు విరుద్ధంగా నిర్ణయాలు.. పోస్టింగ్ల వెనుక అవినీతి వ్యవహారం!
-సర్వత్రా వ్యక్తమవుతున్న విమర్శలు
అందరిదీ ఒక దారి అయితే.. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ది మరో దారి అన్నట్టుగా ఉంది. అవినీతి రుచి మరిగిన కొందరు అధికారులు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అడ్డగోలుగా పోస్టింగ్లు ఇచ్చేస్తున్నారు. నగర జనాభాకు 33 మంది శానిటరీ ఇన్స్పెక్టర్ల అవసరం ఉంటే ఏకంగా 78 మంది పనిచేస్తున్నారు. తాజాగా మరింత మంది కావాలని ఫైల్ సిద్ధం చేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్లోని శానిటేషన్ విభాగంలో ఉద్యోగులు ఎంత మంది ఉండాలి అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయితే దీనికి విరుద్ధంగా కార్పొరేషన్ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ శాంక్షన్కు మించి శానిటరీ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)లు ఉన్నారు. మరికొంత మందిని అదనంగా తీసుకోవటానికి తాజాగా ఫైల్ను సిద్ధం చేశారు. ఈ వ్యవహారంలో భారీగా ముడుపుల పర్వం నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్ (సీడీఎంఏ) జారీ చేసిన జీవో నెంబర్ 218 ప్రకారం ప్రతి 40 వేల మంది జనాభాకు ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) ఉండాలి. ఈ లెక్కన విజయవాడ నగరానికి మొత్తం 33 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు అవసరం. కానీ, ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో 78 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు పనిచేస్తున్నారు. అంటే సగానికిపైగా శానిటరీ ఇన్స్పెక్టర్లు అదనంగా ఉన్నారు. అయినా నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేషన్ అధికారులు ఇష్టానుసారంగా శాంక్షన్ పోస్టులకు మించి శానిటరీ ఇన్స్పెక్టర్లను తీసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు.
అవసరం ఉంటే ప్రభుత్వానికి నివేదించాలి
సహజంగా ఒకరిద్దరి అవసరం ఉంటే.. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అనుమతులు తీసుకోవాలే తప్ప.. సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ, కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే అదనంగా ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్లను తప్పించకుండా మరో ఐదారుగురికి శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులు ఇవ్వాలని భావిస్తున్నారు. సచివాలయాలలో పనిచేసే హెల్త్ సెక్రటరీలు కొంత మందికి శానిటరీ ఇన్స్పెక్టర్లుగా పోస్టింగ్లు ఇచ్చేందుకు ఫైల్ను సిద్ధం చేశారు. ఈ ఫైల్ వెనుక భారీ ఎత్తున మామూళ్ల పర్వం నడిచిందన్న ఆరోపణలు వస్తున్నాయి. రేపు ఈ పోస్టింగుల మీద ఎవరైనా కోర్టుకు వెళితే ఉన్నతాధికారులు కోర్టులలో చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తుంది.
జనాభా ప్రకారం చూస్తే..
విజయవాడ నగర జనాభా ప్రకారం ప్రతి 40 వేల జనాభాకు ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, ఆ శానిటరీ ఇన్స్పెక్టర్కు ముగ్గురు శానిటరీ మేస్ర్తీలు ఉండాలి. ఈ లెక్కన 33 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు, వారికి 99 మంది శానిటరీ మేస్ర్తీలు ఉండాలి. ప్రస్తుతం కార్పొరేషన్లో 78 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు 113 మంది శానిటరీ మేస్ర్తీలు ఉన్నారు. వీరు కాకుండా లీడ్ మేస్ర్తీల పేరుతో 173 మందిని అనధికారికంగా తీసుకున్నారు. ఇది కూడా శాంక్షన్కు విరుద్ధంగానే జరిగింది. విజయవాడ నగరంలో వార్డు సచివాలయాల పరిధిలోకి కొత్తగా 260 మంది హెల్త్ సెక్రటరీలు వచ్చారు. కార్పొరేషన్కు ఇంత మంది ఉన్నా కూడా లీడ్ మేస్ర్తీల పేరుతో అనధికారికంగా తీసుకుని ప్రభుత్వ ఆదేశాలకు తూట్లు పొడిచారు.
శానిటరీ సూపర్ వైజర్ పోస్టుకు అవకాశం ఉన్నా..
ఇక శానిటరీ సూపర్ వైజర్ల విషయానికి వస్తే ప్రతి ఐదుగురు శానిటరీ ఇన్స్పెక్టర్లకు ఒక శానిటరీ సూపర్ వైజర్ (ఎస్ఎస్) ఉండాలి. ఈ లెక్కన ఆరుగురు శానిటరీ సూపర్ వైజర్లు ఉండాలి. కార్పొరేషన్లో ప్రస్తుతం ఐదురుగు శానిటరీ సూపర్ వైజర్లే ఉన్నారు. కాబట్టి శానిటరీ సూపర్ వైజర్ పోస్టు ఒకటి కావాలని అదనంగా ప్రభుత్వాన్ని అనుమతి అడిగి తీసుకోవచ్చు. అవసరమైన వాటిని వదిలేసి.. శాంక్షన్ లేకపోయినా.. అనధికారికంగా శానిటరీ ఇన్స్పెక్టర్ల పోస్టులను తీసుకోవటంలోని ఔచిత్యమేమిటో అర్థంకావటం లేదు. విజయవాడలో ఇబ్బడిముబ్బడిగా శానిటరీ ఇన్స్పెక్టర్లను తీసుకున్నా.. ఆ స్థాయిలో పరిస్థితులు ఏమీ మెరుగుపడలేదు. పైగా అవినీతి పెరిగిపోయింది.
Updated Date - Jul 17 , 2025 | 01:25 AM