Medical Colleges: ఏడాది బోధనానుభవం ఉంటే..ప్రొఫెసర్గా పదోన్నతి
ABN, Publish Date - Jul 15 , 2025 | 05:17 AM
నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల మేరకు కొత్త, పాత ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ నిమిత్తం అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతి కల్పించడానికి టీచింగ్ అర్హతల్లో...
ఆరోగ్యశాఖ ఫైల్కు ముఖ్యమంత్రి ఆమోదం
కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల పోస్టుల భర్తీకి బ్రేక్
‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందించిన ప్రభుత్వం
మంత్రికి తెలియకుండానే నోటిఫికేషన్.. సత్యకుమార్ సీరియస్
అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల మేరకు కొత్త, పాత ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ నిమిత్తం అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతి కల్పించడానికి టీచింగ్ అర్హతల్లో మినహాయింపు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు మినహాయింపు ఫైల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఆమోద ముద్ర వేశారు. సర్వీసు నియమాల ప్రకారం మూడేళ్ల బోధనానుభవం ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తారు. అయితే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. 2025-26 సంవత్సరానికి కొత్త కాలేజీల్లో వైద్యవిద్య ప్రవేశాలకు అనుమతి పొందాలంటే వైద్యుల కొరత లేకుండా చూడాలని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. దీంతో ఆరోగ్యశాఖ ఒక ఏడాది బోధనానుభవం ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతి కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఫైల్ పంపింది. ఈ సడలింపు ఈ ఒక్కసారి మాత్రమే వర్తించేలా అనుమతించారు. నిబంధనల సడలింపు నేపథ్యంలో.. కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రొఫెసర్ల నియామక ప్రతిపాదనను వాయిదా వేయాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు.
మంత్రికి తెలియకుండా నోటిఫికేషన్: ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ వాయిదా పడింది. ‘‘అమ్మకానికి వైద్యుల పోస్టులు’’ శీర్షికతో సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఒక్కో పోస్టును రూ.20 నుంచి రూ.25 లక్షలకు అమ్మేస్తున్నారన్న విషయమై స్పందించిన ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల భర్తీని తాత్కాలికంగా వాయిదా చేసింది. విచిత్రం ఏమిటంటే కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ నిమిత్తం ఆరోగ్యశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ గురించి మంత్రి సత్యకుమార్కు కనీసం సమాచారం లేదు. ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చిన తర్వాతే మంత్రి కార్యాలయం ఈ నోటిపికేషన్పై ఆరా తీసింది. అధికారుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వద్ద ఫైల్ పెండింగ్లో ఉండగా నోటిఫికేషన్ ఎందుకిచ్చారని ప్రశ్నించారు. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
Updated Date - Jul 15 , 2025 | 05:22 AM