Judicial Commission: తొక్కిసలాటలో తిరుపతి ఎస్పీ తప్పేమీ లేదు
ABN, Publish Date - Jul 25 , 2025 | 03:33 AM
తిరుపతి ఎస్పీగా పనిచేసిన ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడికి ఊరట లభించింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం ఈ ఏడాది జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో..
ఐపీఎస్ సుబ్బారాయుడికి న్యాయ కమిషన్ క్లీన్చిట్
కమిషన్ నివేదికను ఆమోదించిన క్యాబినెట్
అమరావతి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): తిరుపతి ఎస్పీగా పనిచేసిన ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడికి ఊరట లభించింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం ఈ ఏడాది జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆయన వైఫల్యం ఏమీ లేదని జస్టిస్ సత్యనారాయణమూర్తి కమిషన్ తేల్చినట్లు తెలిసింది. సుబ్బారాయుడు పోలీసుశాఖపరంగా అన్ని ముందస్తు చర్యలూ తీసుకున్నారని క్లీన్చిట్ ఇచ్చినట్లు సమాచారం. న్యాయ కమిషన్ ఈ నెల 10న సమర్పించిన నివేదికను మంత్రివర్గం గురువారం ఆమోదించింది. తొక్కిసలాట అనంతరం సీఎం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. నాడు విధుల్లో ఉన్న పలువురు అధికారులతో పాటు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడిపై బదిలీ వేటు పడింది. ఈ ఘటనపై అన్ని కోణాల్లో న్యాయ ు కమిషన్ విచారించింది. తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకున్నారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తుగా తగినంత మంది అధికారులను నియమించి ఎస్పీగా తన విధి నిర్వహించారని కమిషన్ పేర్కొన్నట్లు తెలిసింది. తిరుపతి ఎస్పీగా ఉన్న సుబ్బారాయుడిని బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన్ను ఎర్రచందనం టాస్క్ఫోర్స్ అధికారిగా, ఆ తర్వాత మద్యం కుంభకోణంపై విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)లో సభ్యుడిగా నియమించింది.
Updated Date - Jul 25 , 2025 | 03:34 AM