NGO Association: దాచుకున్న సొమ్ము కోసం పోరాటాలు బాధాకరం
ABN, Publish Date - Jun 22 , 2025 | 04:11 AM
ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు.. దాచుకున్న సొమ్ము కోసం ఉద్యమాలు చేయాల్సి రావడం బాధకరమని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ అన్నారు.
ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
గుంటూరు(తూర్పు), జూన్ 21(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు.. దాచుకున్న సొమ్ము కోసం ఉద్యమాలు చేయాల్సి రావడం బాధకరమని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ అన్నారు. కొత్త డిమాండ్ల ఊసు లేకుండా.. పాత సమస్యలపై బతిమాలించుకునేలా ప్రభుత్వాలు తెలివిగా వ్యవహరిస్తున్నాయన్నారు. గుంటూరులో శనివారం జరిగిన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వద్ద ఉద్యోగులకు చెందిన రూ.30 వేల కోట్లు ఉన్నాయని, అందులో జీపీఎఫ్, సరెండర్ లీవులు, ఈహెచ్ఎస్ ఇతర సేవల కింద రూ.1850 కోట్ల కోసం ప్రతి ఏటా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. గత ఐదేళ్లలో రివర్స్ పీఆర్సీ అంటూ దాచుకున్న సొమ్ములను కూడా లాగేసుకున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం గత బకాయిలను తొలిదశలో రూ.7 వేల కోట్లు విడుదల చేయడం, పెన్షనర్లకు అదనపు పెన్షన్ ఇవ్వాలనే నిర్ణయాలు హర్షించదగ్గవన్నారు. మిగిలిన సొమ్ము ను దశలవారీగా విడుదల చేసినా సంతోషమని పేర్కొన్నారు. 2023-25 రెండేళ్లకు 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.
Updated Date - Jun 22 , 2025 | 04:11 AM