Minster Payyavula Keshav: రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే
ABN, Publish Date - Jul 27 , 2025 | 04:48 AM
వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం చేసిన ఘనత నాటి సీఎం జగన్కే దక్కుతుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు.
అప్పుపుట్టకుండా చేసిన ఘనుడు జగన్
కొత్తగా 40 అన్న క్యాంటీన్లు: మంత్రి పయ్యావుల
మండపేట, జూలై 26(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం చేసిన ఘనత నాటి సీఎం జగన్కే దక్కుతుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. కోనసీమ జిల్లా రాయవరం మండలం చెల్లూరులో శనివారం ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వైసీపీ పాలనలో జగన్ పది లక్షల కోట్ల మేర అప్పులు చేసి, చివరికి రాష్ట్రానికి అప్పు కూడా పుట్టని పరిస్థితి తీసుకువచ్చారన్నారు. ఇప్పుడు రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ సీఎం చంద్రబాబేనని, ఆయన వల్లే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. తమ ప్రభుత్వ ప్రయత్నాలతో రూ.90 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. గత ఐదేళ్లలో ఎక్కడా పరిశ్రమలు రాలేదని, ఆదాయం పెంచుకునేందుకు ఇసుక, మద్యం, ఖనిజ దోపిడీ తప్ప చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కూటమి పార్టీలకు ఓటు వేసిన ప్రజలకు తామంతా రుణపడి ఉంటామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 40 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
Updated Date - Jul 27 , 2025 | 04:49 AM