AP Education: మెగా పీటీఎం.. గిన్నిస్ రికార్డు
ABN, Publish Date - Jul 29 , 2025 | 03:50 AM
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం (మెగా పీటీఎం-2.0) గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది.
డేటా ఆడిట్ తర్వాత గిన్నిస్ బృందం ధ్రువీకరణ
61 వేల పాఠశాలల సమాచారం విశ్లేషణ
ఈనెల 10న మెగా పీటీఎం-2.0లో పాల్గొన్న 53.4 లక్షల మంది తల్లిదండ్రులు, టీచర్లు
ఆగస్టు రెండో వారంలో పత్రం అందజేత
ఈ రికార్డు టీచర్లకు అంకితం: లోకేశ్
అమరావతి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం (మెగా పీటీఎం-2.0) గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. మెగా పీటీఎం నుంచి సేకరించిన డేటాను ఆడిట్ చేసిన తర్వాత ఈ రికార్డును గిన్నిస్ బృందం ధ్రువీకరించింది. ఇందులో మూడు ఫొటోగ్రాఫ్లు, ఒక వీడియో, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సంఖ్య వివరాలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో డేటాకు ఆ బడికి సంబంధం లేని వ్యక్తులను సాక్ష్యులుగా పరిగణించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ నియమించిన 40 మందికి పైగా ఆడిటర్లు.. 61 వేల పాఠశాలల నుంచి సమీకరించిన డేటాను విశ్లేషించారు. గిన్నిస్ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని ఆగస్టు రెండో వారంలో అమరావతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అందజేయనున్నారు. ఈనెల 10న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మెగా పీటీఎం-2.0లో 53.4 లక్షల మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, ఇతర ఉద్యోగులు సహా మొత్తం 1.5 కోట్ల మంది మెగా పీటీఎంలో భాగస్వామ్యం అయ్యారు.
ప్రభుత్వ విద్యా వికాసానికి గుర్తింపు: లోకేశ్
మెగా పీటీఎం-2.0 గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించడంపై విద్యాశాఖ మంత్రి లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఉపాధ్యాయులకు అంకితమని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం ఐదో వార్షికోత్సవం జూలై 29కి ఒకరోజు ముందు మెగా పీటీఎం గిన్నిస్ రికార్డు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలను తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది గొప్ప ప్రోత్సాహంగా నిలుస్తుందన్నారు. ఈ అరుదైన రికార్డులో భాగస్వామ్యమైన టీచర్లు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ విద్యా వికాసానికి, సమ్మిళిత విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, విద్యాశాఖ చేస్తున్న కృషిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించడం హర్షణీయమన్నారు. మరోవైపు మెగా పీటీఎం గిన్నిస్ రికార్డు సాధించడం ఎనలేని ప్రోత్సాహాన్ని ఇచ్చిందని సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు అన్నారు. మంత్రి లోకేశ్ ఆలోచనలకు అనుగుణంగా ఏపీ మోడల్ విద్యా విధానం కోసం ఒక యజ్ఞంలా పనిచేస్తున్న విద్యాశాఖ, సమగ్రశిక్ష, ఉపాధ్యాయులకు ఇది మరింత ప్రోత్సాహం ఇస్తుందన్నారు.
Updated Date - Jul 29 , 2025 | 03:55 AM