Liquor Scam: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి క్వాష్ పిటిషన్ ఉపసంహరణ
ABN, Publish Date - Jul 08 , 2025 | 04:54 AM
మద్యం కుంభకోణం కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుమారుడు, తుడా మాజీ చైర్మన్ మోహిత్రెడ్డి హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
ముందస్తు బెయిల్కు హైకోర్టులో పిటిషన్
అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుమారుడు, తుడా మాజీ చైర్మన్ మోహిత్రెడ్డి హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆయన తరఫు న్యాయవాది స్పందిస్తూ.. వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కోరారు. వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి క్వాష్ పిటిషన్ ఉపసంహరణకు అంగీకరించారు. మద్యం కుంభకోణం వ్యవహారంలో మంగళగిరి సీఐడీ పోలీసులు మోహిత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. నిందితుల జాబితా నుంచి తన పేరును తొలగించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా.. కేసులో చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని, అందువల్ల రక్షణ కల్పించలేమని న్యాయస్థానం పేర్కొంది. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ దాఖలు చేసుకోవాలని ఆయనకు సూచించింది.
ముందస్తు బెయిల్ మంజూరు చేయండి
మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మోహిత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తుడా చైర్మన్గా ఉండగా మద్యం ముడుపులు తరలించేందుకు అధికార వాహనాలు వాడారనేది తనపై ప్రధానంగా ఉన్న ఆరోపణ అని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా తుడా వాహనాలు వినియోగించి కోట్ల రూపాయలు తరలించడం సాధ్యం కాదన్నారు. తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు కేసులో ఇరికించారని, దర్యాప్తుకు సహకరిస్తానని, కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని తెలిపారు. ముందస్తు బెయిల్ పిటిషన్ను దిగువ కోర్టు కొట్టివేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశాలు పరిగణనలోకి తీసుకొని తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ జరపనుంది.
Updated Date - Jul 08 , 2025 | 04:55 AM