రూ.150 కోట్ల విలువైన స్థలానికి ఎసరు!
ABN, Publish Date - Jul 28 , 2025 | 01:18 AM
ఒక కోటి కాదు.. రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ.150 కోట్ల విలువైన లిడ్క్యాప్ స్థలానికి ఎసరు పెట్టింది వైఎస్ ట్రేడర్స్ అనే సంస్థ. గత వైసీపీ ప్రభుత్వంలో ఎగ్జిబిషన్ నిర్వహణ కోసమని లీజుకు తీసుకున్న సంస్థ ఆ తర్వాత ప్రభుత్వంలోని పెద్దల అండదండలతో లీజులను పొడిగిస్తూ వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పొడిగించేందుకు ప్రయత్నించింది. లిడ్క్యాప్ అధికారులు, పాలకవర్గం ఒప్పుకోకపోవడంతో అనేక కారణాలు చూపుతూ కోర్టుకు లాగింది. విసిగిపోయిన అధికారులు ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
- ఎగ్జిబిషన్ కోసం ‘లిడ్క్యాప్’ నుంచి లీజుకు తీసుకున్న వైఎస్ ట్రేడర్స్
- గత వైసీపీ ప్రభుత్వ పెద్దల అండదండలతో లీజు పొడిగింపు
- కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగింపునకు ప్రతిపాదన
- తిరస్కరించిన లిడ్క్యాప్ అధికారులు, పాలకవర్గం
- కోర్టు కేసులతో లిడ్క్యాప్కు ముచ్చెమటలు పట్టిస్తున్న వైఎస్ ట్రేడర్స్
- సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లిన ఉన్నతాధికారులు
ఒక కోటి కాదు.. రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ.150 కోట్ల విలువైన లిడ్క్యాప్ స్థలానికి ఎసరు పెట్టింది వైఎస్ ట్రేడర్స్ అనే సంస్థ. గత వైసీపీ ప్రభుత్వంలో ఎగ్జిబిషన్ నిర్వహణ కోసమని లీజుకు తీసుకున్న సంస్థ ఆ తర్వాత ప్రభుత్వంలోని పెద్దల అండదండలతో లీజులను పొడిగిస్తూ వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పొడిగించేందుకు ప్రయత్నించింది. లిడ్క్యాప్ అధికారులు, పాలకవర్గం ఒప్పుకోకపోవడంతో అనేక కారణాలు చూపుతూ కోర్టుకు లాగింది. విసిగిపోయిన అధికారులు ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
విజయవాడ నగరంలోని ఆటోనగర్ గేటు దగ్గర తూర్పున 100 అడుగుల రోడ్డు, దక్షిణం
బందరు రోడ్డు (ఎన్హెచ్ - 65), పడమర కార్పొరేషన్ రోడ్లను కలిగిన అత్యంత ఖరీదైన స్థలంలో చర్మకారులకు శిక్షణ, ఉపాధిని కల్పించేందుకు లెదర్ ఇండస్ర్టీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (లిడ్ క్యాప్)కు సంబంధించి మోడల్ లెదర్ గూడ్స్ మాన్యుఫాక్చరింగ్ (ఎంజీఎల్ఎం) యూనిట్ ఉంది. ఈ యూనిట్లో గతంలో చర్మకారులు చెప్పులు, బూట్లు, బ్యాగులు వంటి లెదర్ ఉత్పత్తులు తయారు చేసేవారు. కాలక్రమంలో మూతపడింది. దీనిని పునరుద్ధరించాల్సిన గత వైసీపీ ప్రభుత్వం ఎగ్జిబిషన్ కమ్ సేల్ కోసమని ‘వైఎస్ ట్రేడర్స్’ అనే సంస్థకు ముందుగా 10 రోజుల కాలానికి లీజుకు ఇచ్చింది. ఆ తర్వాత నెల, రెండు నెలలు, సంవత్సరం, రెండేళ్లు ఇలా అప్పట్లో గడువులు పొడిగిస్తూ ముందకుపోయారు. ఈ సంస్థకు అప్పట్లో కేవలం అద్దెకు మాత్రమే ఇవ్వటం జరిగింది. ఎంతో దూరాలోచనతో ఉన్న ఆ సంస్థ లిడ్క్యాప్ స్థలంలో ఒక చిన్న షెడ్డు, ఇంటీరియర్ వంటి పనులు చేపట్టింది. వాస్తవానికి ఈ పనులు చేపట్టకూడదు. అప్పట్లో ప్రభుత్వ పెద్దలతో ఉన్న సంబంధాల కారణంగా వైఎస్ ట్రేడర్స్ అనే సంస్థ తమకు అనుగుణంగా మలచుకుంది. అగ్రిమెంట్లో ఎక్కడా నిర్మాణాలు కట్టమని లేకున్నా ఆ సంస్థ వాటిని చేపట్టడమే కాకుండా.. ఆ పేరుతో ఇప్పటికీ ఖాళీ చేయకుండా ‘లిడ్ క్యాప్’లో తిష్టవేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ స్థలంలో ‘లెదర్ పార్క్’ కట్టేవరకు లీజుకు ఇవ్వాలంటూ అభ్యర్థన కూడా చేసుకుంది. అనూహ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో సంస్థ ఆశలు ఫలించలేదు.
ప్రభుత్వం మారాక.. లీజు పొడిగింపు ప్రయత్నాలు
గత ప్రభుత్వంలో కుదుర్చుకున్న లీజు గడువు కిందటి ఏడాది జూన్ నెలాఖరుతో ముగిసింది. లీజు కొనసాగింపునకు ‘వైఎస్ ట్రేడర్స్’ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలను పరిశీలించిన మీదట ఎంజీఎల్ఎం షెడ్డు శిథిలావస్థలో ఉండటం, ఈ స్థలంలో ఎన్టీఆర్ లెదర్ పార్క్ నిర్మాణ ప్రతిపాదనలు ఉండటంతో లీజు కొనసాగింపునకు లిడ్క్యాప్ పాలకవర్గం, అధికారులు అంగీకరించలేదు.
పాతబకాయిలు చూపి కదలని సంస్థ
నిబంధనల ప్రకారం లిడ్క్యాప్ అధికారులు, పాలకవర్గం వైఎస్ ట్రేడర్స్కు ఖాళీ చేయాలని సదరు సంస్థకు నోటిసులు పంపింది. గత ప్రభుత్వ హయాంలో లెదర్ ఉత్పత్తుల సరఫరాకు సంబంధించి (ఇది వేరే కాంట్రాక్టు) బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, అవి వచ్చే వరకు సమయం ఇవ్వాల్సిందిగా కోరటం జరిగింది. లిడ్క్యాప్ పాలకవర్గం సోషల్ వెల్ఫేర్ నుంచి రావాల్సిన బకాయిలను మొత్తం మీద రప్పించింది. బకాయిలు చెల్లింపు చేయిస్తామని, ఖాళీ చేస్తున్నట్టు అగ్రిమెంట్ రాసి ఇవ్వమని ‘వైఎస్ ట్రేడర్స్’ను కోరగా.. ఆ సంస్థ గొంతులో వెలక్కాయ పడింది.
పలు మార్లు కోర్టులను ఆశ్రయించి..
తనకు రావాల్సిన బకాయిలను కూడా లిడ్క్యాప్ చెల్లించేందుకు చర్యలు చేపట్టినా.. ‘వైఎస్ ట్రేడర్స్’ ఆలోచన వేరుగా ఉండటం వల్ల తనకు గడువు కావాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసును ఉభయులు సంప్రదింపుల మార్గంలో పరిష్కరించుకోమని హైకోర్టు కొట్టి వేసింది. దీంతో రెండో సారి మళ్లీ కోర్టును ఆశ్రయించింది. ఈ దఫా కోర్టు స్వల్ప కాలానికి స్టే ఇస్తూ ఆ కాలానికి నెలకు రూ.75 వేల చొప్పున అద్దె చెల్లించమని ఆదేశించింది. వైఎస్ ట్రేడర్స్ అద్దె డబ్బులు చెల్లించింది. స్టే కాలం ముగిశాక.. కోర్టు ఆ కేసును కూడా డిస్మిస్ చేసింది.
యూనిట్ భవనం కూల్చేయమని నివేదిక
ఈ స్థలంలో లెదర్ భవన్ ఏర్పాటు ఆలోచనలో ఉన్న లిడ్క్యాప్ ప్రస్తుత భవన పటిష్టతకు సంబంధించి ఆర్అండ్బీ శాఖను రిపోర్టు కోరగా.. ఆ శాఖ నిపుణుల బృందం పరిశీలించి కూల్చివేయాలని నివేదిక ఇచ్చింది. దీంతో లిడ్క్యాప్ అధికారులు ముందుగా ప్రహరీగోడను కొద్ది భాగం కూల్చారు.
ప్రహరీ గోడ కూల్చివేతపై కోర్టుకు..
ప్రహరీ గోడ కూల్చివేత నేపథ్యంలో వైఎస్ ట్రేడర్స్ సంస్థ తాను ఇందులో ఎంతో పెట్టుబడి పెట్టి ఉన్నానని, తనకు నష్టం జరుగుతోందని మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై కేసు ఇంకా నడుస్తోంది.
చర్మకారుల సమస్యలు పట్టవా ?
ఒక పక్క చర్మకారులు తమకు శిక్షణ కల్పించి లెదర్ ఉత్పత్తుల తయారీ ప్రారంభించాలని, తమకు ఉపాధి కల్పించాలని లిడ్క్యాప్ మీద ఒత్తిడి తీసుకువస్తున్నారు. మరోవైపు కోర్టు కేసులతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో లిడ్క్యాప్ ఉంది.
ప్రభుత్వానికి నివేదించిన లిడ్క్యాప్
ఏడాది కాలంగా లీజుదారైన వైఎస్ ట్రేడర్స్ సంస్థతో తలబొప్పికడుతున్న వైనాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి లిడ్క్యాప్ ఉన్నతాధికారులు, పాలకవర్గం తీసుకువెళ్లింది. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ప్రతిపాదిత స్థలంలో లెదర్ పార్క్ నిర్మాణానికి త్వరగా శ్రీకారం చుట్టాలని అభ్యర్థించింది. చర్మకారుల ద్వారా ఉత్పత్తులు తయారు చేయించేందుకు శ్రీకారం చుట్టాలని భావిస్తూ.. ఆర్టీసీ, పోలీసు, ఎక్సైజ్, ఇరిగేషన్, పాఠశాల తదితర శాఖలకు అవసరమైన లెదర్ ఉత్పత్తులన్నింటినీ కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించగా.. ప్రభుత్వం జీఓ కూడా ఇచ్చింది. ఈ కేసులో ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Updated Date - Jul 28 , 2025 | 01:18 AM