గాలివాన భీభత్సం
ABN, Publish Date - Apr 27 , 2025 | 11:30 PM
పత్తికొండ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం గాలివాన భీభత్సం సృష్టించింది. హోసూరు రహదారిలో చెట్టు రోడ్డుకు అడ్డంగా కూలిపోయింది. ఆ సమయంలో వెళుతున్న ఆటోపై చెట్టు కొమ్మలు పడ్డాయి.
పత్తికొండలో విరిగిన చెట్లు, ఆస్పరిలో పిడుగులు
దేవనకొండ మండలంలో ఓ మోస్తరు వర్షం
పత్తికొండ, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): పత్తికొండ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం గాలివాన భీభత్సం సృష్టించింది. హోసూరు రహదారిలో చెట్టు రోడ్డుకు అడ్డంగా కూలిపోయింది. ఆ సమయంలో వెళుతున్న ఆటోపై చెట్టు కొమ్మలు పడ్డాయి. అయితే ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అలాగే ఆర్డీవో కార్యాలయం వద్ద కూడా చెట్టు కొమ్మ విరిగి పడింది. సెలవు కావడంతో ప్రజలెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
కొబ్బరి చెట్టుపై పిడుగు
ఆస్పరి, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తోగలుగల్లు గ్రామ సమీపంలోని కొబ్బరి చెట్టుపై ఆదివారం పిడుగు పడింది. దీంతో చెట్టుపై మంటలు చెలరేగాయి. మండలంలోని తురువగల్లు, దొడగొండ, తంగరుడోణ, కల్లపరి, గ్రామాలలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా పిడుగులు పడడంతో రైతులు, ప్రజలు ఆందోళన చెందారు.
దేవనకొండలో వర్షం
దేవనకొండ, ఏప్రిల్ 27 (ఆంధ్ర జ్యోతి): మండలంలో ఆదివారం సాయంత్రం వర్షం కురిసింది. ఎండ వేడిమితే ఇబ్బందులు పడిన ప్రజలకు సాయంత్రం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం కలిగింది. కరివేముల, కప్పట్రాళ్ల, ఈదుల దేవరబండ, కుంకనూరు, తెర్నేకల్ గ్రామాల్లో ఓ మోస్తరు వర్షం కురువడంతో వేసవి దుక్కులు చేసేందుకు ఉపయోగపడుతుందని రైతులు తెలిపారు.
Updated Date - Apr 27 , 2025 | 11:30 PM