గోరంట్ల గాడిన పడేనా?
ABN, Publish Date - Jun 02 , 2025 | 12:11 AM
మండలంలో హంద్రీ నదిపై గోరంట్ల వంతెన నిర్మాణం దశాబ్దాల కల. పిల్లలర్లకే పరిమితమైన ఈ నిర్మాణం ముందుకు సాగేనా అన్నది ప్రశార్థకరంగా మారింది.
దశాబ్దాల కల హంద్రీనదిపై వంతెన
పిల్లర్లకే పరిమితమైన పనులు
రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆశలు
కోడుమూరు రూరల్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): మండలంలో హంద్రీ నదిపై గోరంట్ల వంతెన నిర్మాణం దశాబ్దాల కల. పిల్లలర్లకే పరిమితమైన ఈ నిర్మాణం ముందుకు సాగేనా అన్నది ప్రశార్థకరంగా మారింది. ఇక్కడ వంతెన నిర్మాణం జరిగితే మూడు నియోజకవర్గాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కోడుమూరు, పత్తికొండ, డోన్ నియోజకవర్గాల నుంచి పలుగ్రామాల ప్రజలు ఇటుగా ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా హంద్రీ అవతలి వైపు గ్రామాలు ఎర్రగుడి, కొత్తపల్లి, మన్నెకుంట, ఎర్రబాడు, తొగర్చేడు, మల్లాపురం, పోతుగల్లు, రామక్రిష్ణాపురం తదితర చోట్ల నుంచి కోడుమూరు, కర్నూలు వంటి చోట్లకు వివిధ పనులు, వైద్యసేవల కోసం వెళ్తున్నారు. అలాగే గోరంట్ల గ్రామ రైతులకు హంద్రీ అవతలి వైపున పంట పొలాలు ఉన్నాయి. దీంతో ఇక్కడి హంద్రీనది దాటితే సమయం, దూరం కలిసివస్తుంది. వర్షాకాలంలో ఎగువ నుంచి వరద వస్తే ఇరువైపులా నుంచి రాకపోకలు స్తంభిస్తున్నాయి. వరద తగ్గే వరకు చుట్టూ సుమారు 20 కిమీ అదనంగా ప్రయాణించాల్సి ఉంటుంది. గోరంట్ల రైతులు పంటలను పర్యవేక్షించుకోలేక దిగుబడులను కోల్పోతున్నారు. పంచాయతీరాజ్ శాఖ (పీఐయూ) నిధులు రూ.21 కోట్లతో హంద్రీనదిపై వంతెన, కొత్తపల్లి వరకు రహదారి మంజూరు చేశారు. దీంతో ఏళ్లనాటి కల నెరవేరుతుందని ప్రజలు విశ్వసించారు. పనులు సాగుతున్న క్రమంలో పిల్లర్ల దశలో పనులు నిలిచిపోయాయి. యంత్రాలను ఒడ్డుకు చేర్చి కాంట్రాక్టర్ వెళ్లిపోయాడు. బిల్లుల పెండింగ్ కారణంగా పనులు నిలిచిపోవడంతో ప్రజలు నిరాశకు గురయ్యారు. వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో హంద్రీనదిలో తాత్కాలికంగా మట్టిరోడ్డు నిర్మించారు. దీంతో ఆ రోడ్డుపై ఆటోలు, బైక్లు, ట్రాక్టర్, లారీ వంటి వాహనాలు, ఎద్దులబండ్లు రాకపోకలు సాగించేవి. అయితే ఇటీవల కురిసిన వర్షాలతో ఎగువ నుంచి వరద రావడంతో మట్టిరోడ్డు కోతకు గురైంది. వాహనా లు వెళ్లేందుకు కష్టతరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం హయాంలోనైనా పనులు సాగుతా యని స్థానికులు ఆశ పెట్టుకున్నారు.
Updated Date - Jun 02 , 2025 | 12:11 AM