నాణ్యత లేకుండా పనులు చేస్తారా?
ABN, Publish Date - Jun 14 , 2025 | 01:22 AM
రోడ్డు నిర్మాణం నాణ్యత లేకుండా చేస్తారా అంటూ పంచాయతీరాజ్ అధికారులపై కలెక్టర్ రాజకుమారి గనియా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్షణమే మరమ్మతులు చేయాలని ఆదేశం
పునరావృతం అయితే చర్యలు
పంచాయతీ అధికారులపై కలెక్టర్ రాజకుమారి ఆగ్రహం
నంద్యాల, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): రోడ్డు నిర్మాణం నాణ్యత లేకుండా చేస్తారా అంటూ పంచాయతీరాజ్ అధికారులపై కలెక్టర్ రాజకుమారి గనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్ర వారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘తారుమారు’ కథనంపై ఆమె స్పందించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేసి ఆ తర్వాత కాంట్రాక్టర్తో నాణ్యత ఉండేలా రోడ్డు పని పూర్తిచేయాలని ఆదేశించారు. రోడ్డు కోతకు గురికాకుండా కల్వర్ట్ల భద్రత కుడా పెంచాలన్నారు. భవిష్యత్లో ఇలాంటివి పునరావృత మైతే శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.
హుటిహుటిన పనులు
కలెక్టర్ రాజకుమారి ఆదేశాలతో దెబ్బతిన్న డోన్ నియోజకవర్గ పరిధిలోని చిన్నపూదిళ్ల- గుండాల రహదారి తాత్కాలిక మరమ్మతులు ఉదయాన్నే చేశారు. జేఈ ప్రభాకర్రెడ్డి తదిదర సిబ్బంది దగ్గరుండి పనులు చేయించారు. రాకపో కలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశారు. ఎక్కడైతే దెబ్బతినిందో.. అక్కడక్కడ మట్టిని వేసి గుంతలు పూడ్చారు. అనంతరం రోడ్డు రోలర్తో చదును చేశారు. ఇదిలా ఉండగా వర్షం రావడంతో పాటు దెబ్బతిన్న రోడ్డు ప్రాంతం వద్ద ఏటువాలుగా ఉండటం తో వర్షపు నీరు మొత్తం రోడ్డును కోసేసిందని అధికారుల వాదన. ఏది ఏమైనా ‘తారుమారు’ కథనంతో ఆశాఖ వర్గాల్లో ఒక్కసారిగా అలజడి రేపినట్లైంది.
Updated Date - Jun 14 , 2025 | 01:22 AM