ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి
ABN, Publish Date - Jul 31 , 2025 | 11:56 PM
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు
డోన్ రూరల్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం సీపీఐ జిల్లా మహాసభల ప్రతినిధుల సభ పట్టణంలోని మార్కెట్ యార్డు ఎదురుగా ఉన్న క్రిస్టియన్ హాలులో నిర్వహించారు. జిల్లా ప్రతినిధుల సభ సందర్భంగా పార్టీ పతాకాన్ని సీపీఐ సీనియర్ నాయకురాలు నక్కి బాలమ్మ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో నాగేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయని, సీపీఐ నాయకులు, కార్యకర్తలు గ్రామగ్రామాన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సూపర్సిక్స్ పథకాల అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఉద్యమించాలన్నారు. తాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య మాట్లాడుతూ డోన్లో గతంలో రుద్రాక్షగుట్ట, పేరెంటాలమ్మ గుడి ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సభలో ప్రజానాట్య మండలి నాయకులు కోయలకొండ నాగరాజుతో పాటు కళాకారులు పాడిన ఉద్యమ పాటలు ఆకట్టుకున్నాయి. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్య, రాధాకృష్ణ, సీపీఐ పట్టణ, మండల కార్యదర్శులు మోటరాముడు, నారాయణ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జులైఖ, ఏఐవైఎఫ్ నాయకులు రణత్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 31 , 2025 | 11:56 PM