ట్రాఫిక్ సమస్యకు చెక్
ABN, Publish Date - Jun 22 , 2025 | 12:01 AM
ఎమ్మిగనూరు పట్టణ ట్రాఫిక్ సమస్యకు చెక్ పడబోతుంది. బైపాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ రూ.225 కోట్లు మం జూరు చేసింది. నేషనల్ హైవే ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో సర్వేచేసిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేయాల్సి ఉంది.
ఎమ్మిగనూరు బైపాస్ రోడ్డుకు రూ.225కోట్లు
హనుమాపురం-ధర్మాపురం వరకు 9 కి.మీ.లు నిర్మాణం
కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం
నిధులు మంజూరు..
డీపీఆర్ తయారీకి ఆదేశాలు
మంత్రాలయం బైపాస్కు అడ్డంకిగా మారిన భూసేకరణ
కర్నూలు, జూన్ 21(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు పట్టణ ట్రాఫిక్ సమస్యకు చెక్ పడబోతుంది. బైపాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ రూ.225 కోట్లు మం జూరు చేసింది. నేషనల్ హైవే ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో సర్వేచేసిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేయాల్సి ఉంది. నేషనల్ హైవే- 167 ఆదోని- ఎమ్మిగనూరు రహదారిలోని హనుమా పురం నుంచి ధర్మాపురం వద్ద ఎమ్మిగనూరు- మంత్రాలయం రోడ్డును కలుపుతూ దాదాపు తొమ్మిది కిలోమీటర్లు బైపాస్ రోడ్డు నిర్మించనున్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఇటీవలే ఢిల్లీ వెళ్లి ఎమ్మిగనూరు రింగ్ రోడ్డు, ఎమ్మిగనూరు-కోడుమూరు రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని మే 12న సీఎం చంద్ర బాబును కలసి విన్నవించారు. బైపాస్ రోడ్డు భవిషత్తులో రింగు రోడ్డుగా మారే అవకాశం లేకపోలేదు. ఇది నిర్మాణం పూర్తైతే బెంగు ళూరు, బళ్లారి, ఆదోని ప్రాంతాల నుంచి మంత్రాలయం, రాయచూరు వంటి ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఎమ్మిగనూరులోకి రాకుండానే బయట నుంచే దూసుకు పోనున్నాయి. మంత్రాలయం బైపాస్ రోడ్డు నిర్మాణానికి భూ సేకరణ సమస్య వెంటాడుతుంది.
భారత్ మాల ప్రాజెక్టులో..
భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రాలు అనుసంధానం చేస్తూ 2014-15లో 483 కిలో మీటర్లు జాతీయ రహదారి-167 నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నేషనల్ హైవే-67 కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా హగరి నుంచి తెలంగాణ రాష్ట్రం కోదాడ వద్ద నేషనల్ హైవే-65 కలుపుతూ నేషనల్ హైవే-167 నిర్మాణం చేశారు. జిల్లాలో ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం మీదుగా ఈరోడ్డు సాగిపోతుంది. నిర్మాణం పూర్తి చేసుకొని పదేళ్లు అవుతుంది. అలైన్మెంట్ ప్రకారం ఆదోని, ఎమ్మిగనూరు, పట్టణాల్లో సాగిపోతుంది. ట్రాఫిక్ రద్దీ నియంత్రణలో భాగంగా ఆదోని బైపాస్ రోడ్డు నిర్మాణం పనులు ఇప్పటికే మొదలు పెట్టారు. మంత్రాలయం బైపాస్ రోడ్డు భూసేకరణకు శ్రీకారం చుట్టారు. ఎమ్మిగనూరు పట్టణంలో అన్నమయ్య కూడలి, ఓంశాంతి కూడలి, మార్కెట్ యార్డు, ముగతి కూడలి మీదుగా 16 కిలో మీటర్లు నేషనల్ హైవే-167 రోడ్డు ఉంది. పట్టణ జనాభాతో పాటు కాలనీలు విస్తరిస్తుండడంతో ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారింది. ప్రధాన కూడళ్లు ప్రమాదాలకు ఆనవాళ్లుగా మారాయి. జాతీయ రహదారిపై వేగంగా దూసుకు పోయే వాహనాలు వల్ల ప్రజలు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాల నియంత్రణ కోసం జాతీయ రహదారి-167 ఇంజనీర్లు ఎమ్మిగనూరు బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.
బైపాస్కు రూ.225 కోట్లు మంజూరు
జాతీయ రహదారి-167లో భాగంగా ఆదోని-ఎమ్మిగనూరు రోడ్డులోని హను మాపురం నుంచి ఎమ్మిగనూరు-మాలపల్లి రోడ్డు కలుపుతూ ధర్మాపురం దగ్గర ఎమ్మిగనూరు- మంత్రా లయం రోడ్డును కలుపుతూ 9 కిలోమీటర్లు బైపాస్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆమోదం తెలుపుతూ రూ.225 కోట్లు మంజూరు చేసింది. రోడ్డుతో పాటు అవసరమైన ప్రదేశంలో కల్వర్టులు, వంతెనలు నిర్మాణం కోసం క్షేత్రస్థాయిలో సర్వే చేసి డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపుతారు. పరిపాలన, సాంకేతిక అనుమతులు భూసేకరణ చేస్తారు. ఆ వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడుతారు. ప్రస్తుతం 10 మీటర్లు బీటీ రోడ్డు, ఇరువైపుల మట్టి రోడ్డు (సోల్డర్) కలిపి 12 మీటర్ల వెడల్పుతో నేషనల్ హైవే-167 బైపాస్ రోడ్డు నిర్మాస్తారు. భవిషత్తులో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి వీలుగా 45 మీటర్ల వెడల్పుతో భూ సేకరణ చేయనున్నారు. హనుమాపురం, సర్ధార్పురం, వెంకటాపురం, హలహర్వి, ముగతి రెవిన్యూ గ్రామాల మధ్యలో అవసరమైన భూ సేకరణ చేసే అవకాశం ఉంది.
మంత్రాలయంలో భూ సేకరణ సమస్య
మంత్రాలయంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ రూ.49 కోట్లు మంజూరు చేసింది. అందులో భూసేకరణకు రూ.16కోట్లు కేటాయించారు. దక్షిణాది ఆధ్యాత్మిక క్షేత్రం రాఘవేంద్రస్వామి దర్శానార్థం దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తుల వాహనాలు, స్థానిక వాహనాలతో రాఘవేంద్ర కూడ లిలో నిత్యం భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ముఖ్యంగా గురు, శుక్రవారాలు, వారాంతరం శని, ఆదివారాల్లో అంటే వారంలో నాలుగు రోజులు ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలని రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసు కెళ్లడంతో స్పందించి నిధులు మంజూరు చేశారు. జాతీయ రహదారి-167 ఎమ్మిగనూరు-మంత్రాలయం రోడ్డు కల్లుకుంట శివారులోని అభయాంజనేయ స్వామిగుడి నుంచి చెట్నేపల్లి సమీపంలో మంత్రాలయం- మాధవరం రోడ్డును అనుసంధానం చేస్తూ 4.50కిలో మీటర్లు బైపాస్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. ఈ ఏడాది డిసెంబరు ఆఖరులోగా పూర్తి చేయాలన్నది లక్ష్యం. భూ సేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. రోడ్డు నిర్మాణంలో రాఘవేంద్రస్వామి మఠం భూములు కూడా కోల్పోయే అవకాశం ఉంది. అలైన్మెంట్ మార్పు చేసి మఠం భూములు పోకుండా చూడాలని అభ్యంతరం పెట్టినట్లు సమాచారం. దీంతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి భూ సేకరణ అడ్డంకిగా మారింది.
Updated Date - Jun 22 , 2025 | 12:01 AM